Thursday, December 23, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 26



గంగా తీరంలో స్నాన ఘట్టాలు

పావన గంగా నదీ తీరాన వరుణా ఘాట్ నుంచీ అస్సిఘాట్ వరకు 64 ముఖ్యమైన స్నాన ఘాట్లు వున్నాయి.  కొత్తవి ఇంకా కొన్ని చేరాయి.  యాత్రీకుల సౌకర్యార్ధం పడవల వారు ఈ  స్నాన ఘాట్లని చూపిస్తూ, మధ్యలో కొన్ని ముఖ్యమైన చోట స్నానానికి సమయమిస్తూ తిప్పుతారు.  డబ్బు, ప్రయాణీకుల సంఖ్యమీద, వారి బేరం చేసే సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది.  మేము ముగ్గురం  ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12-30 దాకా ఒక బోట్ లో తిరిగాం, మధ్యలో మణికర్ణికలో మాత్రం ఆగాము.  దానికి 250 రూ. తీసుకున్నాడు.

సాధారణంగా ప్రయాణీకులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఈ ఘాట్ ల సౌందర్యం తిలకించటానికి ఇష్టపడతారుగనుక ఆ సమయంలో రేటు కొంచెం ఎక్కువ వుండవచ్చు.

ఎక్కువమంది  యాత్రీకులు మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగలలో స్నానం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తారు.  వీటిని గురించి కొంచెం వివరంగా........

మణికర్ణికా ఘాట్
పూర్వం మహా విష్ణు తన చక్రంతో ఒక సరస్సు తవ్వి దాని ఒడ్డున మహా శివునికోసం తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తలాడించాడట.  అంతే..ఆయన చెవికున్న మణి కుండలం జారి ఆ తటాకంలో పడింది.  సాక్షాత్తూ ఆ మహా ప్రభువు ధరించిన చెవి కుండలం పడిన తటాకం మణకర్ణికా ఘాట్ అయింది.  తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీదనుంచి ప్రవహించిందని కొందరంటారు.  ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా రాళ్లతో కట్టబడిన పుష్కరిణి ఒకటి వున్నది.  అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు.

ముందు గంగానదిలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని మేము వెళ్ళిన బోటు అతను చెప్పాడు.   ఇంకో విశేషమేమిటంటే ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గం. లకు సకల దేవతలూ వస్తారుట.  అందుకని ఆ సమయంలో అక్కడ స్నానం చెయ్యటం చాలా మంచిది అని చెప్తారు.

ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి.  కొందరు పితృకార్యాలు చేస్తున్నారు.
 మణికర్ణికా ఘాట్
 చక్ర తీర్ధం

దశాశ్వమేధ ఘాట్
ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడుట. అందుకే ఆ పేరు.  ఈ ఘాట్ యాత్రీకులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది.  రోజూ సాయంసమయంలో ఇక్కడ గంగ హారతి ఇస్తారు.
 ప్రయాగ మరియు దశాశ్వమేధ ఘాట్స్

హరిశ్చంద్ర ఘాట్
హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే.  ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి.  దీని ప్రక్కనే కేదార్ ఘాట్.


కేదార్ ఘాట్
ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం వున్నది,  ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ వుంటారుట.
 మెట్లకి ఎదురుగా ఒడ్డున కేదారేశ్వర మందిరం (ఎఱ్ఱ బిల్డింగ్ పక్కన)

ఇలా బోట్ లో వెళ్ళేటప్పుడు బోటతను మధ్యలో ఆపి డబ్బులడుగుతాడు, రాములవారు అక్కడే నది దాటారనీ,  ఆయనని తలచుకుని అక్కడ దానమిస్తే పుణ్యమనీ.  బయల్దేరగానే అలా మధ్యలో ఆపి అడిగేసరికి మాకు కోపం వచ్చి ఇవ్వలేదు.  దాంతో అతనికి చాలా కోపం వచ్చి, ముందంతా అన్నీ చెప్పినవాడు తర్వాత ఏమీ చెప్పలేదు.  ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం.  పుణ్యక్షేత్రానికి వెళ్ళారుకనుక ఎంతో కొంత ఇచ్చేయచ్చు.  వాళ్ళు అల్ప సంతోషులు, పైగా బీదవారు.  అనుభవంతో మాకు తెలిసిందిది.

గంగానదిమీదు పడవ షికారుకి తప్పక వెళ్ళండి.  అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు.  వీలయితే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో బాగుంటుంది.  సమయముంటే సాయంకాలాలు ఘాట్ లో మెట్లమీదకూర్చుని సమయం గడపవచ్చు.
 మేమూ బోటింగ్ చేస్తున్నామోచ్

కాశీలో చూడవలసిన దేవతల గురించి వచ్చే పోస్టులో.


