Wednesday, December 31, 2008

సోమారామం

ఎడమ వైపు క్రింద సోమేశ్వరాలయం, పైన అన్నపూర్ణాదేవి ఆలయం, కుడి ప్రక్క జనార్దనస్వామి ఆలయం
గర్భగుడి విమానం, గుడి గోపురం

సోమారామం
(గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా)

సదాశివుని ఆదేశముచే కుమారస్వామిచే గురిచూసి కొట్టబడ్డ తారకేశ్వరుని కంఠంలోని అమృతలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడ్డదని చెప్పకున్నాముగదా.. అందులో ఒక ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలో గునుపూడి అనే ప్రాంతంలో పడ్డది. శివుని ఆదేశానుసారం, దేవగురువు బృహస్పతి సలహాపై దేవతలలో ఒకరైన చంద్రుడు దేవగణములతో వచ్చి ఆశ్వీయజ శుధ్ధ దశమి రోజున శివ లింగప్రతిష్ఠ జరిపారు. ఈ శకలాలు పడ్డచోట ఓం అనే శబ్దంతో పడ్డాయి. క్షీరారామంలో తప్ప మిగతా ప్రదేశాలలో ఒకే సమయములో వివిధ దేవతలచేత ఈ లింగాలు ప్రతిష్ఠంచబడ్డాయి.

కవి సార్వ భౌముడు శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణంలో ఈ సోమారామం గురించి వర్ణించారు. అగస్త్య మహర్షి తన కాశీ వియోగ దుఖాన్ని పోగొట్టుకోవటానికి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా కాశీ ఖండం అనే గ్రంధం లో వ్రాయబడివుంది.

మూల విరాట్ సోమేశ్వరలింగం పీఠం నుండి 2 అడుగుల ఎత్తులో వున్నది. ఇంకొక విశేషం. ఇక్కడ శివలింగం అమావాస్యకు గోధుమ, నలుపు రంగుల్లోను, పౌర్ణమికి తెల్లని రంగులోనూ ప్రకాశిస్తుంది. ఈ లింగం చంద్రుడి చేత ప్రతిష్ఠంపబడింది కనుక చంద్రుని వృధ్ధి క్షయలు లింగంలో ప్రతిబింబిస్తాయంటారు. ఈ లింగానికి వున్న నాగాభరణం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.

ఈ ఆలయంలో దేవేరి అన్నపూర్ణ మొదటి అంతస్తులో కొలువై వున్నది. ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశగా వున్న కోనేరుని సోమగుండం లేక చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. ఆలయంలో జనార్దన స్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు నిత్యపూజలందుకుంటున్నాయి. అందుకే ఇది హరిహర క్షేత్రంగా పేరు పొందింది.

ఈ ఆలయం పాలకొల్లుకు 28 కి.మీ.,కైకలూరుకు 38 కి.మీ. గుడివాడకు 66 కి.మీ. దూరంలో వున్నది. ఈ ప్రదేశాల నుంచేకాక హైదరాబాదునుంచి కూడా బస్సు రైలు సౌకర్యాలున్నాయు.
























































































































Monday, December 15, 2008

అమరావతి

నిర్మాణంలో వున్న బుధ్ధ విగ్రహం
ఆలయ గోపురం
ఆలయ దృశ్యం

అమరావతి

అమరావతి గుంటూరుకి 32 కి.మీ. ల దూరంలో పవిత్ర కృష్ణవేణి నది ప్రక్కన వున్నది. గుంటూరు బస్ స్టాండునుంచి అమరావతి గుడి వరకు బస్సులు చాలానే వున్నాయి. ఇవేకాక ప్రైవేటు జీపులు, టాక్సీలు కూడా దొరుకుతాయి. అమరావతిలో వసతి, భోజన సౌకర్యాలకుఇబ్బంది లేదు. వాసవి ఆర్య వైశ్య నిత్యాన్నదాన సమాజంలో వైశ్యులకు ఉచిత భోజన ఏర్పాటు వున్నది. షిరిడి సాయి – పర్తి సాయి కపోతేశ్వర ధ్యాన మందిరం వారు కులాలకతీతంగా ఎవరు ముందువస్తే వారి పేర్లు నమోదు చేసుకుని, టోకెన్లిచ్చి, రోజూ 12 గం. లకు కొంతమందికి ఉచితంగా భోజనం పెడతారు.

