Monday, April 23, 2012



నా తొలి ఇబుక్
నా యాత్ర బ్లాగు సందర్శకులకందరికీ అభివందనములు.  ఈ బ్లాగుకు లభించిన ఆదరణ అపూర్వం.  మీ అపురూప ప్రోత్సాహంతో నేను చేసిన ఇంకొక సాహసం..నా తొలి ఇబుక్  యాత్రా దర్శిని  నల్గొండజిల్లా.  అదికూడా ఏదో మేము చూసినవన్నీకాకుండా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పుస్తకం చెయ్యాలనే సాహసంతో మొదలుపెట్టిన కార్యక్రమం.  సంకల్పమైతే వున్నది.  ఆ దైవ కృప, మీ అందరి ఆదరణ లభిస్తే పూర్తిచెయ్యగలననే విశ్వాసం వున్నది. 

ఈ తొలిమెట్టు ఎక్కటానికి  చేయూతనిచ్చినవారు కినిగె శ్రీ చావా కిరణ్ కుమార్ గారు.  వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బ్లాగుద్వారా తెలియజేసుకుంటున్నాను.  నా ఈ ప్రయత్నాన్ని మీరంతా ఆదరిస్తారని ఆశిస్తూ లింకు కింద ఇస్తున్నాను.  ఈ విషయంలో మీ సలహాలు, ప్రోత్సాహం కోరుతున్నాను.

Friday, April 20, 2012

శ్రీ నదీ నరసింహస్వామి ఆలయం



శ్రీ నదీ నరసింహస్వామి ఆలయం

దొడ్డమల్లూరులోని శ్రీ రామాప్రమేయస్వామి ఆలయంనుంచి ఉదయం 10-05కి బయల్దేరి జాతీయ రహదారిమీదకి రాగానే, రోడ్డుదాటి ఎదురుగావున్నరోడ్డులో వెళ్ళాము.  గుంటలతోకూడిన మట్టి రోడ్డు..చుట్టూ పొలాలు, చెట్లూ .. ప్రకృతి సౌందర్యం చూస్తూ రోడ్డుసంగతి మర్చిపోయాము.  దాదాపు రెండు కిలో మీటర్ల దూరం వెళ్ళాక చేరాము శ్రీ నదీ నరసింహస్వామి ఆలయం.  ఆలయం చిన్నదే. 

దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మింపబడిన ఈ ఆలయంలో స్వామిని కణ్వ మహర్షి ప్రతిష్టించాడంటారు.  ఆలయం పక్కనే కణ్వనది ప్రవహిస్తున్నది.      కణ్వ మహర్షి ఈ  నది ఒడ్డున కొంతకాలం తపస్సు చేసుకున్నారుట.  అందుకే ఈ నదికి కణ్వా నది అని పేరు.  ఎగువ కట్టిన ఆనకట్టవల్ల ప్రస్తుతం ఈ నదిలో నీరు లేదు.  వర్షాకాలంలో రిజర్వాయరు నిండిన తర్వాత మాత్రమే ఈ నదిలోకి నీరు వస్తుంది.

ఈ స్వామి అత్యంత మహిమాన్వితుడని భక్తుల నమ్మిక.  ఇక్కడ 48 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ ముడుపుకట్టిన వారి కోరికలు శీఘ్రమే నెరవేరుతాయని నమ్మకం.

మేము వెళ్ళేసరికి ఆలయం మూసి వున్నది.  పూజారిగారు అప్పుడే అల్పహారంకోసం ఇంటికి వెళ్ళారని, తొందరగానే వచ్చేస్తారని అక్కడ కొబ్బరికాయలు అమ్మే ఆవిడ చెప్పింది.  గోడమీద వున్న పూజారిగారి సెల్ నెంబరుకు దర్శనానికి వచ్చినవారు ఫోన్ చేశారు.  వచ్చేస్తున్నానన్నారని 15 నిముషాలు వేచి చూశాము.  సమయాభావమువల్ల ఇంకా వేచివుండలేక బయల్దేరాము.  దాదాపు మైన్ రోడ్డుకి వచ్చాక ఒక పంతులుగారు బైక్ మీద లోపలకి వెళ్ళటము చూశాము.  బహుశా ఆయనే అయ్యుంటారనుకున్నాంకానీ ఇంకా చూడవలసినవి చాలా వున్నాయిగనుక ముందుకే సాగాము.


Sunday, April 15, 2012

శ్రీ రామాప్రమేయస్వామి, దొడ్డమల్లూరు

ఆలయం లోపల
గుడి లోపలనుంచి -- ఆలయ విమానం - రాజ గోపురం
ఆలయ రాజ గోపురం

<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE MicrosoftInternetExplorer4

శ్రీ రామాప్రమేయస్వామి, దొడ్డమల్లూరు

ఉదయం 9-20 కి చేరుకున్నాము ఈ ఆలయానికి.