Thursday, December 9, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 25



వ్యాస కాశీ
పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ.  వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు.  వేద విభాగము చేసినవాడు.  అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు.  ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? 
పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి  కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.
తర్వాతకాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది.  ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు.  ప్రస్తుతం ఈ మ్యూజియంకి మైంటినెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది మ్యూజియం శుభ్రత చూస్తే.  మ్యూజియం సందర్శనానికి టికెట్ వుంది.  సమయం ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.  మధ్యలో ఒకటి రెండు గంటల విరామం వున్నది.





 వ్యాస కాశీ  ప్రవేశ ద్వారమ

గంగకవతల ఒడ్డున రాజుగారి కోట


Wednesday, December 8, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడీ కాశీ కబుర్లు - 24



బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం
ఆసియా ఖండంలోనే పెద్దదిగా భావించబడే ఈ విశ్వ విద్యాలయం పూర్వం కాశీ రాజుగారిచే ఇవ్వబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల క్షేత్రంలో వున్నది.  దీనిని  1916లో పండిట్ మదన్ మోహనమాలవ్యాగారు స్ధాపించారు..  ఏటా 15000 మంది క్రొత్త విద్యార్ధులకి అనేక రంగాలలో ప్రవేశం కల్పించే ఈ విశ్వ విద్యాలయం పేరులో మాత్రమే హిందూ విశ్వ విద్యాలయం.  భారతదేశంనుంచే కాక విదేశాలనుంచికూడా అనేక మంది విద్యార్ధులు కుల, మత ప్రసక్తి లేకుండా ఈ విశ్వ విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. 

 ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాధుని ఆలయం వున్నది.  బిర్లాలచే నిర్మింపబడింది కనుక దీనిని బిర్లామందిర్ గా కూడా వ్యవహరిస్తారు.   ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పోలి వుంటుంది.  కాశీ విశ్వనాధుని ఆలయంలోకి విదేశీయులకు అనుమతి లేదు కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తిగల ఎవరైనా చేసుకోవచ్చు.


ఇక్కడే భారత కళాభవన్ అనే మ్యూజియంకూడా వున్నది.  సమయాభావంవల్ల మేము చూడలేదు.  అవకాశం వున్నవారు  ఉదయం 11 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు దర్శించవచ్చు.   అయితే విశ్వవిద్యాలయానికి  సెలవు  వున్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసివుంటుంది.

Friday, November 26, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 23



దుర్గా మందిరం

పూర్వం దుర్గుడనే రాక్షసుడు ప్రజలను పలు బాధలు పెట్టగా జగన్మాత భీకర యుధ్ధంలో అతనిని సంహరించింది.  తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసినది. దుర్గుని సంహరించినది కనుక దుర్గాదేవిగా ప్రసిధ్ధిగాంచినది.  ఇక్కడ భక్తుల రద్దీ ఎల్ల వేళలా వుంటుంది.  శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో ఇక్కడ జాతర జరుగుతుంది.  ఆ సమయంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో దేవీ దర్శనం చేసుకుంటారు.  సమీపంలో దుర్గా కుండము వున్నది.


కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 22



తులసీ మానస మందిర్

ఇది 1964లో నిర్మింపబడిన పాలరాతి మందిరం.  నిర్మాత సేఠ్ రతన్ లాల్ సురేఖా.  భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడివున్నది.  రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలుకూడా వున్నాయి.  రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి. 


Sunday, November 7, 2010

కాశీ యాత్ర మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 21



కాశీలో దర్శనీయ స్ధలాలు

గవ్వలమ్మ గుడి, భేలూపురి

కొంచెం ఎత్తుగా వుండే చిన్ని మందిరం ఇది.  అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే.  వాటి మహత్యమే అత్యున్నతం.  ఈ గవ్వలమ్మ విశ్వనాధుని సోదరి అనీ, ఆవిడకి మడీ ఆచారాలు ఎక్కువనీ, వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడని ఊరు బయట దళితవాడలో వుండమని పంపాడని ఒక కధ.  ఈవిడని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదనీ ఒక ప్రచారం.  ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు.  అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు.

లోకల్ ట్రిప్ లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే వుంటాయి.  సారనాధ్ కూడా ఈ ట్రిప్ లోనే చూపిస్తారు.



కాశీ యాత్ర మేడ్ ఈజి అనబడే కాశీ కబుర్లు – 20



కాశీలో దర్శనీయ స్ధలాలు

కాశీలో దేవాలయాలు అనేకం.  ఎన్ని చూసినా ఇంకా చూడనివి వుంటాయి.  ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటోవారు, టాక్సీవారు ఒక పేకేజ్ కింద చూపిస్తారు.  సమయం ఒక పూట పడుతుంది.  అందులో మొదటిది

కాలభైరవ మందిరం

పరమ శివుని ఆగ్రహంనుంచి పుట్టిన వాడు కాలభైరవుడు.  ఆయన ఒకసారి ఆబధ్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలని తన గోటితో తుంచేశాడు.  బ్రహ్మగారిని తల తుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది.  పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.  లోకాలన్ని తిరిగినా పోని పాపం ఆయన కాశీకి రాగానే పోయింది.   చేతికి అతుక్కున్న తల వూడి కిందపడింది.  కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు మరి.

 ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు.  ఈయనకు చాలా పెద్ద పనులున్నాయి.  కాశీకి వచ్చినవారివి, అక్కడ నివసిస్తున్నవారివీ పాప పుణ్యాల చిట్టాల మైయిన్టెయిన్ చెయ్యటం ఈయన డ్యూటీనే.  వీళ్ళందరి పాపాలనూ కడిగివెయ్యటం కూడా ఈయన డ్యూటీనే.  కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.  మరి సాక్షాత్తూ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత వుండాలికదా.  కాశీలో మరణించటమే ఆ అర్హత.  వారి పాపాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చెయ్యటం కూడా భైరవులంగారు పనే.  మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలికదా.  దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు.  అన్నట్లు యమ ధర్మరాజుకీ, చిత్ర గుప్తుడికీ కాశీలో నివసిస్తున్న వారిపైగానీ, అక్కడ మరణించిన వారిపైగానీ ఎటువంటి అధికారం లేదు.  కానీ అంతకుమించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింప చేసే కాలభైరవుడిని దర్శించి సేవించటం మరువకండి.

విశ్వనాధుని ఆలయంనుంచి రెండు కిలో మీటర్ల దూరం లోపే వుంది ఈ ఆలయం.


Wednesday, October 20, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 19


సారనాధ్

సారనాధ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. ఇక్కడి స్తూపం ఎత్తు 143 అడుగులు.  దీనిలోని రాళ్ళు ఇనప క్లాంప్స్ తో కలపబడ్డాయి.

దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు.  12వ శతాబ్దంవరకు అనేకసార్లు అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది.  ఇక్కడ వున్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసంగావింపబడగా,  ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చెయ్యబడ్డవి.

 20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌధ్ధ ఆలయం కొత్తగా నిర్మింపబడింది.  ఇక్కడ తవ్వకాలలో దొరికిన బౌధ్ధ అవశేషాలని ఇక్కడ భద్రపరిచారు.  ప్రతి సంవత్సరం బుధ్ధ పౌర్ణమినాడు వాటిని వూరేగిస్తారు.

ఇక్కడ ఆర్కయాలజీ మ్యూజియం దర్శించదగినది.   మహాబోధి లైబ్రరీలో బుధ్ధుని గురించి అనేక పుస్తకాలు, వ్రాత ప్రతులు వున్నాయి.

7 వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రీకుడు హుయాన్స్వాంగ్ తన గ్రంధంలో  ఇక్కడవున్న కట్టడాలగురించి వ్రాశాడు. 
 సారనాధ్ స్ధూపం
 బుధ్ధుడు మొదట బోధించిన స్ధలం
 నూతన బుధ్ధ దేవాలయం  
దేవాలయం లోపల దృశ్యం

Friday, October 8, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 18


 బుధ్ధ గయ
గయనుంచి 12 కి.మీ. దూరంలో వున్న బుధ్ధగయ చేరుకున్నాము.  ఇక్కడే సిధ్ధార్ధుడికి జ్ఞానోదయమైంది.  భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి.  అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన లుంబినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్,  చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా.  బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.

500 బి.సి. లో సిధ్ధార్ధుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని  ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు.  మూడు రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది.  తర్వాత ఆయన అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడు వారాలు ధ్యానంలో గడిపారు.  తరువాత ఆయన సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు.

బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుని గౌతమ బుధ్ధుని శిష్యులు  వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చేవారు.  కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి.  కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.

బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు  ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు.  ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే.

ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు.  అశోక చక్రవర్తి పరిపాలనలో  బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు.  తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు.

బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది.  ఇక్కడే ఆయన తపస్సు చేసింది.

ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి.

ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది.

7 వ శతాబ్దంలో భారత దేశ యాత్ర చేసిన చైనా యాత్రీకుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ గురించి రచించాడు.
 బుధ్ధుడి ఆలయం
 ఆలయంలో బుధ్ధుడు
బోధి వృక్షం
 టిబెట్ వారి కట్టడం
 25 మీ, ఎత్తైన బుధ్ధుడి విగ్రహం


Wednesday, September 29, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 17


మంగళగౌరి ఆలయం, గయ, బీహార్

గదాధరసహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని
త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా.

గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడిశక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి..  అందులో ముఖ్యమైన శరీర భాగాలు పడిన ప్రదేశాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు.   గయలో అమ్మవారి తొడ భాగం పడ్డది.

ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో చేయబడింది.  ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది.  మంగళగౌరి అనే చిన్ని కొండమీద ఇటుకలతో నిర్మింపబడిన  చిన్న ఆలయం ఇది. 

గర్భగుడి చాలా చిన్నది.  లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె  లాగా వుంటుంది.  ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి.  గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది.  దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. 

ఇరుకు ప్రదేశాలలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి.

 ఎడమవైపు కనబడుతున్న గోపురం ఆమ్మవారి గుడి..చిన్న కొండమీద వుంది

Wednesday, September 22, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 16

గయ

బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా ముఖ్య కేంద్రం గయ.  గయ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది పితృ కార్యాలు.  చనిపోయినవారికి ఇక్కడ శ్రాధ్ధ కర్మలు చేస్తే చాలా మంచిదని, పితృదేవతలు తరిస్తారని అంటారు.  కొందరైతే ఇక్కడ ఒకసారి శ్రాధ్ధ కర్మలు చేస్తే తిరిగి ప్రతి ఏడాదీ చెయ్యక్కరలేదు అంటారుగానీ అది నిజం కాదని అక్కడివారన్నారు.
గయకు చేరుకోవటానికి రైలు, బస్ సౌకర్యాలున్నాయి.  సాధారణంగా కాశీ వెళ్ళినవాళ్ళు అక్కడనుండి ప్రైవేటు వాహనం మాట్లాడుకుని గయ వెళ్ళి వస్తారు.  మేమూ అలాగే ఒక వాహనంలో  రాత్రి  1 గం. కి బయల్దేరి ఉదయం 7 గం. లకు గయ చేరుకున్నాము.  మా వేన్ డ్రైవరు సరాసరి ఒక తెలుగు బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళాడు.  ఇల్లు పెద్దదే.  4, 5 ఆవులు కూడా ఆ ఇంట్లో వున్నాయి.

గయలో వుండటానికి అనేక వసతులు వున్నట్లే ఈ కర్మలు చేయించే బ్రాహ్మణులుకూడా యాత్రీకుల అవసరానికి ఉచితంగా వసతి ఇస్తారు.  ముందే చెప్పి డబ్బు కడితే కార్యక్రమం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తారు.  ఇవ్వన్నీ ఎలా వుంటాయని అడగద్దు.  మన అవసరార్ధం ఒక రోజు గడిపి వచ్చెయ్యటమే.

 వెళ్ళిన వెంటనే అక్కడవున్న బ్రాహ్మణుడు మా గ్రూప్ లో వారంతా వచ్చిన పని, మా కార్యక్రమాలు తెలుసుకుని మా కందరికీ ఒక గది ఇచ్చి స్నానాలు కానిచ్చి త్వరగా వస్తే కార్యక్రమాలు మొదలు పెట్టచ్చన్నారు.  బయట 5, 6 స్నానాల గదులు, వాష్ బేసిన్లు, పంపులు వున్నాయి.   కొందరు మగవారు పంపుల దగ్గరే స్నానాలు కానిస్తున్నారు. 

అక్కడ రేట్లు బేరం ఆడటం లేదు.  బాగానే వుంది.  కానీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుని, కూర, కాయ, పండు వదలనన్నానని నా మీద ఆ బ్రాహ్మణునికి కొంచెం కోపం వచ్చింది.  అలా వదిలితే మళ్ళీ ఆ వస్తువు తిన కూడదు.  మే మా దేశ దిమ్మరులం.  ఏ రోజు ఎక్కడ తింటామో తెలియదు.  వెళ్ళిన చోటల్లా ఆ వంటల్లో నేను వదిలేసినవి వేశారేమో ఎక్కడ కనుక్కోను.  ఆ అవస్తలు పడేకన్నా ఆ పని చేయకపోవటమే నాకు ఉచితం అనిపించింది.  పైగా ఈ మధ్య నలుగురూ చెప్పేవి విని కొంచెం బుఱ్ఱ పెంచుకుంటున్నానులెండి.  మన అహంకార మమకారాలన్నీ వదిలి భగవంతుని చేరుకోవటానికి చేసే ప్రయత్మంలో అలా మనకిష్టమయిన వస్తువులు వదిలిపెట్టటం  మొదటి మెట్టు అని ఎక్కడో విన్నాను.  ఏదో పండూ, కూరా బదులు నా అహంకారం కొంచెంకాకపోతే కొంచెమన్నా వదలటమే నాకు తేలిక అనిపించింది. 

అన్నట్లు గయలో పితృకార్యాలేకాక, మనం అప్పటిదాకా తెలిసీ తెలియక చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పండూ, కూరా వగైరాలను వదిలి పెట్టటం చేస్తారు.

స్నానాలయ్యాక కొంచెం దూరంలో వున్న విష్ణుపాదం ఆలయానికి నడిచే వెళ్ళాము.  కొంచెం ఎత్తులో ఆలయం.  ఆ ఆలయానికి చేరుకునే లోపలే వున్న ఖాళీ ప్రదేశంలో ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు పురోహితులు.  చాలామందే వున్నారు.  పురోహితుడు మా కార్యక్రమాలకని వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళటంతో మేము గుడికి వెళ్తున్నట్లు, అక్కడ ఆలయం వున్నట్లుకూడా ముందు తెలియలేదు.  మా వాళ్ళ కార్యక్రమాలయ్యాక దేవాలయానికి వెళ్ళిరమ్మని పురోహితుడు చెబితే ఇక్కడే వుందా అనుకున్నా.  ఈ ప్రదేశానికి ప్రక్కనే ఫల్గుణీ నది.  ఒక్క చుక్క కూడా నీరు లేదు. 

దేవాలయంలో ఒక పెద్ద బేసిన్ లాంటి దాని మధ్యలో పెద్ద విష్ణు పాదం ఆకారం వుంది.  ఆ బేసిన్ చుట్టూ  వెండి రేకు తాపడం చేశారు.  అందరూ ఆ పాదం తాకి నమస్కారం చేస్తున్నారు.  మేమూ  ఫాలో అయిపోయాము.  అతి పురాతనమైన ఈ ఆలయాన్ని 1787 లో రాణీ అహల్యాబాయి పునర్నిర్మించారు.  ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ పునర్నిర్మాణమే.

ఆలయ ఆవరణలో అనేక ఉపాలయాలేకాక ఒక పెద్ద మఱ్ఱి చెట్టు వుంది.  భక్తులు ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారు.  ఈ వృక్షం కింద  గౌతమ బుధ్ధుడు చాలాకాలం తపస్సు చేశాడుట.  అందుకే ఈ క్షేత్రం హిందువులకేకాక బౌధ్ధ మతస్తులకు కూడా  పుణ్య క్షేత్రం.

ఈ విష్ణుపాదం ఆలయం గురించి ఒక చిన్న కధ....పూర్వం గయాసురుడనే రాక్షసుడుండేవాడు.  శ్రీ మహావిష్ణువు గయాసురుణ్ణి తన పాదంతో తొక్కి చంపాడుట.  అప్పుడు గయాసురుడి శరీరం చిన్న కొండలుగా రాళ్ళ గుట్టలుగా మారిందిట.  గయాసురుడు రాక్షస శ్రేష్ఠుడు.  ఆయనవంక చూసినా, ఆయనని తాకినా వారి పాపాలన్నీ పటాపంచలయిపోయేవిట.  అందుకే, అంత పుణ్యాత్ముడయిన గయాసురుడి శరీరం  కొండలు గుట్టలుగా మారిపోయాక అనేక దేవీ దేవతల ఆలయాలు అక్కడంతా వెలిశాయిట.  ఇక్కడ అనేక ఆలయాలు వున్నాయి.  సమయం వున్నవారు వాటిగురించి కనుక్కుని దర్శించవచ్చు.

ఇక్కడ షాపుల్లో విష్ణుపాదాలు అమ్ముతారు.  అవి దేవుడిదగ్గర పెట్టి పూజిస్తే మంచిదని అందరూ తెచ్చుకుంటారు.  కొందరు శ్రాధ్ధ కర్మ చేసేటప్పుడు పిండాలని వాటిమీద పెడతారు.

ఉదయం 11 గం. కల్లా అక్కడ కార్యక్రమం అయిపోయి మా విడిదికి వచ్చాము.  భోజనం, కొంచెం విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం 2 గం. లకు తిరుగు ప్రయాణం మొదలైంది.

గయలో వెలిసిన మంగళ గౌరి ఆలయం గురించి వచ్చే పోస్టులో.  ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి.

 ఫల్గుణీ నది (నీళ్ళు లేవు) 
 కార్యక్రమాలు (ఎడమవైపు స్త్రీలు పండు వదులుతున్నారు, కింద కూర్చున్నవారు కర్మకాండలు చేస్తున్నారు)
విష్ణుపాదం ఆలయం
ఆలయ ఆవరణలో వటవృక్షం (బుధ్ధుడు తపస్సు చేసినచోటు)

Monday, September 13, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 15




సీతా మడి

అలహబాద్ వారణాసి రహదారిలో అలహాబాద్ నుంచి సుమారు 50 కి.మీ. తర్వాత రహదారినుంచి 10 కి.మీ. లు లోపలికి వెళ్తే వస్తుంది సీతామడి.  ఈ ప్రదేశాన్ని అభివృధ్ధి చేసి 15 ఏళ్ళు అవుతోంది.  సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం ఇదని కొందరి నమ్మిక.  రెండంతస్తుల సీతమ్మవారి ఆలయంలో ఆవిడ విగ్రహాలు, వెనుక అద్దాలతో లవ కుశులు, రాముడు వగైరా చిత్రాలు వున్నాయి. 

ఈ ఆలయ ఆవరణలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు వున్నాయి.  ఈ రెండు ఆలయాలలో ప్రదక్షిణ మార్గాలు సొరంగ మార్గంలా ఏర్పాటు చేయబడి యాత్రీకులను ఆకర్షిస్తుంటాయి.  ఆంజనేయస్వామి ఆలయం ముందు అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వుంది.

సీతాదేవి ఆలయం చుట్టూ సరస్సు వుంది.  సుందర ప్రాకృతిక దృశ్యాల మధ్య  లాయడ్స్ స్టీల్ గ్రూప్ వారిచే అభివృధ్ధి చెయ్యబడ్డ ఈ ఆలయాలను ప్రయాగ వెళ్ళివచ్చే యాత్రీకులంతా తప్పక దర్శిస్తారు.
  
సీతా దేవి ఆలయం
పై అంతస్తులో సీతాదేవి విగ్రహం
క్రింది అంతస్తులో సీతాదేవి విగ్రహం
100 అడుగుల పైన ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం

Saturday, September 11, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 14




స్వరాజ్ భవన్, ప్రయాగ (అలహాబాద్)

ఈ భవనం చర్చ్ లేన్ ప్రాంతంలో వున్నది.  భారత దేశ ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తండ్రి 1899 లో ఈ భవనం కొని వుండసాగారు.  అప్పుడు ఈ భవనం పేరు ఆనంద భవన్ అని పెట్టుకున్నారు.  తర్వాత పక్కనే వున్న ఖాళీ స్ధలంలో వేరొక భవనం నిర్మించుకుని 1927 లో ఆ భవనంలోకి మారారు.  కొత్త భవనం పేరు కూడా ఆనంద భవన్ అనే పెట్టారు.  పాత భవనాన్ని నేషనల్ కాంగ్రెస్ కి ఇచ్చారు.  అప్పుడు దాని పేరు స్వరాజ్ భవన్ గా మార్చారు.  1931 లో పండిట్ మోతీలాల్ నెహ్రూ మరణించిన తర్వాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారత దేశ ప్రజల పురోభివృధ్ధి గురించి ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఈ స్వరాజ్ భవన్ ని ఆ ట్రస్టుకి అప్పగించారు.  ఈ భవనంలో కొంత భాగంలో కమలా నెహ్రూ హాస్పిటల్ వుంటే, మరి కొంత భాగాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వుపయోగించుకుంటోంది. 

భారత దేశ స్వాతంత్ర్య పోరాటానికి సాక్షీభూతంగా నిలిచిన ఈ సువిశాల భవనంలోనే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ బాల్యం గడిచింది.  అనేక ముఖ్య రాజకీయ సంఘటనలకి వేదిక అయిన ఈ భవనంలోనే దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జన్మించింది. 

ఇందులో వున్న మ్యూజియం సందర్శన సమయాలు ఉదయం 9-30 నుంచీ సాయంత్రం 5-30 దాకా.  ప్రతి సోమవారం సెలవు దినం.


ఆనంద భవన్

భారతదేశ స్వాతంత్ర్య సమరంలోని అనేక ముఖ్య సంఘటనలకు ఆనంద భవన్ కూడా సాక్షీ భూతంగా నిలిచింది.  ఈ భవనంలోనే అప్పటి జాతీయ నాయకులు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి. 

మహాత్మా గాంధీ అలహాబాద్ వచ్చినప్పుడల్లా ఈ భవనంలోనే వుండేవారు.  ఆయనకి సంబంధించిన అనేక వస్తువులను ఇక్కడ భద్రపరిచారు. 

దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ వివాహం ఈ భవనంలోనే జరిగింది.  1970 లో శ్రీమతి ఇందిరా గాంధీ ఈ భవనాన్ని దేశ ప్రజలకి అంకితం చేయటంతో ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేశారు.    ఈ మ్యూజియం సందర్శన వేళలు ఉదయం 9-30 నుంచీ సాయంత్రం 5-00 గంటలదాకా.  సోమవారం, ఇంకా ప్రభుత్వ సెలవదినాలలో మూసి వుంటుంది.

ప్రయాగలో ఇతర సందర్శనీయ ప్రదేశాలు

సమయం వున్నవారు సందర్శించదగ్గ ఇతర ప్రదేశాలు.....నాగ వాసుకీ దేవాలయం,  మన్ కామేశ్వర్ మహా దేవ్ మందిరం (ఈ మందిరం నుంచి యమునా నది అందాలు చూడవచ్చుట..ఇక్కడ శివునికిచ్చే హారతి, వెనువెంటనే జరిగే ప్రార్ధనలు చాలా బాగుంటాయిట), వేణీ మాధవ మందిరాలున్నాయి.  వీటిని మేము చూడలేదు కనుక ఇంతకన్నా చెప్పలేను.

దీనితో ప్రయాగ విశేషాలు అయినాయి.  వచ్చే పోస్టులో ప్రయాగనుంచి  వారణాసికి వెళ్ళే త్రోవలో వున్న సీతా మడి గురించి.

 ఆనంద భవన్

Friday, September 10, 2010

యాత్ర చేసొచ్చేశా


వాఘా బార్డర్
 యాత్ర చేసొచ్చామని తెగ సంబర పడుతున్నారు....ఇదేమన్నా కొత్త విషయమా, ఓ పది రోజులు ఇంట్లో కుదురుగా కూర్చుంటే చెప్పండి అదొక విశేషమవుతుంది మీ విషయంలో అంటారా?    అనండి అనండి...మీరు కాకపోతే ఎవరంటారు?  అయినా ఈ మధ్య మనుషుల మాటలు పట్టించుకోవటం మానేశానులెండి.  ఇంతకీ ఈ ఉత్సాహానికి కారణం చెప్పమంటారా?  

కాళ్ళు నేలమీద ఆన్చలేక పోయినా  వైష్ణోదేవి దాకా ప్రయాణం పెట్టుకున్నామా,  వెళ్ళేవరకూ వెళ్ళగలనో లేదో అనే భయం.  పోనీ వాయిదా వేసుకోండని హితుల సలహా.  సాయిబాబా లాగానే వైష్ణోదేవి కూడా ఆవిడ పిలిపించుకుంటేనే వెళ్ళగలమట.  ఆవిడ నన్ను చాలా ఘట్టిగా రమ్మని ఆర్డరు వేసింది.  అందుకే బయల్దేరాను.  మా వారు ముందే ఆపీసు పనిమీద ఢిల్లీ వెళ్ళారు...వెనకే నేను.  ఢిల్లీలో కూడా మూసిన కన్ను తెరవనంత జ్వరం.  అయితే ఒకసారి యాత్ర ప్రారంభం అయ్యాక  కాళ్ళు మాత్రం ఏ ఇబ్బందీ పెట్టలేదు.  జ్వరం ఇద్దరినీ చెరో రెండు రోజులూ ఇబ్బంది పెట్టినా యాత్రలో ఏ ఒక్కటీ వదిలి పెట్టకుండా అన్నీ చూశాము.  ఆ విశేషాలు కుంటుపడ్డ కాశీ కబుర్లు పూర్తి చేశాక చెబ్తాను.

ఈ లోపల ఒక విశేషం మీతో పంచుకోవటానికి అప్పటిదాకా ఆగలేక ఇప్పుడే  చెప్పేస్తున్నా.  యాత్రలో భాగంగా ఇండియా, పాకిస్తాన్ బార్డరు (వాఘా బార్డరు అంటారు) వెళ్ళాము.  మన వైపు ప్రతి రోజూ కనీసం 30,000 మంది జనం వస్తారుట.  పాపం పాకిస్తాన్ వైపు మేము వెళ్ళిన రోజు ఒక రెండు వందల మందికూడా లేరు..బహూశా రంజాన్ ప్రభావమేమో.  ఇంతమంది జనం భారత దేశం గురించి జయజయధ్వానాలు చేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.  ఉత్సాహం ఉరకలు వేసింది.

అక్కడ  ప్రతి రోజూ సాయం సమయంలో ఏ దేశం జెండాని ఆ దేశంవారు అవనతం చేసి భద్రపరుస్తారు.  ఆ కార్యక్రమం మొదలయ్యేలోపల పిల్లలు పెద్ద పెద్ద జెండాలు పట్టుకుని పాకిస్తాన్ బార్డరు దాకా పరిగెత్తి తిరిగి వచ్చారు.  వాళ్ళని చూస్తుంటే మేమింక ఆగలేకపోయాము. అంతమంది జనంలో పైనెక్కడో వున్నవాళ్ళం నేనూ, మరో ఇద్దరు, శ్రీమతి హైమవతీ,  శ్రీమతి వాణి, (వీళ్ళిద్దరూ కూడా హైదరాబాదునుంచి మాతో టూర్ కి వచ్చినవారే ... దోవలో బాగా స్నేహంకలిసింది...ట్రిప్ అంతా సరదాగా గడిచింది) అందరి మధ్యనుంచీ దోవ చేసుకుని కిందకి దిగి వచ్చి మేమూ జెండా తీసుకెళ్తామని అడిగాం.  వెంటనే ఒక జెండా మాచేతిలో.....మేము వాఘా బార్డరుదాకా పరుగెత్తలేదుకానీ, ఆ జెండా పట్టుకుని నడిచాం.  ఆ జెండాలో ఏముందో, మా అందరి ముఖాలలో గర్వం తొణికిసలాడింది.  ఏదో సాధించినట్లే, చెప్పలేనంత సంతోషం వేసింది.  ఐదు నిముషాలు జెండా పట్టుకున్నందుకే మాకంత సంతోషం, గర్వం వేస్తే, దేశం కోసం అనేక ఇబ్బందుల్లో ప్రాణం ఒడ్డి పోరాడుతున్న రక్షణ దళాలు ఇంకెంత గర్వపడాలి.  నిజంగా వాళ్ళ జన్మలు ధన్యంకదా.   మెరుపులా కదిలే వారి శరీరాలను చూస్తుంటే అనిపించింది  ఆ వేగాలు సాధించటానికి ఎంత కష్టపడతారోనని.

మరి ఒక్కసారి మీరంతాకూడా మన వీర జవాన్లకి, మన భారత దేశానికీ జేజేలు చెప్పండి.
విన్యాసాలు చూడవచ్చిన భారతీయులు
జెండాలతో పిల్లలు
గోడ అవతల పాకీస్తానీయులు
 బార్డరులో సైనికుల విన్యాసాలు

Saturday, July 17, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 13 - ప్రయాగ



భరద్వాజ ఆశ్రమం

అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలొనల్ గంజ్ లో ఆనంద భవన్ సమీపంలో.  త్రేతా యుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు.  ఇక్కడ మూడు రాత్రులు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్ కి పయనమయ్యాడు.    ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది.  తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు. 

ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు.  సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది. 

ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి.  ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృధ్ధి చేస్తున్నారుట.  సమయాభావంవల్ల పార్కు చూడలేదు.


Friday, July 16, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 12 - ప్రయాగ



మాధవేశ్వరీ దేవి మందిరం

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనశ్రీ మాధవేశ్వరీ దేవి మందిరం ప్రయాగలోనే వుంది.  ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.

ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవి అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకోవటం, ఆవిడని ఎత్తుకుని శంకరుడు ఉగ్రతాండవం చేయటం, ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీ దేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు చెయ్యటం, అవి 18 ముక్కలుగా దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఖ్యాతి చెందటం మీకు తెలుసుకదా. 

ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డది.  ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు.  ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది.  దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది.  దానికింద ఒక ఉయ్యాల.  భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.

అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి వుండకపోయినా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామన్న ఆనందంతో అక్కడనుండి బయల్దేరాము.
 మాధవేశ్వరీదేవి మందిరం
పార్వతీదేవి ముంజేయి తెగి పడుతున్న దృశ్యం