ఇంక అమరావతిచరిత్ర గురించి తెలుసుకుందామా? నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆ నాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీతీరమగుటచేత సారవంతమైన భూమి వున్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువగా నివసించేవాళ్ళు. మొదట ఇక్కడ నాగులు అనే అతి ప్రాచీన జాతివాళ్ళు నివసించేవారు. తర్వాత యక్షులు. వీరి కాలంలోనే ఇక్కడ శైవ మతాభివృధ్ధి చెందింది. అంతేకాదు, బౌధ్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. అశోక చక్రవర్తి బౌధ్ధమత ప్రచారానికి మహాదేవస్ధవీరుడు అనే ఆయనను ఈ ప్రాంతానికి పంపించాడు. అతడు ధాన్యకటకమును కేంద్రముగా చేసుకుని తన ప్రచారాన్ని సాగించాడు. శాతవాహనుల కాలంలో ఇప్పడున్న స్తూప ప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారింది. దీని నిర్మాణం నాగరాజులనుండి నాగార్జుని కాలం వరకు మొత్తం నాలుగు దశలలో పూర్తయింది.

అమరావతి విద్యా విషయంలో కూడా చాలా ప్రసిధ్ధికెక్కింది. ఆచార్య నాగార్జునుడు స్ధాపించిన విశ్వ విద్యాలయంలో చైనా, జపాను, టిబెట్టు, సింహళ దేశాలనుంచి వచ్చిన విద్యార్ధులు విద్యని అభ్యసించేవాళ్ళు. ఇలాంటి విద్యాపీఠాలు ఇంగా వున్నందువల్ల విద్యనభ్యసించేవారి సంఖ్య వేలలో వుండేది. వాటి నిర్వహణ, విద్యార్ధుల వసతి, భోజనాలన్నీ రాజులే ఏర్పాటు చేయించారు. తర్వాత ధాన్యకటకం నుంచి శ్రీ కొండకి విద్యాపీఠాన్ని మార్చి ఆ కొండకు నాగార్జున కొండ అని, ఆవిద్యా పీఠానికి నాగార్జున విద్యాపీఠమని పేరు పెట్టారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా అమరావతిని సందర్శించి అనేక కానుకలు ఇచ్చారు.

తర్వాత కాలంలో ఇక్ష్వాకులు తెలుగు నేలను పరిపాలించారు. కానీ వారు శ్రీ కొండను (నేటి నాగార్జున కొండ) రాజధానిగా చేసుకున్నారు. దానితో ధాన్యకటకము ప్రాబల్యము తగ్గింది. శంకరాచార్యుల వారి కార్య దీక్షతో వైదిక మతం మళ్ళీ బలపడింది. క్రీ.శ. 5 వ శతాబ్దములో చైనా యాత్రికుడు హుయాన్ చాంగ్ కూడా ధాన్యకటకము గురించి వ్రాశాడు. క్రీ.శ. 1526 లో హంద్రికల పెదప్పంగారు ఆలయాన్ని మూడోసారి పునరుధ్ధరించారు. తురుష్కుల దాడులలో ధాన్యకటకము అతలాకుతలమయింది. స్తూపము నేలమట్టనయింది. కోటపాడుపడింది. అయినా అమరేశ్వరుడు మాత్రం ఆంధ్రరాజులకు ఆరాధ్యదైవంగానే వున్నాడు.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని అభివృధ్ధి పరచినవారిలో శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ముఖ్యుడు. ఈయన హయాంలో ఆలయ పునరుధ్ధరణ చెయ్యటమేగాక అక్కడ పని చేసేవారికి, వ్యాపారులకు ఇళ్ళు కూడా కట్టించారు. క్రీ.శ. 1816 లో ఈయన మరణించిన తర్వాత స్వామివారి ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది ఏర్పడింది. అప్పుడు అర్చకులు హైదరాబాదు నవాబైన నాజరుద్దౌలా గారికి చందూలాల్ అనే దివానుగారి ద్వారా పరిస్ధితి వివరించారు. నవాబు స్వామిని చెప్పమనండి చూద్దాం అన్నారుట. నవాబుకు అమరేశ్వర స్వామి కలలో కనబడి తన భక్తుల కోరిక తీర్చమని చెప్పాడుట. నవాబు సంతోషంతో ఖమ్మంజిల్లా మధిర తాలూకాలోని దెందుకూరు గ్రామంలో షుమారు 450 ఎకరాల భూమే కాక సంవత్సరానికి 1000 హాలీ రూపాయలు నగదు ఇవ్వటానికి ఫర్మానా జారీ చేశారు.

ఇంక ఆలయం గురించి తెలుసుకుందామా? అమృతలింగంలో పెద్దముక్క ఇక్కడ పడింది. అంతేగాక అది పెరగసాగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుణ్ణి అర్చించాడుట. దానితో పెరగటం ఆగింది. అంతేగానీ శివును శిరస్సు మీద మేకు కొట్టటం నిజం కాదంటారు. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివ లింగాలేకాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నాయి. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీ కాళ హస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం. శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.

ఆలయంలో మనకు కనిపించే అర్చా మూర్తి 10 అడుగుల పొడుగు, రెండు అడుగుల వెడల్పు కలిగి తెల్లటి మార్బుల్ రాయిలాగా వుంటుంది. మిగతా భాగము క్రింది భాగములో భూమిలో వున్నది. స్వామికి అభిషేకం చేయటానికి వీలుగా గర్భ గుడిలో ఒక ప్రక్కనుంచి మెట్లు వుంటాయి. వాటి మీద నుంచి వెళ్తే వైన బాల్కనీలాంటి ప్రదేశంలో నుంచుని స్వామికి అభిషేకం చేస్తారు. అందరికీ గర్భ గుడిలోకి ప్రవేశం లేదు.

ఇక్కడ అమ్మవారు శ్రీ బాల చాముండేశ్వరీ దేవి. ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి.

పూర్వం దేవతలు దానవుల మీద యుధ్ధానికి వెళ్ళే ముందు ఈ క్షేత్రంలో కొన్ని సంవత్సరాలు వుండి, ఈ స్వామిని అర్చించి తగిన శక్తిని పొందారు. ఈ స్వామిని అర్చించినవారిలో శౌనకాది మహా మునులు కూడా వున్నారు. యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోఛ్ఛారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుంది.







Sunday, December 14, 2008

పంచారామాల చరిత్ర

పంచారామాలు

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మహా విష్ణువు మూలంగా తమ జాతివారంతా నశించిపోతున్నారని, విష్ణువుని చంపి తమ జాతిని రక్షించాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడిని తనకు చావులేకుండా వరమివ్వమని కోరాడు. శంకరుడు సరేనని దేవ దానవులు అమృత మధనం చేసినప్పుడు లభించిన అమృత లింగాన్ని తారకుడికిచ్చి, ఈ అమృత లింగం యధాతధంగా వున్నంతమటుకు నీ ప్రాణానికి ఏ భయమూ లేదు అని వరమిచ్చాడు. తారకుడు ఆలింగాన్ని గొలుసుతో తన మెడలో ధరించాడు.

శివుడి నుంచి తనకు చావులేకుండా వరమేకాకుండా అమృత లింగాన్ని కూడా పొందిన గర్వంతో తారకుడు తన ధ్యేయం నెరవేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంద్రలోకంమీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. దేవతలంతా మహా విష్ణు దగ్గరకి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారుట. విష్ణువు తారకుడు శివ వరము పొందినవాడు, నేనేమీ చేయలేను, ఆ శంకరుణ్ణే ఉపాయమడుగుదామనగా అందరూ మహా శివుడి దగ్గరకెళ్ళి తారకుని దుష్కృత్యాల గురించి విన్నవించుకున్నారు. శివుడు ప్రసన్నుడయ్యాడు. తారకుడికి తానే వరమిచ్చినా, లోకోధ్ధరణకోసం దుష్ట సంహరణ, శిష్ట సంరక్షణ చేయాలిగనుక దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. తన కుమారుడైన కుమారస్వామి ఈ కార్యానికి తగినవాడని, అతనిని దేవ సైన్యానికి సర్వ సేనానిని చేసి వానిని వెంటపెట్టుకుని తారకుని పై యుధ్ధానికి వెళ్ళండి మీకు జయం కలుగుతుందని.

శివుని ఆదేశాన్ని దేనతలు పాటించారు. కుమారస్వామి శరపరంపరల ధాటికి రాక్షస సైన్యం చెల్లాచెదరయ్యింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాన్తో ఉద్రిక్తుడయిన తారకుడు స్వయంగా కుమార స్వామితో యుధ్ధానికి దిగాడు. ఆ యుధ్ధములో తారకునిదే పై చెయ్యి అయింది. దానితో కుమారస్వామి ధాన్య కటకము చేరుకుని అక్కడ కొంతకాలం వున్నాడు. ఈ విషయాన్ని దేవతలు శివునికి తెలియజేశారు. ఇంకొకసారి కుమార స్వామి తారకుని మీదకు దండెత్తి మహా బలోపేతమైన శక్తిని వాని మీద ప్రయోగించాడు. అది కూడా వానినేమీ చేయలేక పోవటంతో బాధతో తిరిగి ధాన్యకటకం చేరాడు. ఈ వార్త తెలిసిన శివుడికి తానిచ్చిన ఆత్మలింగం సంగతి గుర్తువచ్చి ఆ విషయం కుమారస్వామికి తెలిపి ఆత్మలింగాన్ని గురిచూసి ఛేదించమనండి తప్పక విజయం లభిస్తుందని తెలిపాడు.

తర్వాత జరిగిన యుధ్ధంలో కుమారస్వామి తారకుని మెడలోనున్న ఆత్మ లింగాన్ని ఛేదించగా అది ఐదు ముక్కలయి ఐదు ప్రాంతాల్లో పడ్డది. వెంటనే తారకుడు ప్రాణాలొదిలాడు. అందులో పెద్దముక్క అమరారామంలో పడ్డది. ఆత్మ లింగం అమృత లింగం కనుక అవి పెరుగ సాగాయి. పరమేశ్వరుని ఆదేశం ప్రకారం దేవ గురువు బృహస్పతి సలహా మీద వాటినన్నిటినీ ఆశ్వయుజ శుధ్ధ దశమి రోజున ఒకే ముహూర్తములో ప్రతిష్ఠ చేసి వాటి పెరుగుదలని అరికట్టారు. అవే పంచారామాలు. ఈ ఆరామాలు ప్రతిష్ట చేసిన వారి పేరుతో ప్రసిధ్ధికెక్కాయి. ఈ ప్రతిష్టలు ఎవరు ఏ ప్రదేశంలో చేశారో తెలుసుకుందామా?

దేవేంద్రుడు అమరారామంలో .... అదే నేటి అమరావతి
సోముడు (చంద్రుడు) సోమారామంలో ..... నేటి గునుపూడి (భీమవరం దగ్గర)
శ్రీరామచంద్రుడు క్షీరారామంలో ... నేటి పాలకొల్లు (ఇది త్రేతాయుగంలో జరిగింది అంటారు)
కుమారస్వామిచే కుమారారామంలో .... నేటి సామర్లకోట
వ్యాస భగవానునిచే ద్రాక్షారామంలో ..... నేటి ద్రాక్షారామం

పంచారామాల చరిత్ర తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఒక్కో క్షేత్రం గురించీ వివరంగా తెలుసుకుందాం.

