Wednesday, May 11, 2011

భద్రకాళి ఆలయం, వరంగల్

భద్రకాళి ఆలయం వెలుపల గుట్టమీద శివ పార్వతులు
ఉత్సవ సమయంలో ఆలయంలో పాట కచ్చేరీ
<!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE X-NONE


వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది. ఆ అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు. కానీ అతి పురాతనమైన ఈ దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట. మనకు తెలిసిన చరిత్ర ప్రకారం చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ ఈ దేవిని పూజించి వెళ్ళాడుట. విజయం సాధించిన తర్వాత క్రీ.శ. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు.

తరువాత కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు. తరువాత కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఈ ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించి, ఆలయానికి కొంత భూమిని కూడా ఇచ్చాడు. కాలగమనంలో కాకతీయ సామ్రాజ్య పతనంతో, ఈ దేవస్ధానం వైభవం కూడా క్షీణించింది. సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన ఈ దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది. ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి.

భారతదేశ స్వాతంత్ర్యానంతరం శ్రీ మగన్ లాల్ సమేజగారి స్వప్నంలో భద్రకాళి
అమ్మవారు దర్శనమిచ్చి ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు. ఆయన పెద్దలందరి సహకారంతో ఆలయం పునర్నిర్మించగా, 29-7-1950న సంప్రోక్షణ గావింపబడి నాటినుంచీ నిత్య పూజలతో దినదినాభివృధ్ధి అవుతోంది.

10 అడుగుల పైనే ఎత్తయిన అమ్మవారి విగ్రహం అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూంటుంది. పూర్వం ఈ విగ్రహం భీకరంగా వుండేదట. భక్తుల సౌకర్యార్ధం అమ్మవారిని ప్రశాంతంగా వుండేటట్లు తీర్చి దిద్దారు. ఇప్పుడు ఆ తల్లిని ఎంతసేపు చూసినా తనివి తీరదు.

ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పక్కనే వున్నా తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది. ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.

Friday, May 6, 2011

వెయ్యి స్ధంబాల గుడి, హనుమకొండ





హనుమకొండ, వరంగల్ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది వెయ్యి స్ధంబాల గుడి, భద్రకాళి ఆలయం. అందులో ఇప్పుడు వెయ్యి స్ధంబాల గుడి గురించి చెప్పుకుందాము. ఇది హనుమకొండలో వున్నది. ఈ ఆలయాన్ని ఇంతమటుకూ చూడనివాళ్ళు వెయ్యి స్ధంబాల గుడి అంటే అతి విశాలమైన ఆలయం, వెయ్యి స్ధంబాలతో వుంటుంది, ఇంచక్కా వెళ్ళి లెక్కబెట్టేద్దామని అంకెలన్నీ అర్జంటుగా గుర్తుచేసుకునే కష్టం పడకండి. పూర్వం దీనిపక్కనే వెయ్యిస్ధంబాలతో వున్న మండపం వుండేదని కొందరంటారు. కొందరేమో, అదేమీకాదు..ప్రస్తుతం వున్న ఆలయంలోనే అన్ని స్ధంబాలు వున్నాయంటారు. ఎలాగంటే కనబడే ఒక్కొక్క స్ధంబంమీదా పక్కపక్కనేనూ, ఒకదానిమీద ఇంకొకటి అనేక స్ధంబాలు వున్నట్లు చెక్కబడ్డాయి. ఫోటోలు చూడండి. ఇవ్వన్నీ కలిపితే వెయ్యి అవుతాయి, అందుకని ఆ పేరు అంటారు ఇంకొందరు. ఏది ఏమైనా, ఇంత అద్భుత సంపదల చరిత్రలు కూడా కనుమరుగయిపోతున్నాయనేది వాస్తవం.

అద్భుత శిల్ప సంపదకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని 1163 ఎ.డి. లో కాకతీయ రాజైన రుద్రదేవుడు నిర్మించాడు. అందుకనే ఆయన పేరుమీద ప్రధాన దైవమైన శివుడిని రుద్రేశ్వరుడన్నారు. నిత్య పూజలందుకుంటున్న రుద్రేశ్వరుడేకాక ఈ త్రికూటాలయంలో విష్ణు, సూర్యుడు వున్నారు.

కాకతీయులు శివ భక్తులు. వారు ఉదయించే సూర్యుని కిరణాలు ఆలయంలో లింగం మీద పడేటట్లు ఈ ఆలయం నిర్మించారు. తూర్పు అభిముఖంగావున్న రుద్రేశ్వరునిమీద ఉదయభానుని కిరణాలు పడతాయి. ఇక్కడ నందీశ్వరుడు నల్లని బసాల్ట్ రాతితో నిర్మింపబడిన ఏక శిలా విగ్రహం. ఈ విగ్రహం నిగనిగలాడుతూ శిల్పనైపుణ్యానికి అద్దం పడుతుంది. అంతేకాదు నాట్య మండపంలోవున్న స్తంబాలమీద అనేక విధములైన ఆభరణాల డిజైనులు, పువ్వులు వగైరాలు అద్భుతంగా చెక్కబడ్డవి.

అద్భుత శిల్ప సంపదకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని అవకాశమున్న ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాలి.