కంచికచర్ల -- విజయవాడ రోడ్డులో ఆంజనేయస్వామి భారీ విగ్రహం శ్రీ శివ సాయి క్షేత్ర ప్రవేశ ద్వారం
ఆలయంలో జంట నాగుల శిల్పం
ఉపాలయాల దృశ్యం
శివాలయ మండపంలో స్తంబంపై తండ్రీ కొడుకులు
ఆలయ దృశ్వం
శ్రీ శివ సాయి క్షేత్రం, కంచికచర్ల
ఇది కొన్ని సంవత్సరాల క్రితం కట్టబడిన దేవాలయ సమూహం. జగ్గయ్యపేట -- విజయవాడ రోడ్డులో, నందిగామ దాటాక విజయవాడ బైపాస్ రోడ్డులో వున్నది. ఇక్కడ శివుడి పేరు శ్రీ అష్టోత్తర శత మహాలింగేశ్వర స్వామి. స్వామికి కుడివైపు శ్రీ మహా గణపతి, ఎడమవైపు శ్రీ పార్వతీ దేవి విరాజిల్లుతున్నారు.
ఈ దేవాలయాలకి వెనుక వైపు వరుసగా సాయిబాబా, రమా సహిత సత్యన్నారాయణ స్వామి, వీరభద్ర స్వామి, కుమార స్వామి, జ్ఞాన సరస్వతి, పంచముఖ ఆంజనేయ స్వామి, అయ్యప్ప, నవగ్రహాల దేవాలయాలున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే వున్న జంట నాగుల విగ్రహం ఆకర్షణీయంగా వుంది. సాయిబాబా తలపాగాతో చాలా ఆకర్షణీయంగా వున్నాడు.
దేవాలయ సమయాలు.......ఉదయం 6-00 గంటల నుంచి 12-00 గం. ల వరకు, సాయంత్రం 4-00 గం. ల నుంచి రాత్రి 8-00 గం. ల వరకు.
(ఆంధ్ర భూమి 12-2-2009 సచిత్ర వార పత్రికలో ప్రచురించబడిన నా వ్యాసం)
పాపికొండలు
అందమైన గోదావరిమీద బోటులో ఉదయం 9-00 గంటలనుంచి సాయంత్రం 6-00 గంటలదాకా గడపటమంటే ఇష్టపడని వాళ్ళుంటారా? అయితే మీరు గోదావరి జిల్లాలోని పాపికొండలు చూసేవుంటారు. ఇంకా చూడలేదా అదేమిటండీ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ కొండలలో సగందాకా మునిగిపోతాయి.. మన రాష్ట్రంలో వుండి, కనుమరుగు కాబోతున్న ఈ అందాలను మనం చూసి ఆ ఙాపకాలను పదిలపరుచుకుని మన వారసులకు అందివ్వాలికదా. అయితే వెంటనే బయల్దేరండి.
రాజమండ్రిలో ఈ ప్రయాణానికి ఏర్పాటు చేసే టూరిస్టు అఫీసులు వున్నాయి. ఎ.పి. టూరిజం వారు కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాదు నుంచి కూడా రిజర్వు చేసుకోవచ్చు. ఈ ప్రయాణం రెండు రకాలు. మొదటిది ఉదయం 7-30 కి బయల్దేరి మళ్ళీ రాత్రి 8-00 గం. కి తిరిగి వచ్చేది. ఇందులో వెళ్ళేటప్పడు గంటన్నర వచ్చేటప్పడు గంటన్నర బస్సు ప్రయాణం వుంటుంది. ఇది ట్రావెల్ ఏజెంట్సే ఏర్పాటు చేస్తారు. ఛార్జీలు టికెట్ లోనే కలసి వుంటాయి. టికెట్ ఒక రోజుకి మనిషికి 500 రూ.లు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం టీ కూడా ఈ టికెట్ ఖరీదులోనే లాంచీలో ఏర్పాటు చేస్తారు. స్నాక్స్, కూల్ డ్రింక్స్ లాంచీ కేంటీన్ లో కొనుక్కోవచ్చు. మరి రెండవ ప్రయాణం భద్రాచలం దాకా. ఇది రెండు రోజుల ప్రయాణం. భద్రాచలంలో శ్రీ రామచంద్రుని ప్రత్యేక ధర్శనం చేయించాక తిరుగు ప్రయాణంలో ప్రసిధ్ధి చెందిన మద్ది ఆంజనేయస్వామి దర్శనం చేయించి తీసుకు వస్తారు. బహుశ తిరుగు ప్రయాణం బస్ లో అనుకుంటా రిజర్వు చేసుకునేటప్పడు ముందు కనుక్కోండి. ఈ ప్రయాణంలో పాపి కొండలు ఇంకా అందంగా వుంటాయంటారు. ఇప్పడు మేము వెళ్ళిన ఒక రోజు ప్రయాణం వివరాలు.
ఉదయం 7-30 కి రాజమండ్రి లోని లాంచీల రేవు దగ్గర వున్న మారుతీ ట్రావెల్స్ వారి ఆఫీసు దగ్గరనుంచి బస్ లో బయల్దేరి 8-50 కి పట్టిసం అనే వూరు చేరుకున్నాము. ( ఇక్కడ వీరభద్ర స్వామి ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది కానీ ఒక రోజు ప్రయాణంలో ఈ దేవాలయ దర్శనం లేదు. దీని కోసం కొంత దూరం పడవ ప్రయాణం తర్వాత కొంత నడక వుంటుంది.) పట్టిసం రేవులో లాంచీలు సిధ్ధంగా వున్నాయి. మేము రిజర్వు చేసుకున్న జాబిలి అనే లాంచీ ఎక్కాము. 9-10 కి జాబిలి బయల్దేరింది. అల్ప పీడన ప్రభావంతో వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా వున్నది. మేము పైన డెక్ మీదకెళ్ళి కూర్చున్నాము. గైడు ముందుగా ఆందరినీ పరిచయం చేసుకుంటూ మైకుతో సహా క్రిందా, డెక్ మీదా కలియ తిరిగుతూ హుషారు చెయ్యటం మొదలు పెట్టాడు. చుట్టుప్రక్కల ప్రదేశాల వివరాలు, విశేషాలు చెప్పటమేగాక కబుర్లు, జోక్సు, డాన్సులతో ప్రయాణమంతా హుషారుగా వుండేటట్లు చేశాడు.
నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి 1600 కి.మీ.లు ప్రయాణంచేసి, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ రోజు గోదావరి మీద మా ప్రయాణం 65 కి.మీ.లు. రాజమండ్రి దగ్గర 5 నుంచి 6 కి.మీ.ల వెడల్పు వుండే గోదావరి పాపి కొండల మధ్య 200 నుంచి 500 మీటర్ల వెడల్పు మాత్రమే వుంటుందిట.
రామయ్యపేట దగ్గర పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలయింది. గోదావరికి ఒక గట్టుమీద వున్న రామయ్యపేటనుంచి ఇంకో గట్టుమీద వున్న చిన్న కొండదాకా డామ్ నిర్మాణం జరుగుతుంది. ఇది పూర్తయితే 235 గిరిజన గ్రామాలు, పాపి కొండలు సగం 100 అడుగుల పైగా మునిగిపోతాయట. 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందటమేగాక విద్యుదుత్పాదన కూడా జరుగుతుంది.
కుడివైపు దెందూరు అనే గ్రామం దగ్గర లాంచీ మొదటి సారి ఆగుతుంది. ఇక్కడ గట్టుమీద వున్న గండి పోచమ్మ అమ్మవారి దర్శనార్ధం 15 ని. ల సమయం ఇస్తారు.
దైవ దర్శనం తర్వాత సినిమా కబుర్లు. గట్టు మీద కనిపించే పూడిపల్లి అనే వూళ్ళో పల్లెటూరు వాతావరణం వున్న సినిమాలు తీస్తారుట. త్రిశూలం సినిమాలో రావు గోపాలరావు ఇల్లు గట్టుమీద కనిపిస్తుంది. ఇంకా అందాల రాముడు, ఆట, ఆపద్బాంధవుడు, ఇలా ఎన్నో సినిమాలు అక్కడ రూపు దిద్దుకున్నాయి. తర్వాత దేశ భక్తి, చరిత్ర. అల్లూరి సీతారామరాజు చరిత్రలో వినిపించే దేవీ పట్నం లోని పాత, క్రొత్త పోలీసు స్టేషన్లను చూస్తాం. గట్టు మీద కనిపించే రెండు గులాబీ రంగు భవనాలు కొత్త పోలీసు స్టేషను, క్వార్టర్లు .. వాటి మధ్య కనిపించే పాత పెంకుటిల్లు బ్రిటిషు కాలంనాటి పాత పోలీసు స్టేషను.
కొండ మొదల అనే ఇంకో గ్రామం గురించి గైడు చెప్పిన సంగతి వింటే వెంటనే ఆ వూరు వెళ్ళాలనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్ళటానికి రోడ్లు వగైరాలేమీ లేవు. ఇంకో విశేషం అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే ఇప్పటికీ బార్టరు సిస్టమే అంటే వస్తువులిచ్చి పుచ్చుకోవాల్సిందేగానీ, మీ డబ్బులక్కడ చెల్లవు.
ఇంత వెనుకబడిన గ్రామం తర్వాత వచ్చేది కొరుటూరు. ఇక్కడ ఎ.సి. నాన్ ఎ.సి. కాటేజస్ వున్నాయి. కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడగండి.
ఇన్ని గ్రామాలను గురించి తెలుసుకుంటూ లాంచీలో జరిగే నాట్య ప్రదర్శనలు తిలకిస్తూ పాపికొండలు చేరేలోపల భోజనాలు పూర్తి చేశాము ఆ అందాలను గుండెనిండా నింపుకోవటానికి ఏ ఆటంకమూ వుండకుండా.. ప్రకృతి సోయగాలను ఇనుమడింపచేసి చూపించటానికి వరుణదేవుడు రోజులో చాలా భాగం సన్నగా కురుస్తూనే వున్నాడు. వానలో తడుస్తున్నా ఆ అనుభూతులెక్కడ కోల్పోతామోనని చాలామంది డెక్ మీదే వుండిపోయారు మాలాగే.
మా తరువాత మజిలీ పేరంటపల్లి, శ్రీ రామకృష్ణ మునివాటము అందులోని శివాలయం. లాంచీలో గైడు ముందే అక్కడ పాటించాల్సిన నియమాలు చెప్పాడు. గిరిజనులచే నిర్వహింపబడుతున్న ప్రదేశమని, అక్కడ వారికి సహాయం చేసే ఉద్దేశ్యం వుంటే ఆశ్రమ ప్రచురణలు కొనాలి తప్ప వేరే డబ్బు, వస్తువులు ఇస్తే వాళ్ళు చాలా బాధపడతారని. ఆ ఆలయం చాలా శక్తివంతమైనదవటంవల్ల అక్కడ తగుమాత్రమే మాట్లాడాలి అదీ మంచిమాటలే. ఇక్కడ పూజారి వుండడు, పూజకు సంకల్పం కూడా ఎవరూ చెప్పకూడదు. సంకల్పం వల్ల సూర్య చంద్రాదుల సాక్షిగా కోరికలు వెలిబుచ్చటమవుతుంది. జన్మ రాహిత్యానికి ఈ సంకల్పము ప్రతిబంధకమని ఇక్కడ నమ్మకం. దేవునికి ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పూజ చేసుకోవచ్చు. నైవేద్యం మాత్రం ఆశ్రమంలో వండిన పదార్ధాలే పెట్టాలి. శుచి, శుభ్రత కోసం. పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, ఎవరి ఇష్టం వారిది. అయితే వాటిని వినియోగించే బాధ్యత కూడా వారిదే. ఈ దేవాలయం చేరుకోవటానికి కొంచెం దూరం కొండమీదకి ఎక్కాలి. ఇక్కడ మాకిచ్చిన సమయం అర్ధగంట. ఇక్కడనుంచి మధ్యాహ్నం 2-45 కి తిరుగు ప్రయాణం మొదలు పెట్టి సాయంత్రం 6-10కి పట్టిసం, అక్కడనుండి బస్సులో రాత్రి 8-00 గం. లకు లాంచీల రేవు చేరుకున్నాము.
శ్రీ కొవ్వలిగారు మారుతీ ట్రావెల్స్ వాళ్ళ ఫాను నెంబరు అడిగారు. అందరికీ పనికి వస్తాయని పూర్తి వివరాలు క్రింద ఇస్తున్నాను.
ఇది ఆంధ్ర భూమిలో ప్రచురించబడిందికదా. ఒక పాఠకుడు వ్రాశారు. వాళ్ళు వేరే ట్రావెల్స్ లో బుక్ చేసుకున్నారుట. టికెట్ డబ్బు ఎక్కువ తీసుకున్నారని సంబంధించిన వాళ్ళందరికీ ఆంధ్రభూమి వ్యాసం కాపీ పంపించి రిప్రజెంటు చేశారు. తర్వాత సంగతి తెలియదు. ఆయన రిప్రజెంటు చేసినట్లు వ్రాసిన ఉత్తరం మాత్రం తరువాత వారం ప్రచురించబడింది. మేము వెళ్ళింది 15-11-2008న.
Maruthi Mini Tours & Travels
(Franchise A.P. Tourism & Ministry of Indian Tourism,
Godavari Bund Road, Beside Shankara Mattam
Near BPCL Petrol Bunk, Rajahmundry, E.G. Dist, Andhra Pradesh.
మనం పుట్టి పెరిగిన వూళ్ళు, మనకు తెలిసిన ప్రదేశాలు ఎన్నో పురాణ గాధలకు, చారిత్రిక విశేషాలకూ నిలయమంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది..ఎంతో ధ్రిల్లింగ్ గా కూడావుంటుంది కదా. మీలో చాలా మంది ద్రాక్షారామం పేరు వినే వుంటారు. అదేనండీ. తూర్పు గోదావరి జిల్లాలో వున్న పుణ్య క్షేత్రం. పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశంతో ముడిపడి వున్న పౌరాణిక గాధలు మీకు తెలుసా తెలుసు. దక్షుడు, యజ్ఞం బ్లా బ్లా బ్లా ఏదో వుంది. అదే కదా. పూర్తి వివరాలు చెప్పటానికి మీకే ఛాన్సు ఇస్తున్నాము. మీరే చెప్పెయ్యండి అంటారా. సరే నేనే చెప్తాను.
పురాణ కధలు తారకాసురుని మెడలోని శివ లింగాన్ని కుమారస్వామి ఛేదించగా ఐదు చోట్ల పడ్డ ఆ లింగం ముక్కలను వివిధ దేవతలు ప్రతిష్ఠ చేశారని చెప్పుకున్నాము కదా. అందులో ఒక ముక్క ఇక్కడ పడింది. ఇది వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠిత లింగం.
పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దాక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు. ఒకసారి దక్షుడు ఒక యజ్ఞం చేయ తలపెట్టాడు. ఆ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించాడు కానీ, తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించలేదు. కారణం అంతకు ముందెప్పుడో ఈయనగారిని చూసి ఆయన పలకరించలేదనీ, అభివాదం చేయలేదని కోపం వచ్చి. ఈ అలకలూ, కోపాలూ ఈ కాలంలోనే అనుకున్నాము, ఆ కాలంలోనూ వున్నాయా అనకండి. ఏ కాలమైనా గుణాలు తమ సహజత్వాన్ని కోల్పోవుకదండీ. అందుకని వాదోపవాదాలకు దిగకుండా ముందుకు సాగుదాం.
ఈ యజ్ఞం గురించి పార్వతీ దేవికి తెలిసింది. పుట్టింట్లో యజ్ఞం జరుగుతోంది, ఆసంబరం, ఆ హడావిడి తను మిస్ అయిపోతోందే అనుకుంది. శివుడి దగ్గర పుట్టింటికెళ్ళే ప్రపోజల్ పెట్టింది. కానీ శివుడు జగదీశ్వరుడు కదా. ఆయన పిలవని పేరంటానికి వెళ్ళకూడదు, వద్దు అని నీతి చంద్రిక తిరగేశాడు. కానీ ఆడవారు ఏదైనా తలచుకుంటే, అందులోనూ, పుట్టింటి విషయంలో దాన్ని సాధించకుడా వుండరుగా. మొత్తానికి పరమేశ్వరుడిని ఒప్పించి, పుట్టింట్లో జరిగే యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ ఏమయింది. ఎవరూ ఆవిడని పలకరించలేదు. ప్రేమాదరాలు చూపించలేదు. దానితో పార్వతీదేవికి కోపం వచ్చింది. భర్త మాట వినకుండా వచ్చినదానికి పశ్చాత్తాప పడింది. ఇటు పుట్టింట్లోనూ వుండలేక పోయింది, అటు శివుడి దగ్గరకెళ్ళి జరిగిన విషయం చెప్పలేక పోయింది. పాపం. ఆ అవమానం భరించలేక తనని తను కాల్చుకుని బూడిద అయింది. ఈ విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటంనుంచి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆయన వెళ్ళి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు.
పత్నీ వియోగాన్ని భరించలేని శివుడు పార్వతి సూక్ష్మ శరీరాన్ని భుజంమీద పెట్టుకుని ఆవేశంతో ప్రళయ తాండవం చేశాడు. శివుణ్ణి ఆపటానికి విష్ణువు పార్వతీ దేవి సూక్ష్మ శరీరాన్ని తన చక్రాయుధంతో ముక్కలు చేశాడు. ఆ శరీరం 18 ముక్కలయి 18 చోట్ల పడ్డాయి. అవే అష్టాదశ శక్తి పీఠాలు. వీటిని జగద్గురువు శంకరాచార్యుల వారు పున ప్రతిష్టించి అన్ని చోట్లా శ్రీ చక్రాలను కూడా స్ధాపించారు. దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశంలోనే శివుడు భీమరూపంలో స్వయంభువుడిగా వెలిశాడు.
ఇంకొక్క కధ మాత్రమే చెప్తానండీ ఈ క్షేత్రం గురించి. పూర్వం వేదవ్యాసుల వారు కాశీలో నివసించేవారు. ఒకసారి కాశీ విశ్వేశ్వరుడు ఆయన్ని పరీక్షించదలచి ఎక్కడా భిక్ష దొరక్కుండా చేశాడుట. దానికి వేదవ్యాసుడు కోపించి కాశీని శపించబోయాడుట. అప్పుడ అన్నపూర్ణాదేవి ఆయనకీ, శిష్యులకీ భిక్ష పెట్టిందట. వేదవ్యాసుడు కాశీని శపించబోవటం శివుడికి కోవం తెప్పించింది. వెంటనే శివుడు వేదవ్యాసుణ్ణి శిష్యసమేతంగా కాశీ విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. దానికి వేదవ్యాసుడు బాధపడగా అన్నపూర్ణాదేవి ఆయనకు దక్షారామము పోయి అక్కడ భీమేశ్వరుని సేవించమనీ, అక్కడ వుంటే కాశీలో వున్నట్లే వుంటుందనీ చెప్పగా వ్యాసుడు తన 300 మంది శిష్యులను వెంటబెట్టుకుని దాక్షారామం వచ్చి అక్కడ నివసించాడు. దీనికి గుర్తుగా ఆలయంలో ఒక స్తంబంమీద వ్యాసుని విగ్రహం చెక్కబడింది.
వింధ్య పర్వతం గర్వమణిచే కార్యక్రమంలో అగస్త్య మహర్షి ఇక్కడకొచ్చి కొంతకాలం ఇక్కడ నివసించాడు.
వివరణ చాలా పెద్దగా వుందా. మరి అన్ని విశేషాలు వున్నాయండీ. ఇంకా పైన చెప్పని విశేషాలు బోలెడున్నాయి. క్లుప్తంగా......
· మన దేశంలో దాక్షారామం, శ్రీ శైలం, శ్రీ కాళహస్తి మధ్య వున్న ప్రదేశాన్ని త్రిలింగ దేశమన్నారు. త్రిలింగ దేశానికి ఉత్తర సరిహద్దుగా దాక్షారామం ప్రసిధ్ధికెక్కింది.
· ఇక్కడ వెలసిన భీమేశ్వరునికి అభిషేకం చేయటానికి సప్త ఋషులు సప్తగోదావరులను తీసుకువచ్చారు. ఇవి అంతర్వాహినులు.
· వేదవ్యాసుడు, అగస్త్య మహర్షి ఒకే సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారు.
· ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ. అష్టాదశ శక్తిపీఠాలలో 12వ పీఠమిది.
· ఇక్కడ క్షేత్ర పాలకుడు లక్ష్మీ నారాయణ స్వామి. ఈయన్ని శ్రీ రామచంద్రుడు ప్రతిష్ఠించాడు.
· గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు.
· ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట.
· ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.
· ఇంకా శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్ఠించిన విరూపాక్ష స్వామి, రెండు తలల అష్టబంధ నాగేశ్వర స్వామి, కైలాస గణపతి దర్శనీయ దేవతా మూర్తులు.
· ఏక శిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.
· అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట.
· 9—10 శతాబ్దాలలో నిర్మింపబడిన ఈ ఆలయ కుడ్యాలపై 832 శాసనాలు చెక్కబడివున్నాయి. మనకి వీటిలోని వ్రాత అర్ధంకాకపోయినా చారిత్రిక పరిశోధకులకు ఇవి పెన్నిధి వంటివి. ఇలాంటి శాసనాల ఆధారంగా చేసిన పరిశోధనల ద్వారానే మనకు మనదేశ పూర్వ చరిత్ర తెలుస్తుంది.
· ఆలయాభివృధ్ధికి ఏ ఏ రాజులు ఎలా తోడ్పడ్డారు, ఏ మండపాలు, ప్రాకారాలు ఎవరు కట్టించారు, ఆలయ నిర్వహణకి ఏ రాజులు ఎంత దానాలిచ్చారు వగైరా వివరాలన్నీ ఈ శాసనాలలో లభ్యమవుతుంది.
· వాడ్రేవు జమీందారులిచ్చిన 125 ఎకరాల భూమిమీద ఆదాయం నేటికీ ఆలయాభివృధ్ధికి తోడ్పడుతోంది.
· భీష్మ ఏకాదశినాడు భీమేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామిల కళ్యాణం ఒకే వేదికపై జరపడం కూడా ఇక్కడి విశేషమే.
ఇన్ని విశేషాలున్న ఆలయాన్ని మరి మీరూ దర్శిస్తారుగా. దర్శన వేళలు గుర్తు పెట్టుకోండేం.
ఉదయం 6-00 గం. లనుండి 12-00 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3-00 గం. లనుండి 8-00 గం. ల వరకు.
వుండటానికి దేవస్ధానంవారి వసతి గృహాలు, ఉచితంవి, డబ్బు చెల్లించేవి వున్నాయి. దేవస్ధానం వారు మధ్యాహ్నం 12 గం.లకు ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
ఈ ప్రదేశం చేరటానికి కాకినాడ దాకా వెళ్ళి అక్కడనుంచి ఉదయం 9-30 కి. పాసెంజరులో వెళ్ళవచ్చు. గోదావరి జిల్లాలో ముఖ్య పట్టణాలన్నింటినుంచీ బస్సు సౌకర్యం బాగా వుంది. బస్సు స్టాండు గుడికి 1/2 కి.మీ. దూరంలో వుంది.
ఈక్షేత్రంలో అమృతలింగ శకలాన్ని కుమార స్వామి ప్రతిష్ఠ చేశారు.అందుకే దీనికి కుమారారామం అని పేరు.ఈ ప్రాంతాన్ని షుమారు క్రీ.శ. 624 నుండి క్రీ.శ. 1076 వరకు వేంగీ చాళుక్యుల పరిపాలించారు.వీరి వంశానికి మూల పురుషుడైన కుబ్జ విష్ణువర్ధనుడి నుంచి చివరి రాజైన ఏడవ విజయాదిత్యుని వరకు షుమారు 30 మంది రాజులు ముందు పిష్టపురము (నేటి పిఠావురము), తరువాతరాజమహేంద్రవరము (నేటి రాజమండ్రి)రాజధానిగాచేసుకుని పరిపాలించారు.వారి ఆదరణలో ఈ ఆలయాలు చాలా అభివృధ్ధిచెందాయి. ఈ ఆలయంలో వున్నశిల్ప సంపద వారి కాలంనాటిదే.ఈ వంశీకుడైన రాజ రాజ నరేంద్రుడే (క్రీ.శ 1060) గోదావరీ తీరాన రాజమహేంద్రవరం నిర్మించింది.అంతేకాదు. కవిత్రయంలో మొదటివాడైన నన్నయ చేత సంస్కృత మహాభారతమును తెలుగులోవ్రాయించితెలుగు సాహిత్యంలో ఒక నూతనయుగానికి నాంది పలికినవాడుకూడా ఈయనే.
చారిత్రక ఆధారాల ప్రకారం క్రీ..శ. 872 నుండి 921 వరకు మొదటి చాళుక్య భీమ నృపాలుడు కుమారారామమును రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈయన దాదాపు 300 యుధ్ధాలలో విజయం సాధించినట్లుశాసనాలవల్ల తెలుస్తోంది.బహుశా యుధ్ధాలలో ఈయన సాధించిన విజయాలకు కృతజ్ఞతతో, భీమేశ్వర స్వామిపట్ల తనకుగల భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ ఆలయాన్ని నిర్మింప చేసినట్లు తెలుస్తోంది. ఈయన పేరుతోనే ఈ ఆలయాన్ని చాళుక్య భీమారామం అన్నారు (బిర్లా కట్టించిన ఆలయాలను బిర్లామందిర్లన్నట్లు). ఊరుకూడా చాళుక్య భీమవరం అయింది (రోడ్డుకి అవతలవైపు సామర్లకోట ఇవతల భీమవరం) . ఆ కాలంలో ఇక్కడ వ్యాప్తిలో వున్న బౌధ్ధసంప్రదాయ ప్రభావం వల్లనే పంచారామాలలోఆరామ శబ్దం వచ్చి వుండచ్చని ఒక కధనం.
ఈ ఊరి పేరు వెనుక వున్న వేరే కధలు... పూర్వం ఇక్కడ వైష్ణవ స్వాములు ఎక్కువగా వుండేవారనీ, వాళ్ళకి ఈ గ్రామం చాలా సురక్షితంగా వుండేదనీ, అందుకే స్వాముల కోట అనేవారు, అదే సామర్లకోట అయిందని ఒక కధ.ఇంకో కధ...శ్యామలాంబ గుడి, దాని చుట్టూ కోటవుండేవనీ, అందుకేశ్యామలకోట అని పిలిచేవారనీనూ.ఏ కధలు ఎలా వున్నా శ్రీనాధ కవి రచనల ద్వారానూ, లభ్యమయిన శిలా శాసనాల ద్వారానూ చాళుక్య భీమవరం, కుమారారామం అన్నవే పూర్వకాలంనుంచీ స్ధిరంగా వున్న పేర్లు అని నిరూపితమవుతోంది.
ఆలయ విశేషాలు
ఈ ఆలయం వాస్తులో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలి వుంటుంది.ఈ దేవాలయం చుట్టూ ఇసుక రాతితో కట్టబడిన రెండు ప్రాకారాలున్నాయి.బయటి ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు గోపురాలున్నాయి.లోపలి ప్రకారంలో రెండు అంతస్తుల భీమేశ్వరాలయం వుంది.క్రింది అంతస్తులో ప్రతిష్టింపబడిన శివ లింగము చాలా ఎతైనది.పూజలు రెండవ అంతస్తులో జరుగుతాయి.
గుడి ప్రాంగణంలో భీమేశ్వరాలయాన్ని పోలిన ఒక చిన్న నమూనా గుడి వుంది.బహుశా గుడి కట్టటానికి ముందు స్ధపతి గుడి నిర్మాణంలో మార్గదర్శకంగా వుంటుందని ఈ నమూనాను చెక్కి వుండవచ్చు.ఆలయంలో ప్రవేశిస్తూనే కనిపించే నందీశ్వరుని ఏకశిలా విగ్రహం ఒక ఆద్భుతసజీవ శిల్పం.ఇక్కడి శిల్పంలో మరోవిశేషమేమిటంటే ప్రతి శిలా స్తంబమూ దేనికదే ప్రత్యేకమయినది.ఏ రెండు స్తంబాలూ ఒక్కలా వుండవు.ప్రతి స్తంబములోనూ ఏదో ఒక శిల్ప వైవిధ్యాన్ని ప్రదర్శించారు.
ఈ దేవాలయంలో క్రీ.శ. 1447 నుండి క్రీ.శ. 1494 మధ్య జారీ చేసిన 31 శాసనాలున్నాయి.వీటిలో కొన్నిటి ఆధారంగా తూర్పున వున్న ముఖ మండపం నిర్మాణం క్రీ.శ. 1394 లోనూ, శ్రీ ముఖమండపం నిర్మాణం క్రీ.శ. 1422 లోనూ జరిగినట్లు తెలుస్తోంది.
స్వామి దర్శనం కోసం రెండవ అంతస్తుకి వెళ్ళటానికి గర్భగుడికి రెండు వైపులా రెండు ద్వారాలున్నాయి.దక్షిణ ఆగ్నేయం వైపుది సూర్య ద్వారము, ఉత్తర ఈశాన్యం వైపుది చంద్ర ద్వారము.ఈ రెండు మార్గాలూ గర్భగుడికి రెండు నాసికా రంధ్రాల్లాగా అనిపిస్తాయి.మానవుడి నాసికా రంధ్రాలలో ఎడమది చంద్రనాడి, కుడిది సూర్యనాడి.యోగి ఈ రెండు నాడుల ద్వారా చేసే ప్రాణాయామం ప్రక్రియద్వారా తన ప్రాణమును సహస్రారమున చేర్చి, ఆ ప్రాణముతో తన మనస్సుకూడాఅక్కడ చేర్చి భగవదనుభవంచేత ఆనందమయుడై విరాజిల్లుతాడు.ఇది యోగమార్గం.ఇక్కడ స్వామి యోగలింగాకృతి ధరించి వున్నాడు. ఈ స్వామి దర్శనం కూడా ఈ యోగ మార్గాన్నే వెల్లడిస్తూంటుంది.
శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి దేవేరి శ్రీ బాలా త్రిపుర సుందరిఈ తల్లిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు.ఆలయంచుట్టూ వున్న చిన్న చిన్న గుళ్ళల్లో బ్రహ్మ, సరస్వతి, సూర్యుడు, మహిషాసుర మర్దని మొదలగు అనేక దేవతామూర్తుల విగ్రహాలున్నాయి.ఇక్కడ సరస్వతి సకల విద్యా ప్రదాయిని. మహిషాసురమర్దని విగ్రహం త్రవ్వకాలలో బయటపడింది.దీనిని కొండవీటి రాజైన కాటయ వేమారెడ్డి 15 వ శతాబ్దిలో ప్రతిష్టించినట్లు చెబుతారు.ఈవిడకే శ్యామలా శక్తి అనే పేరు కూడా వున్నది.
ఈ ఆలయ నిర్మాణంలో ఇంకో విశేషం.. చైత్ర, వైశాఖ మాసాలలో సూర్యుని కిరణాలు ఉదయం పూట స్వామివారి పాదాలను, సాయంత్రం పూట అమ్మవారి పాదాలనూ తాకుతాయి.ఆలయం పడమటి గోడలో వజ్ర గణపతి విగ్రహం వుంది.పూర్వం ఈయన నాభిలో ఒక వజ్రం వుండేదిట.దానినుంచి వచ్చే ఆద్భుత కాంతులే రాత్రి పూట భక్తులకు మార్గదర్శకంగా వుండేవిట.భీమేశ్వరుని ఆలయం ఎదురుగా తూర్పు దిక్కులో వున్న పుష్కరిణి పేరు భీమ పుష్కరిణి.
నిర్వహణ
ఈ మధ్య ఈ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోంది.1964 నుంచీ ఈ ఆలయం కేంద్ర పురావస్తుశాఖ అధీనంలో వున్నది.ఉత్సవ నిర్వహణ, ఆదాయ వ్యయాలు రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్వహణలో వున్నాయి.ఆలయాభివృధ్ధికి స్ధానికులతో ఏర్పడిన ధర్మకర్తల మండలి కృషి చేస్తుంది.
ఉత్సవాలు
కార్తీక, మార్గశిర మాసాలలో నిత్యం అభిషేకాలు జరుగుతూంటాయి.కార్తీక మాసంలో దీపాలంకరణ, సంకీర్తన, అన్నదానాది కార్యక్రమాలు జరుగుతూంటాయి.మాఘ బహుళ ఏకాదశినాడు స్వామి వారికి గ్రామోత్సవం, అనంతరం కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతాయి.ఆ రోజు నుంచి మహా శివరాత్రి వరకూ ఉత్సవములు, అభిషేకములు, పూజలు పాంచాహ్నిక దీక్షతో జరుపబడతాయి.
దర్శన సమయాలు
ఉదయం 5 గం. ల నుంచి 12 గంటల దాకా, సాయంత్రం 4 గం. ల నుంచి9 గం. ల వరకు.
మాండవ్య నారాయణ స్వామి ఆలయం
భీమేశ్వరాలయానికి200 గజాల దూరంలో మాండవ్య నారాయణ స్వామి ఆలయం వుంది.ఈ స్వామిని త్రేతాయుగంలో మాండవ్యముని ప్రతిష్టించారు.క్రీ.శ. 650 లో విజయాదిత్యచోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు.
తారకాసురుని సంహారానికి పూర్వంనుంచే ఇక్కడ శివారాధన జరుగుతూవుండేదని ప్రతీతి. సప్త మహర్షులలో కౌశిక మహర్షి ఒకరు. ఆయన కుమారుడు ఉపమన్యుడు ఇక్కడ శివారాధన చేస్తూ, శివునికి అభిషేకము చేయటానికి పాలు లభించకపోవటంతో ఆ పరమేశ్వరుడినే ప్రార్ధించాడు. ఫరమేశ్వరుడు భక్తునికోరిక తీర్చటానికి తన త్రిశూలంతో నేలపై గ్రుచ్చగా అక్కడ పాలకొలను ఏర్పడింది. అప్పటినుండీ ఆ వూరి పేరు పాలకొలను అయింది. వాడుకలో పాలకొల్లుగా మారింది.
ఐదు భాగాలయిన అమృత లింగంలో ప్రధాన భాగమైన శిరో భాగమిక్కడ పడ్డదని, శివలింగానికి కొప్పు భాగంలో వున్న ఆకారం దీనికి ఋజువంటారు. అంతేగాక అక్కడ లభించిన శాసనాలలో కూడా ఈ స్వామిని కొప్పు లింగేశ్వరుడిగా వర్ణించారు.
ఒక కధనం ప్రకారం మిగతా నాలుగు ఆరామాలలో అమృతలింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తానికి వివిధ దేవతలచే జరపబడినా, క్షీరారామంలో మటుకూ, శివాదేశంతో ఆ శకలము పెరగకుండా కాపాడబడి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠింపబడింది.
దేవస్ధాన ప్రచురణ దివ్య పంచారామ క్షేత్రం శ్రీ క్షీరారామం లో శ్రీ క్షీరారామలింగేశ్వరుడి ప్రతిష్ఠ శ్రీ మహా విష్ణువుచే కావింపబడిందని వ్రాశారు. ఆపుస్తకం ఆధారంగా శ్రీ మహా విష్ణువు శ్రీ క్షీరారామలింగేశ్వరుడిని త్రిపురసుందరి (పార్వతీదేవి) సమేతంగా ప్రతిష్ఠించి శివుని కోర్కెపై క్షేత్రపాలకుడిగా శ్రీ లక్ష్మీసమేతుడై, శ్రీ జనార్దనస్వామిగా ఈ క్షీరారామంలో కొలువైనాడు. అంతేగాక వివిధ క్షేత్రాలలో అక్కడి దేవతలను సంవత్సరాలతరబడి భక్తితో సేవిస్తే వచ్చే ఫలితం ఈ క్షేత్రంలో ఒక నిద్రతోనే లభిస్తుందని, ఈ స్వామి దర్శనంతో బ్రహ్మ హత్యాది సకల పాపాలూ పోతాయని శ్రీ మహావిష్ణువు క్షీరారామలింగేశ్వరుని ప్రతిష్ఠించినప్పుడు ఈ క్షేత్ర విశిష్టతను గూర్చి తెలిపారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం ప్రయోగించి సర్వ పాప నాశనకరమైన రామగుండం పుష్కరిణిని ఏర్పరిచారు.
