Wednesday, June 16, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు--8



కాశీ కబుర్లు మధ్యలోనే ఆపేశాననుకుంటున్నారా?  ఏం చేద్దాం  కొన్ని భవసాగరాలవల్ల కొంత ఆలస్యమయింది.  ఈ మారు ఆలస్యం లేకుండా పూర్తి చెయ్యాలని ప్రయత్నం.

ప్రయాగ లేక అలహాబాద్

ప్రయాగలో దర్శనీయ స్ధలాల గురించి తెలుసుకునే ముందు అసలు ప్రయాగ చరిత్రని గురించి కొంచెం చెప్తాను. 

పురాతన కాలంనుంచీ ప్రయాగ తీర్ధరాజంగా కొనియాడబడుతున్నది.  దీనికి ముఖ్య కారణం మూడు జీవ నదుల సంగమం ఇక్కడ వుండటం.  అవి గంగ, యమున, సరస్వతి.  ప్రస్తుతం సరస్వతి మనకి కనబడదు.  ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ మాసంలో మాఘ మేలా జరుగుతుంది.  ప్రతి 12 సంవత్సరాలకీ కుంభ మేలా,  144 సంవత్సరాలకి మహా కుంభ మేలా జరుగుతాయి.  భారత దేశం నలు మూలలనుంచీ అనేకమంది భక్తులు విచ్చేసి ఈ సంగమంలో స్నానం చేసి భక్తి భావనతో పునీతులవుతారు. 

ఈ మేలాలు నిర్వహించటానికి వెనుక ఒక పౌరాణిక గాధ వుంది.  దేవాసురులు సాగర మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించిందని అందరికీ తెలుసు.  ఆ అమృతాన్ని అసురులబారినుండి రక్షించటానికి ఇంద్రుడు స్త్రీ అవతారంలో వచ్చి అమృత భాండాన్ని అసురులకందకుండా కాపాడబోయాడుట.  ఆ సమయంలో ఇంద్రుడికీ, సురాసురులకీ మధ్య జరిగిన ఘర్షణలో అమృతభాండంలోంచి అమృతం తొణికి కొన్ని చుక్కల అమృతం నాసిక్, ఉజ్జయిని, ఋషీకేశ్ లో పడ్డాయిట.  ఇంక ప్రయాగ లోని ఈ త్రివేణీ సంగమంలో ఆ అమృత భాండమే పడిందిట.  అందుకనే ఈ సంగమ ప్రాంతం అంత ప్రాధాన్యతను సంతరించుకుంది.  అప్పటినుంచీ ఈ మేలాలు జరుపబడుతున్నాయిట.

అదేమిటి అమృతం ఆవిర్భవించినప్పుడు మహా విష్ణువు మోహినీ రూపంలో వచ్చి దేవతలకి మాత్రమే అమృతం ఇచ్చాడంటారుకదా, మరి ఇంద్రుడు స్త్రీ రూపంలో రావటమేమిటంటారా  మనవాళ్ళు చెప్పే కధ మనం విన్నాము.  మరి అక్కడి కధ ఇది.  నమ్మండి, నమ్మకపొండి మీ ఇష్టం.

మరి అప్పుడెప్పుడో, మనమెవ్వరం పుట్టకముందు బ్రహ్మదేవుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడుట.  అప్పుడే ఆ స్ధలం పేరు ప్రయాగ అయిందిట.

రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు, దశరధ మహారాజు మంత్రి సుమంతుడు శ్రీ రామచంద్రుని, సీతా దేవిని, లక్ష్మణుడిని ఈ ప్రాంతందాకా సాగనంపాడుట.  వారు గంగదాటి  ప్రయాగలోని  భరద్వాజ ఆశ్రమాన్ని దర్శించారని ప్రతీతి.  తరువాత వారు భరద్వాజ ఆశ్రమంనుంచీ అక్కడికి 131 కి.మీ. ల దూరంలో వున్న చిత్రకూట్ కి వెళ్ళారు.

సముద్రగుప్తుడు ప్రయాగలో 12 సంవత్సరాలు నిరంతరాయంగా యజ్ఞాలు నిర్వహించాడుట.  ఈ యజ్ఞాలవల్ల ఋషులు, సాధువులు, భక్తులు ఇక్కడే తమ నివాసస్ధానాన్ని శాశ్వతంగా ఏర్పరుచుకోవటంతో ప్రయాగ దిన దినాభివృధ్ధి చెందసాగింది.

644 బి.సి.లో చైనా యాత్రికుడు హుయాన్ స్వాంగ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం గురించి తన పుస్తకంలో వ్రాశాడు.  ఇక్కడి గంగా యమునా నదుల గురించీ, అనేక ఆలయాల గురించీ, అశోక స్ధంబం గురించీ వ్రాశాడు.

ఇంకొక ఆసక్తికరమైన విషయం.  1575 సంవత్సరంలో అక్బర్ నదీ మార్గాన ప్రయాగ చేరాడు.  ప్రయాగ వైభవానికి ముగ్ధుడైన అక్బరు దాని పేరు తను కొత్తగా స్ధాపించిన మతం దీన్-ఇల్-ఇలాహీ కలసి వచ్చేటట్లు అలహాబాద్ అని మార్చాడు.  అప్పటినుంచీ ప్రయాగ అలహాబాదుగా కూడా పిలవబడుతోంది.

భారత దేశ స్వాతంత్ర్య  సమరంలోకూడా అలహాబాద్ కి ప్రముఖ పాత్ర వున్నది.  1857 లో మొదలైన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అలహాబాద్ నుంచి శ్రీ లియాకత్ ఆలీ నాయకత్వం వహించారు.  1857 తరువాత కాంగ్రెసు పార్టీ సమావేశాలు అనేకం ఇక్కడ జరిగాయి.  స్వతంత్ర భారత దేశం యొక్క మొట్టమొదటి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ తమ బాల్యాన్ని ఇక్కడి ఆనంద భవన్ లో గడిపారు.  తర్వాత ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, అలహాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ కి చెందినవారే.  అంతేకాదు, తర్వాత ప్రధాన మంత్రులైన శ్రీమతి ఇందిరా గాంధీ,  శ్రీ రాజీవ్ గాంధీ, శ్రీ వి.పీ. సింగ్ ఇక్కడ పుట్టినవారే.

సాహిత్యపరంగాకూడా వన్నెకెక్కింది ఈ అలహాబాద్.  సుప్రసిధ్ధ హిందీ కవులు, రచయితలు ఇక్కడ పుట్టినవారు, తమ జీవితాలను ఇక్కడ గడిపినవారు ఎందరో.  వారిలో కొందరు ఫిరాక్ గోరక్పూరీ, హరివంశరాయ్ బచ్చన్, మహాదేవీ వర్మా, డా. రామ్ కుమార్ వర్మ, సచ్చిదానంద హీరానంద్ వాత్సాయన్, భగవతీ చరన్ వర్మ, సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా.

ఇన్ని విధాల ప్రసిధ్ధికెక్కిన ప్రయాగని దర్శించటానికి అనుకూల సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు. 

ప్రయాగ గురించి నేను తెలుసుకున్న కధలు మీకు చెప్పాను.  ప్రయాగలో దర్శనీయ స్ధలాల గురించి వచ్చే పోస్టుల్లో.



0 comments: