Saturday, March 10, 2012

గవి గంగాధరేశ్వర ఆలయం, బెంగుళూరు

ఆలయం వెలుపలనుంచి (ఎడమవైపు త్రిశూలం, సూర్యపాన కూడా కనబడుతున్నాయి)

ఆలయం లోపలి దృశ్యం (ఎడమవైపునుంచి ప్రదక్షిణ మార్గం..వంగుని వెళ్ళాలి)
గర్భగుడిలో శివలింగం

దుర్గాదేవి

ఆలయంలోపల దృశ్యం
గర్భగుడి చుట్టూవున్న ప్రదక్షిణ మార్గం



గవి గంగాధరేశ్వర ఆలయం, బెంగుళూరు

బెంగుళూరులోని గవిపురంలో వున్న ఈ ప్రఖ్యాత ఆలయం, భారతదేశంలో అతి పురాతనమైన గుహాలయాలలో (cave temples) ఒకటి. పూర్వం గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ, ఇక్కడి శివలింగాన్ని త్రికాలాలలో పూజించేవాడుట. అందుకే ఈ క్షేత్రాన్ని గౌతమ క్షేత్రమని కూడా అంటారు. భరద్వాజ మహర్షికూడా ఇక్కడ తపస్సుచేసుకున్నారు. గర్భగుడి చుట్టూవున్న ప్రదక్షిణ మార్గంలో మిగతా దేవతల సుందర విగ్రహాలతోపాటు ఈ మహర్షులిద్దరి విగ్రహాలుకూడా వున్నాయి.

ఈ గుహాలయం బయటగల మంటపం 14 స్తంబాలతో, విజయనగర నిర్మాణ శైలిలో వున్నది. ఈ హాలు, బయట సూర్యపాన, చంద్రపాన (ఒక స్తంబానిక పైన పెద్ద వృత్తంలా వుంటుంది..సూర్య, చంద్రులకు ప్రతీకగా వీటిని చెబుతారు), త్రిశూలం వగైరాలన్నీ బెంగుళూరు నిర్మాత కెంపెగౌడ సమయంలో నిర్మింపబడ్డాయి.

ఈ ఆలయంలో ప్రదక్షిణ మార్గాలు రెండు వున్నాయి. శివ లింగానికి కుడి వైపున దుర్గ, పార్వతులకి విడి విడిగా ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలని కలుపుతూ దుర్గ ఉపాలయం పక్కనుంచీ ఒక ప్రదక్షిణ మార్గం వుంది. ఈ మార్గంలో వంగుని మాత్రమే వెళ్ళగలం. గర్భగుడి చుట్టూవున్న ఇంకొక ప్రదక్షిణ మార్గం నడవటానికి వీలుగా వుంటుంది. ఈ రెండు ప్రదక్షిణ మార్గాలలో అనేక సుందర దేవతా ప్రతిమలు వున్నాయి.

ఇక్కడ గర్భాలయంలో శివుని దగ్గరనుంచి పలుచని నీటి ప్రవాహం నిరంతరం వుంటుంది. అందుకనే ఇక్కడి శివుడు గంగాధరేశ్వరుడయ్యాడు. ఈ గుహలోంచి రెండు సొరంగ మార్గలున్నాయి. అవి ఒకటి కాశీకి, రెండవది కర్ణాటకలోని శివగంగకువెళ్తాయంటారు.

ఇక్కడ ఇంకొక విశేషం ప్రతి సంవత్సరం మకర సంక్రాంత్రి రోజున సూర్యకిరణాలు ఆలయం బయటవున్న నంది కొమ్ముల మధ్యనుంచి శివలింగాన్ని తాకుతాయి. ఈ అపూర్వ దృశ్యం వీక్షించటానికి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు.

ఈ ఆలయాన్ని చూడని బెంగుళూరువాసులూ, వీలుచేసుకుని తప్పక దర్శించండి. ఇదేమిటండీ, ప్రఖ్యాత ప్రాచీన ఆలయమంటున్నారు, దీనిని చూడని బెంగుళూరు వాస్తవ్యులుంటారా అని అడగకండి. మేము వెళ్ళిన పెళ్ళిలో బెంగుళూరు వాస్తవ్యులు కొందరికి ఈ ఆలయంగురించి మేము చెప్పివచ్చాము.



Wednesday, March 7, 2012

బసవనగుడి (బుల్ టెంపుల్), బెంగుళూరు


ఆలయానికి దారి

ఆలయంలో వృషభరాజు

వెనుక శివాలయం (గర్భగుడిలోనే)

ఆలయంపైన శివపార్వతులు, వినాయకుడు

ఆలయ గోపురం

బసవనగుడి (బుల్ టెంపుల్), బెంగుళూరు

ఈశ్వరుని వాహనమైన నందికి ప్రత్యేకింపబడిన ఈ ఆలయం బెంగుళూరులో క్రీ.శ. 1537 లో నిర్మింబబడింది. ద్రావిడ శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయ నిర్మాత ఇంకెవరోకాదు..బెంగుళూరు నిర్మాత కెంపెగౌడ. ప్రస్తతం కనబడుతున్న గోపురం 20వశతాబ్దం ఆరంభంలో నిర్మింపబడింది.

ఆలయంలో పెద్ద నందీశ్వరుడి విగ్రహం, దాని వెనుకే శివాలయం వుంటాయి. ఒకే రాతిలో మలచబడ్డ ఈ నందీశ్వరుడి ఎత్తు 15 అడుగులు, పొడవు 20 అడుగులు. ఈ నందీశ్వరుని విగ్రహం సంవత్సరాలతరబడి బొగ్గు, నూనెలతో రుద్దటంవల్ల నల్లగా వుంటుంది. పూర్వం ఈ వృషభ విగ్రహం పెరుగుతూ వుండటంతో దానిని ఆపటానికి తలమీద ఒక ఇనుప రేకు తాపటం చేశారు. అప్పటినుంచీ విగ్రహం పెరగటం ఆగిందంటారు. ఈ ఆలయంలోని నంది ప్రపంచంలోని ఆలయాలలో వున్న అన్ని నందులకన్నా పెద్దది.

ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక కధ వుంది. పూర్వం ఒక అతి బలిష్టమైన ఎద్దు ఈ ఆలయం చుట్టుపక్కలగల వేరుసెనగ పంటను తిన్నంత తిని మిగతా అంతా ధ్వంసం చేసేదిట. ఈ విధ్వంసం ఆపటంకోసం చేసిన ప్రయత్నాలు వ్యర్ధమయి, కెంపెగౌడ ఈ ఆలయాన్ని నిర్మించాడుట. అప్పటినుంచీ ఆ వృషభరాజు ఎటువంటి విధ్వంసం చెయ్యలేదుట.

ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ ప్రతి ఏడాదీ వేరుసెనగ పంట రాగానే ఇక్కడి రైతులు ముందుగా తమ పంటని ఈ వృషభరాజానికి సమర్పించి తర్వాతే వ్యాపారం చేసుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాదీ నవంబరు, డిసెంబరు నెలలలో కడలికాయ పరిషె అనే ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. దీనికి వేరుసెనగ పండించే రైతులేగాక, చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

Sunday, March 4, 2012

దొడ్డగణపతి దేవాలయం, బెంగుళూరు

భక్త కన్నప్ప ఆలయంలో పూజా మూర్తులు

ఆలయ ప్రధాన గోపురం, గర్భగుడి గోవురం

ఆలయ గోపురం

ఆలయం ముందు ఆర్చి

దొడ్డగణపతి దేవాలయం, బెంగుళూరు

ఈ మధ్య ఒక పెళ్ళికోసం బెంగుళూరు వెళ్ళాము. మరి వెళ్ళినవాళ్ళం ఆ పెళ్ళొకటే చూసొస్తే ఎలా? అందుకే కర్ణాటకాలోని కొన్ని ఆలయాలు చూసొచ్చాము. వాటి విశేషాలు మీక్కూడా..

ఇంకొక్క విషయం..కర్ణాటకాలో నేను చూసినంతమటుకూ నేను గమనించినవి రెండు విషయాలు. మొదటిది వాణిజ్య ప్రకటనలలో స్త్రీల వస్త్రధారణ నిండుగా వుండటమయితే రెండవది ఎక్కడా నీరు అత్యంత విలువైనది..ఒక్క బొట్టుకూడా వృధా చెయ్యద్దు అనే బోర్డులు లేకపోవటం. మరి మన రాష్ట్రం.. సరే లెండి విషయంలోకెళ్దాం.

దొడ్డ గణపతి ఆలయం బెంగుళూరులోని బసవనగుడిలో బుల్ టెంపుల్ పక్కనే వున్నది. ఈ ఆలయ నిర్మాత బెంగుళూరుని తీర్చిదిద్దిన కెంపెగౌడ. ఒకసారి ఆయన ఈ ప్రాంతంలో సంచరిస్తూవుండగా ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలను చూశాడు. వాటిలో ఒకదానిమీద విఘ్నేశ్వరుడి ఆకారం చూసి శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతిమీద ఆ విగ్రహాన్ని మలచమని ఆనతినిచ్చాడు. ఆనాటి ఆ సంఘటన రూపమే మనమిప్పుడు చూస్తున్న దొడ్డ గణపతి.

ఈ గణపతి విగ్రహం ఎత్తు 18 అడుగులు, వెడల్పు 16 అడుగులు వుంటుంది. ఈయనకి శక్తి గణపతి అనీ, సత్య గణపతి అనీ కూడా పేర్లున్నాయి. ఈ స్వామి విగ్రహం కుడివైపుకి పెరుగుతున్నది ఇక్కడివారి నమ్మకం.

ఈ స్వామిని ప్రతి రోజూ రకరకాలుగా అలంకరిస్తారు. వాటిలో ముఖ్యమైనది వెన్నతో చేసే అలంకారం. ఈ అలంకారానికి 100 కిలోలపైనే వెన్నని వాడుతారు.

ఈ ఆలయం వెనకే శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు వున్నాయి. బెంగుళూరు వెళ్ళినప్పుడు ఈ స్వామిని దర్శించి రండి.

ఆలయ సమయాలు

ఉదయం 7 గం. లనుంచీ 12-30 దాకా, తిరిగి సాయంకాలం 5-30నుంచీ 8-30 దాకా.

Friday, March 2, 2012

శ్రీరంగనాధస్వామి మందిరం, నానక్ రామ్ గూడా, హైదరాబాదు.


శ్రీ మహలక్ష్మీ అమ్మవారు

దేవేరులతో శ్రీ రంగనాధస్వామి

స్వామి రధం
లోపలి ప్రాకార ప్రవేశ ద్వారం -- లోపల ఎదురుగా శ్రీమహలక్ష్మి ఉపాలయం

శ్రీ ఆంజనేయస్వామి వాహనంమీద దేవేరులతో స్వామి

ఆలయం లోపల -- కుడివైపు గర్భగుడి -- ఎదురుగా ఆళ్వారుల ఉపాలయం

లోపలి ప్రాకారం -- ఇది దాటితే స్వామి నిలయం

రెండవ ప్రాకారం ముఖ ద్వారంపైన దశావతారాలు, శ్రీరంగనాధస్వామి
దూరంనుంచి ఆలయ గోపురం
ఆలయ ప్రధాన గోపురం


శ్రీరంగనాధస్వామి మందిరం, నానక్ రామ్ గూడా, హైదరాబాదు.

సింగపూర్ నుంచి సుమ ఈ ఆలయాన్ని చూసి, విశేషాలు వివరించమన్నారు. సుమ తన కళాశాల రోజుల్లో ఈ ఆలయాన్ని దర్శించారుట. అప్పటి బ్రహ్మోత్సవాలగురించి గుర్తు చేసుకున్నారు. సుమా, మీ ద్వారా మేము ఈ ఆలయంగురించి తెలుసుకుని దర్శించగలిగాము. ఇంకో విశేషమేమిటంటే మీరు చెప్పి చాలా కాలమైనా, మా అమ్మాయి పెళ్ళి హడావిడిలో మేము వెంటనే వెళ్ళలేకపోయాము. తీరిక చేసుకుని మేము వెళ్ళింది మీరు చెప్పిన బ్రహ్మోత్సవాల సమయంలో. అప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని మాకు తెలియదు. ఇంత మంచి ఆలయంగురించి తెలియజేసిన మీకు మా కృతజ్ఞతలు. మీకోసం ఫోటోలు చాలా, ఇంకా మీలాగా ఆసక్తికలవారికోసం ఆ ఆలయ విశేషాలివిగో….చక్రాలు తిప్పుకుంటూ గత స్మృతుల్లోకి వెళ్ళిపొండి మరి...

హైదరాబాదులోని అమీర్ పేటకు 17 కి.మీ. ల దూరంలో రంగబాగ్ లో నెలకొన్న ఈ మందిరం 365 సంపత్సరాల క్రితం నిర్మింపబడిందని పూజారులు చెప్పారు. 1861 సం. లో చుట్టుపక్కల స్ధలాలు, భవనాలతోసహా ఈ ఆలయాన్ని సేఠ్ శివలాల్ పిత్తి అనే వ్యక్తి రూ. 70,000 కి కొనుగోలు చేశారు. 1935 లో శ్రీ శివలాల్ పిత్తి మనుమడు రాజా బహద్దూర్ సర్ బన్సిలాల్ పిత్తి రూ. 75,000 ల తో ఒక నిధిని నెలకొల్పి దానిమీద వచ్చే ఆదాయాన్ని ఆలయంకోసం వెచ్చించేలా ఏర్పాటు చేశారు.

1954 వరకూ ఈ ఆలయం స్ధలాలన్నీ పిత్తి వంశస్తుల వ్యక్తిగత ఆస్తులే. 1954 లో పిత్తి కుటుంబానికి చెందిన రాజా పన్నాలాల్ పిత్తి ఒక ట్రస్టు ఏర్పాటుచేసి, రంగనాధ ఆలయం, భూములు, నగలు, స్వామి వెండి వాహనాలు, సామగ్రి అన్నీ ట్రస్టు అధీనంలో వుంచారు. పిత్తి వంశస్తుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ట్రస్టు ప్రస్తుత అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ బద్రీ విశాల్ పిత్తి కుమారుడు శ్రీ శరద్.బి.పిత్తి.

ప్రశాంతమైన వాతావరణంలో నెలకొనివున్న శ్రీ రంగనాధస్వామి ఆలయం చిన్నదైనా చుట్టూ విశాలమైన ఆవరణ. మూడు ప్రాకారాలలో వున్న ఆలయం ఇది. మేము వెళ్ళిన సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. (ఈ సంవత్సరం (2012) జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తారీకుదాకా బ్రహ్మోత్సవాలు జరిగాయి. మేమీ ఆలయాన్ని ఫిబ్రవరి 5, 6 తారీకులలో రెండు రోజులు దర్శించాము). బ్రహ్మోత్సవాల సమయంకదా..ఆలయం అంతా పండుగ వాతావరణం. బ్రహ్మోత్సవ సమయంలో కార్యక్రమాలన్నీ పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతాయి. ప్రతిరోజూ ప్రఖ్యాత కళాకారులచే సంగీత, నృత్యప్రదర్శనలు జరుగుతాయి. ఉత్సవాలు పూర్తయిన మరునాడు స్వామి రధయాత్ర, బాణసంచా, రావణ దహనం వగైరా కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ ఆలయంలోని శ్రీరంగనాధుడు బహు సుందరమైన వాడు. తలపైన ఐదు పడగలతో ఆదిశేషుడు ఆఛ్ఛాదన ఇవ్వగా పడుకున్నట్లుంటాడు. స్వామి నాభినుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు, పాదాలచెంత శ్రీదేవి, భూదేవి, నీలాదేవి, వెనుకనున్న రాతి ఫలకంలో దశావతారాలు చెక్కబడ్డాయి. ఇవ్వన్నీ ఒకే నల్లరాతిలో మలచబడటం విశేషం. స్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో తయారుకాబడ్డాయి. ఇవికాక గోదాదేవి పంచలోహ విగ్రహంకూడావున్నది. ఈ విగ్రహం ఆలయంలోనేగల బావిలో 100 సంవత్సరాల క్రితం దొరికింది.

గర్భాలయం బయటస్వామికి కుడిపక్క పైష్ణవ సాంప్రదాయంలో ప్రముఖులైన 12మంది ఆళ్వారుల ఉపాలయం, స్వామికి ఎడమపక్క లక్ష్మీదేవి ఉపాలయం వున్నాయి. లక్ష్మీదేవి మూల విగ్రహం నల్లరాతిదికాగా ఉత్సవమూర్తి పంచలోహాలతో చేయబడ్డది.

ఈ ఆలయంలోని ఇంకొక విశేషం..సాంప్రదాయ నృత్యంతో స్వామిని ఆరాధించే ఆలయం ప్రస్తుతం ఇదొక్కటేనేమో. ప్రాచీన సాంప్రదాయలో భాగమైన ఈ పురాతన నృత్యరీతులను ఆలయంలో నృత్యం చేసేవారి దగ్గరనుంచి పూజారుల దగ్గరనుంచి సేకరించి ఈ ఆలయంలో ప్రవేశపెట్టారు. 1996లో ఈ నృత్యం తిరిగి ప్రారంభంకావటానికి ప్రఖ్యాత నృత్యకళాకారిణి శ్రీమతి స్వప్నసుందరి విశేష కృషి కారణం.

దర్శన సమయాలు

ఉదయం 6 గం. లనుంచి 12 గం. లదాకా తిరిగి సాయంత్రం 4 గం.లనుంచి 8 గం. లదాకా.

ఎలా వెళ్ళాలి

ఇన్ఫోసిస్ (ఐ.యస్.బి.కి ఎదురుగా వుంది) దాటి 1 కి.మీ. వెళ్ళిన తర్వాత వచ్చే చౌరస్తాలో ఎడమవైపు వెళ్ళాలి. ఆ రోడ్ లో 1 కి.మీ. వెళ్ళాక కుడి వైపు తిరిగితే 2 ఫర్లాంగుల దూరంలో ఆలయం చేరుకోవచ్చు.