Thursday, December 11, 2008

శ్రీ హరి హరసుత అయ్యప్ప క్షేత్రం, వైరా, ఖమ్మం జిల్లా

ఆలయ ప్రాంగణంలో గంగాధరుడు, అంజనీ పుత్రుడు (రెండు విగ్రహాలకీ ఎత్తులో చాలా తేడా వుంది)
ఒకే పానువట్టంమీద ద్వాదశ జ్యోతిర్లింగాలు

బయటనుంచి ఆలయ దృశ్యం


పాలేరు ప్రాజెక్టు



శ్రీ హరిహర సుత అయ్యప్ప క్షేత్రం, వైరా, ఖమ్మం జిల్లా

ఖమ్మం నుంచి 23 కి.మీ. ల దూరంలో వున్నది వైరా గ్రామం. 14 ఏళ్ళ క్రితం శ్రీ యండ్రపూడి కృష్ణారావు స్వామి గారి సంకల్పంతో కట్టబడి ఆయనతో సహా 18 మంది కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో దిన దిన ప్రవర్ధమానమవుతున్న క్షేత్రమిది. దూరంనుంచే రా రమ్మని పిలుస్తున్నట్లున్న 54 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం, చుట్టూ అందమైన ఆలయ సముదాయం చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి.

అయ్యప్ప దేవాలయం

1995 లో ఈ దేవాలయంలో శబరిమల ఆలయానికి చెందిన శ్రీ కేశవన్ నంబూద్రి, శ్రీ వాసుదేవన్ నంబూద్రి గార్ల ఆధ్వర్యంలో 9 రోజుల పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయంలో 18 సార్లు ప్రదక్షిణ చేసి విద్య, వ్యాపారం, వివాహం వగైరా విషయాలలో ఏమైనా కోరుకుని, కోరిక తీరిన తర్వాత 108 సార్లు ప్రదక్షణలు చేస్తారు భక్తులు. కొందరు కోరిన కోర్కెలు తీరితే రూపాయ నాణేలు, బెల్లం, ధాన్యాలు వగైరా తులాభారం తో తమ మొక్కు చెల్లించుకుంటారు.

ఇక్కడ అయ్యప్ప దీక్షా సమయంలో బుధ, శని వారాల్లో దీక్ష తీసుకున్న స్వాములకు రోజూ వెయ్యి మందికి దాకా అన్నదానం జరుగుతుందట.


అభయాంజనేయ స్వామి

దూరంనుంచే భక్తులకు కనువిందు చేసే ఈ అభయాంజనేయ స్వామి విగ్రహ పీఠం ఎత్తు నేల మీదనుంచి 9 అడుగులు, స్వామి విగ్రహం ఎత్తు పీఠం మీద నుంచి 45 అడుగులు, అంటే మొత్తం 54 అడుగుల ఎత్తు విగ్రహం. ఆ విగ్రహం చుట్టూ గుడి. పీఠానికి ముందు చిన్న మందిరంలో స్వామి చిన్న విగ్రహానికి పూజలు చేస్తారు. 2-12-1999 న శ్రీ చిన్న జియ్యర్ స్వామి ఆధ్వర్యంలో 5 రోజులు సుదర్శన యాగం చేసిన తర్వాత శ్రీ అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఇంత ఎత్తు విగ్రహం తెలంగాణాలో ఇంక ఎక్కడా లేదని శ్రీ కృష్ణారావుగారన్నారు.

ఇప్పటిదాకా ఈ 54 అడుగుల ఎత్తైన స్వామికి అభిషేకం కేవలం వాన వచ్చినప్పడే. ఇప్పడు ఈ స్వామికి పైన గొడుగు కట్టి దానిలోంచి షవర్ ద్వారా అభిషేకానికి ఏర్పాట్లు చేస్తున్నారుట. డిశంబరు మొదటి వారంలో దీనికి ప్రారంభోత్సవం జరుగుతుందిట. అప్పుడు కోటి పూలతో స్వామికి పూజ చేస్తారుట.

రామ మందిరం.

2002 లో ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన విగ్రహానికి ఎదురుగా సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇక్కడా నిత్యపూజలు జరుగుతుంటాయి.

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము

ఇక్కడ గర్భాలయంలో ఒకే పీఠం మీద 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. ఈ తరహా ఆలయం తెలంగాణాలో ఇక్కడే కనిపిస్తుంది. దేవాలయ ఆవరణలో, శివుడు, విఘ్నేశ్వరుడు, అంభిమాత, నవగ్రహాలు, లక్ష్మీనారాయణులకి చిన్న ఆలయాలు వున్నాయి. ఇది శివ పంచాయతనం. అంటే, శివుడు, విష్ణువు, వినాయకుడు, అమ్మవారు, సూర్యుడు వుంటారు. ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అన్నదానం జరుగుతుంది.

వెంకటేశ్వరస్వామి దేవాలయం
శ్రీ చిన్నజియ్యర్ స్వామి ఆధ్వర్యంలో 7 రోజులపాటు విష్ణు సహస్రయాగం చేసిన తర్వాత 28-2-2008 న విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఇక్కడ ప్రతి శనివారం స్వామికి కళ్యాణం, అన్నదానం జరుగుతుంది.

ఇంక ముందు సాయిబాబా దేవాలయం, కళ్యాణ మంటపం కూడా కట్టే ఆలోచన వున్నదట.


ఇంతమటుకూ ఇక్కడ చండీయాగం, సుదర్శన యాగం, రుద్రయాగం, విష్ణు సహస్రయాగం, లక్ష్మీ నారాయణ యాగం అనే అయిదు యాగాలు జరిగాయట.

ఆలయ ప్రాంగణంలో చిన్న ఉద్యానవనం, అందమైన అనేక దేవతా విగ్రహాలు ఆలయాల అందాన్ని మరింత పెంచుతూ అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఆ ప్రాంతాలకెళ్ళిన ప్రతి ఒక్కరూ, దూరమైనా అవకాశాన్నిబట్టి వెళ్ళాలనుకునేవాళ్ళూ తప్పక చూడవలసిన ఆలయ సమూహమిది.

ఈ ఆలయాల్లోకూడా కొన్ని రోజులలో మాత్రమే భోజన సదుపాయం వుంటుంది కనుక మీ జాగ్రత్తలో మీరు వెళ్ళండి. అలాగే వసతి కూడా ఖమ్మంలోనే.

అదనపు ఆకర్షణలు

ఖమ్మం రోడ్డులో షుమారు 30 కి.మీ. వెళ్ళాక పాలేరు ప్రాజెక్టు వస్తుంది. విశాలమైన ఈ జలాశయం ప్రక్కనే వున్న చిన్న పార్కు దగ్గర కొంచెంసేపు సేద తీరవచ్చు.

వైరా దాటిన తర్వాత జంక్షన్ లో ఎడమ వైపు తిరిగి లోపలికి 3, 4 కి.మీ. లు వెళ్తే వైరా రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టు వస్తుంది. ఈ ప్రాజెక్టు దాకా వెళ్ళేటప్పుడు వాహనం లో బండ్ పైనించి వెళ్ళచ్చట తిరిగి వచ్చేటప్పుడు ప్రక్కనే వున్న రోడ్డు మీదనుంచి రావాలిట. బండ్ మీదనుంచి వెళ్తే సరదాగా వుంటుంది. మాకు తెలియక రెండుసార్లూ ప్రక్క రోడ్డు మీదనుంచే వెళ్ళాము.