చెన్నపట్టణ దాటి 1 కి.మీ. వెళ్ళిన తర్వాత ఎడమవైపు ఆర్చి కనబడుతుంది. దానిలోంచి వెళ్తే వస్తుంది త్రేతాయుగంనాటి శ్రీరామాప్రమేయస్వామి ఆలయం. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం వున్నారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తిని అప్రమేయస్వామిగా ప్రతిష్టించి పూజించారు. అందుకే స్వామికి శ్రీరామాప్రమేయస్వామి అనే పేరువచ్చింది. కణ్వ మహర్షీ, కపిల మహర్షీ ఆ కాలంలోనేకాదు, ఇప్పటికీ ఈ స్వామిని సేవిస్తున్నారని ప్రజల నమ్మకం. ఆలయ తలుపులు తాళం వేసిన తర్వాత వినబడే గర్భగుడి తలుపులు తెరిచిన శబ్దాలు, గంటల శబ్దాలు తార్కాణంగా చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ స్వామిగురించి 12 అధ్యాయాలలో వర్ణించారు.

ప్రదక్షిణ మార్గంలో వున్న ఉపాలయంలో అమ్మ అరవిందవల్లితాయారు తామరపువ్వులో పద్మాసనస్దితగా దర్శనమిస్తుంది. చతుర్భుజి. పైన రెండు చేతులలో తామరలు, ఇంకో రెండు చేతులు వరద, అభయ ముద్రలతో భక్తుల ఆర్తిని తీరుస్తూ వుంటాయి.

తర్వాత వచ్చే ఉపాలయంలో గరుడ పీఠంపైన పారాడే చిన్ని కృష్ణుడిని చూడవచ్చు. కుడిచేతిలో వెన్నముద్దతో మనవైపే పారాడుతూ వస్తున్నట్లుండే ఈ కన్నయ్యను చూసి పులకించని మది వుండదేమో. ఈ చిన్నికృష్ణుడు సంతానంలేనివారికి సంతానం ఇచ్చే అభయప్రదాత. కోరిక నెరవేరినవారు స్వామికి తమ శక్తికొలదీ చెక్క, వెండితో చేసిన ఊయల సమర్పిస్తారు.

ఈ స్వామిని దర్శించినంతనే మహాకవి పురందరదాసు .. జగదోధ్ధారణా .. అనే కృతి గానం చేశాడు. ఆయన స్మృతి చిహ్మంగా రాజ గోపురం బయటవుండే మండపానికి పురందరదాసుమండపమని ఆయన పేరు పెట్టారు.

ఇంకా ముందుకు వెళ్తే ఆళ్వారులు, శ్రీ వైకుంఠ నారాయణస్వామి, స్తంబంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామిని దర్శించి తర్వాత సాలిగ్రామ శిలలో మలచబడ్డ శ్రీ అప్రమేయస్వామిని దర్శించవచ్చు. స్వామి దయ అపారమనీ, కొలతలేనిదనీ, అందుకే ఏ కొలతలకూ అందని స్వామిని అప్రమేయస్వామి అన్నారు. స్వామి చతుర్భుజుడు. నాలుగు హస్తాలలో శంఖం, చక్రం, గద, అభయ ముద్ర ధరించి వుంటాడు.

ఇవికూడా చూడండి

మేము వెళ్ళినప్పుడు మాకు తెలియక పక్కన వున్న రామాలయం చూడలేదు. మాకు తర్వాత తెలిసిన వివరాలు .. ఇందులోవున్న మూడు ఆలయాలు విశేషమైనవి. ఎలాగంటే…

శ్రీ రామాలయంలో రాముడు, సీత కూర్చుని వుంటే లక్ష్మణుడు వారి ఆనతికోసం ఎదురు చూస్తున్నట్లు పక్కన నమస్కారం చేస్తూ నుంచుని వుంటాడు. ఆంజనేయస్వామి రాములవారి పాదసేవ చేస్తూ వుంటారు. ఈ భంగిమలు అరుదైనవి.

శ్రీ వేణుగోపాలస్వామి చతుర్భుజుడుగా, శంఖం, చక్రం, వేణువులతో దర్శనమిస్తాడు. వేణుగోపాలుడు చతుర్భుజుడుగా కనబడటం తక్కువ.

శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి .. అరుదుగా కనిపించే స్వామి.

మీరు వెళ్తే తప్పక చూడండి.

ఇంకా వివరాలకు www.doddamallurtemple.net చూడండి.


ఉదయం 10-05 కి బయల్దేరాము.




Saturday, April 14, 2012

చెన్నపట్టణ

చెన్నపట్టణ

కొంచెం ముందుకు సాగేసరికి రోడ్డుకి రెండువైపులా వున్న షాపుల్లో ముందు కనబడ్డవి చిన్న పిల్లలు ఎక్కి స్వారీ చేసే కొయ్య గుఱ్ఱాలు. హైవేమీద రోడ్డు పక్కన అన్ని గుఱ్ఱాలు వుండేసరికి ఏమిటా అని ఉత్సుకతతో చూశాము. అవి బొమ్మల షాపులు. చెన్నపట్టణ బొమ్మలకి ప్రసిధ్ధిచెందినది. ఎక్కువగా చెక్క బొమ్మలు వున్నట్లు కనబడ్డాయి. అక్కడే కర్మాగారాలలో తయారయిన బొమ్మలు … దూరానికే ఆకర్షణీయంగా కనబడ్డాయి. మన కొండపల్లి, ఏటికొప్పాక వగైరా బొమ్మలలాగా వాటి ప్రత్యేకత వాటికి వుండవచ్చు. సమయాభావంవల్ల దగ్గరకెళ్ళి వాటిని చూడకుండా ముందుకు సాగాము.