Friday, March 20, 2009

ద్వారపూడి

ప్రకృతి సౌందర్యంలో అందాల నంది విగ్రహం
మూడంతస్తుల శివాలయం, ఎదురుగా నంది

సాయిబాబా దేవాలయం

అయ్యప్ప దేవాలయం

అయ్యప్ప దేవాలయం పై అంతస్తు

దేవాలయం ముందు హరి హరుడు

ద్వారపూడి

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 20 కి.మీ. ల దూరంలో ద్రాక్షారామం వెళ్ళే తోవలో వున్న ఈ ఊళ్ళో 10 సంవత్సరాల క్రింతం కట్టబడిన అయ్యప్ప దేవాలయంతోబాటు, సాయిబాబా, శివాలయాలు కూడా వున్నాయి. విశాలమైన ప్రాంగణంలో వున్న ఈ దేవాలయాలు చూపరులను అమితంగా ఆకర్షిస్తాయి.

అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు.

అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న వెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది. ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా మూడు అతస్తుల శివాలయం వున్నది. ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా 3 వ అంతస్తు దాకా వుంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి. శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి, నటరాజు విగ్రహాలున్నాయి.

అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసినదే.

Saturday, March 14, 2009

మావుళ్ళమ్మవారి దేవాలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

మావుళ్ళమ్మవారి ఆలయ దృశ్యం

మావుళ్ళమ్మవారి ఆలయం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా

పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో నెలకొని వున్న మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తూ ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు. పూర్వం ఈ చుట్టుప్రక్కల అంతా మామిడి తోటలు వుండేవిట. అందుకే ఈ అమ్మవారిని మావుళ్ళమ్మ....మావిడి చెట్లల్లో వున్న అమ్మ అనేవారని కొందరి కధనం. ఇంకొందరు చెప్పేదేమిటంటే ఈ చట్టుప్రక్కల వున్న వూళ్ళన్నిటిని చల్లగా కాపాడే తల్లని ప్రతివారూ మా వూళ్ళ అమ్మ ...మా వూళ్ళకి అమ్మ...అనేవారు.. ఆ పేరే మావుళ్ళమ్మ అయింది.

వంద సంవత్సరాల పైన చరిత్రగల ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం మొదట్లో భీకరంగా వుండేది. ఆ విగ్రహం 1910 లో వచ్చిన వరదలలో పాక్షికంగా దెబ్బతినటంతో శ్రీ గ్రంధి అప్పారావుచే మలచబడ్డ ఇప్పటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రస్తుతం అమ్మవారు కరుణారసమూర్తి.

చతుర్భుజ అయిన ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తు వుంటుంది. నాలుగు చేతులలో ఖడ్గం, త్రిశూలం, డమరుకం, కలశం వున్నాయి. విశాలమైన కళ్ళతో అత్యంత ఆకర్షణీయంగావుండే ఆ తల్లి కూర్చున్నట్లు వుంటుంది.

ఈ తల్లి చల్లని దీవెనలతోనే తమ ప్రాంతం సుభిక్షంగా వుందని అక్కడి ప్రజల విశ్వాసం.

ప్రతి సంవత్సరం జనవరి 14నుంచి నెల రోజులపాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

విజయవాడకి 103 కిలో మీటర్ల దూరంలో వున్న ఈ వూరికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. సమీప ఎయిర్ పోర్టు విజయవాడ. భీమవరం రైలు స్టేషను నుంచి గుడి 2 కి.మీ. ల లోపే వుటుంది.

బస్ స్టాడునుంచి గానీ, రైల్వే స్టేషను నుంచి గానీ అటో తీసుకుంటే గునుపూడి సోమేశ్వరాలయం, యనమదుర్రు శక్తేశ్వర స్వామి దేవాలయం, భీమవరం మావుళ్ళమ్మ దేవాలయం చూసి రావచ్చు. అన్నీ కలిపి 10—15 కి.మీ. ల దూరంలోనే వున్నాయి.