ఆలయ విశేషాలు
ఈ ఆలయ విశేషాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది రాజగోపురం, ప్రజల భాషలో పెద్ద గోపురం. దీనిని 1777 సంవత్సరంలో శ్రీ బచ్చు అమ్మయ్యగారు నిర్మింపచేశారని కొందరంటే రెడ్డి రాజుల కాలంనాటిదని ఇంకొందరి కధనం. దీని ఎత్తు షుమారు 120 అడుగులు. 9 అంతస్తుల నిర్మాణం ఇది. చివరి అంతస్తుదాకా వెళ్ళటానికి లోపలనుంచి మెట్లు వున్నాయి. ఆలయ గోపురాలలో మొదటి లేక రెండవ ఎత్తైన గోపురం ఇదని ఒక రికార్డు వున్నట్లు నేను విన్నాను. కానీ ఆలయంవారు ప్రచురించిన పుస్తకంలో ఈ విశేషాన్ని మరిచారు. ఈ గోపురం మీద అనేక సుందర శిల్పాలు చెక్కబడి వున్నవి. ఈ గోపురాన్ని 2000 సంవత్సరంలో స్ధానిక శాసన సభ్యులు శ్రీ అల్లు వెంకట సత్యనారాయణగారి ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో పునరుధ్ధరించారు. ఫ్రాచీన కాల శిల్ప సంపదని కాపాడటానికి ప్రభుత్వం చేసిన కృషి కొనియాడదగింది. అలాగే చరిత్ర గురించి కూడా ఇలాంటి ప్రముఖ ఆలయాల కమిటీలు శ్రధ్ధ తీసుకుని తగు పరిశోధనల తర్వాత సరియైన విశేషాలను పుస్తక రూపంలో ప్రచురిస్తే మన పూర్వీకులు మనకందించిన అద్భుతమైన పౌరాణిక చారిత్రాత్మక కళాఖండాల వారసత్వాన్ని తర తరాలకు అందించగలరు.
ఇప్పుడు ఇక్కడ కొలువైన దేవతల గురించి తెలుసుకుందాము. ఫ్రధాన దైవం క్షీరా రామ లింగేశ్వరుడు తెల్లగా పాలలాగా అద్భుతమైన వర్ణంతో దర్శనమిచ్చే రెండున్నర అడుగుల ఎత్తైన లింగం. స్వామిని చూడగానే భక్తి ప్రపత్తులతో చేతులు జోడించకుండా వుండలేము. ఇంకొక విశేషం. ప్రతి సంవత్సరం ఉత్తరాయణ, దక్షిణాయణ కాలాల్లో సూర్యోదయ సమయంలో సూర్యని కిరణాలు పెద్ద గోపురం రెండవ అంతస్తునుండి శివలింగంపై పడటం.
స్వామి ఎదురుగా ప్రాకారమండపం మధ్యలో చిరు గంటల పట్టీతో, కాలి మువ్వలతో అందంగా వున్ననల్లరాతి నందీశ్వరుడున్నాడు.
అమ్మవారు పార్వతీ దేవి రామలింగేశ్వరునికు ఎదురుగా వున్న మండపంలో కుడివైపు కొలువు తీరింది. పూర్వం శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇదివరకు ఈవిడని త్రిపుర సుందరీదేవిగా కూడా వ్యవహరించేవారు. ఇక్కడ నిత్య కుంకుమార్చనలు జరుగుతాయి.
క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి అని చెప్పాను కదా. ఆయన చుట్టూవున్న వెండి మకర తోరణం మీద వున్న దశావతారాలనుకూడా చూడండి మరి. ఈయన దేవేరి లక్ష్మీదేవి మందిరంకూడా దర్శించండి.
ప్రధానాలయంలో పశ్చిమ ముఖంగా ఋణహర గణపతి వున్నాడు. ఈయన్ని పూజిస్తే ఋణ విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. కానివ్వండి మరి.
రావణ వధానంతరం శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషం పోగొట్టుకోవటానికి రామేశ్వరలింగంతోపాటు కాశీ నుంచి తెచ్చిన 106వ శివలింగాన్ని కాశీ విశ్వేశ్వరుడిగా ఇక్కడ ప్రతిష్ఠించాడు. అందుకే ఈ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుడిని దర్శిస్తే ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించినట్లేనని భక్తులు భావిస్తారు. ఇంకా ఈ ప్రాకారంలో వున్న ఆంజనేయస్వామి, వీరభద్రేశ్వరుడు వంటి అనేక దేవీ దేవతా మూర్తులనేకాక ఆలయ స్తంబాలపై చెక్కిన పురాణ ఘట్టాలను, చాళుక్య, రెడ్డి రాజుల, కాకతీయ రాజుల శాసనాలు కూడా వీక్షించండి.