Monday, September 17, 2012

భక్తులపాలిట భద్రకాళి




భక్తులపాలిట భద్రకాళి
                                                                                  
సాధారణంగా మనవాళ్ళు గయ్యాళి స్త్రీలను భద్రకాళి అంటారు.  కానీ అది సరికాదు.  భద్రకాళి అంటే భక్తుల భద్రత చూసే కాళి.  అంటే భక్తులను బ్రోచే తల్లి.  మరి భద్రకాళి అనగానే వరంగల్ గుర్తొస్తోందా  అవునండీ హనుమకొండ, వరంగల్ మధ్య వెలసిన భద్రకాళి గురించే చెప్తున్నా.
భద్రకాళి అనగానే వరంగల్, వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది.  అసలు ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో,   అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు.  అతి పురాతనమైన దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట.  పూర్వం రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి వెళ్తూండేవాళ్ళుట.  అలాగే  చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ దేవిని పూజించి వెళ్ళాడుట.  విజయం సాధించిన తర్వాత క్రీ.. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు. 

తరువాత కాలంలో కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు.  తదనంతరం  కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించాడు.  అంతేకాదు,  ఆలయ నిర్వహణకిగాను  కొంత భూమిని కూడా ఇచ్చాడు.  కాలగమనంలో ఢిల్లీ బాదుషా అల్లావుద్దీన్ ఖిల్జి చేతిలో కాకతీయులు ఓడింపబడటంతో, సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది.  ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి తర్వాత బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల సమయంలో  దేవస్ధానం వైభవం ఇంకా క్షీణించింది..

 క్రీ.. 1940లో శ్రీ గణపతి శాస్త్రి అనే దేవీ ఉపాసకులు కర్ణాటక నుంచి జీవనోపాధి వెతుక్కుంటూ ప్రాంతానికి వచ్చారు.  ఆలయం చూసి, దానిని పునరుధ్ధరించాలనే కోరికతో ఆలయం పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని వున్నారు.  ఆయన శ్రీ ముదుంబాయి రామానుజాచార్యులతో కలిసి స్ధానిక వర్తకులైన శ్రీ మగన్ లాల్ సమేజాగారిని కలిశారు.  శ్రీ సమేజాగారికి కలలో అమ్మవారు కనబడి ఆలయాన్ని పునరుధ్ధరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారికి సహాయం చెయ్యమని ఆదేశించినదట.  ఆదేశం ప్రకారం శ్రీ సమేజాగారు, ఇంకా ఇతర పెద్దలు కలిసి  ఆలయ పునర్నిర్మాణం తలపెట్టి 1950 లో పూర్తిచేశారు.

113 సంవత్సరాలు జీవించి తన జీవితంలో చాలా భాగం ఆలయానికి పూర్వ వైభవం తేవటానికి కృషిచేసిన శ్రీ గణపతి శాస్త్రిగారు నవంబరు 11 తారీకు 2011లో స్వర్గస్ధులైనారు.  2011 శ్రావణమాసంలో వారిని, వారి శ్రీమతిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకునే అదృష్టం నాకు కలిగింది.

1950 సంవత్సరం ముందు ఇక్కడ జంతు బలులు జరిగేవి.  కానీ ఆలయ పునర్నిర్మాణం తర్వాత వాటిని నిషేధించారు.  అంతేకాదు.  అంతకుముందు అమ్మవారుకూడా భయంకరమైన కళ్ళతో, వేళ్ళాడే నాలుకతో చాలా భీకరంగా వుండేదిట.  భక్తులు అమ్మ రూపాన్ని తట్టుకోలేరని ఆలయ పునరుధ్ధరణ సమయంలో అమ్మవారి నాలుకమీద అమృత బీజాక్షరాలు రాసి, నాలుకను సరిచేశారుట.  చండీ యంత్రం స్ధాపించి అమ్మవారి భయంకరమైన మహాకాళి రూపాన్ని మార్చి మహా త్రిపుర సుందరిగా చేశారుట.  త్రిపుర సుందరి అంటే మూడు పురములలోనా (మూడు లోకములలోనా) అత్యంత సౌందర్యవతి అని.  అప్పటినుంచీ అమ్మ భక్తులను బ్రోచే భద్రకాళి అయింది.

అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పుతో కూర్చుని వున్నట్లు వుంటుది.  అమ్మ అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూ వుంటుంది.  ప్రసన్నవదనంతో అలరారే అమ్మని ఎంత సేపుచూసినా తనివితీరదు.  అమ్మవారి ముందు శ్రీ చక్రం, ఉత్సవ విగ్రహాలుంటాయి.

ఆలయంలో వున్న ఉపాలయాలు ప్రదక్షిణ మార్గంలోశ్రీ వల్లభ గణపతి, ఆంజనేయస్వామి, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు.  ఆలయం ముందు విశాలమైన మండపంలో అమ్మవారి చిన్న విగ్రహంపెట్టి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యమిస్తున్నారు వచ్చిన మహిళలంతా.  శ్రావణ మాసంలో ఒడిబియ్యం ఇచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ.  తెలంగాణా ప్రాంతంలో ఇంటి ఆడబడుచులకు ఒడి బియ్యం పెట్టే ఆచారం వుంది.  అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావించి ఆవిడకి ఒడిబియ్యంపెట్టి తరిస్తారు ఇక్కడి మహిళలు.
 చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో శాకంబరి ఉత్సవం, ఆశ్వీయుజమాసంలో శరన్నవరాత్రులు, ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు.
విశాలమైన ఆలయం  ఇంకా విశాలమైన ప్రాంగణంతో, సుందరమైన పరిసరాలతో  చాలా ఆకర్షణీయంగా వుంటుంది.  ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.  పక్కనే వున్న తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది.  సాయం సమయంలో ఇక్కడి చెరువుమీదనుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ, సూర్యాస్తమయం తిలకించటం ఒక అద్భుతమైన అనుభవం.   ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.


 

(ఆశ అభినవ మాస పత్రిక మే 2012 సంచికలో ప్రచురించబడింది.)


4 comments:

Unknown said...

చాలా బాగా రాసారు లక్ష్మి గారూ.. నేనూ చూసాను ఈ గుడిని.

durgeswara said...

jai maathe

psm.lakshmi said...

ధన్యవాదాలు ప్రసీదగారూ.
నమస్కారాలు దుర్గేశ్వరగారూ
psmlakshmi

Surya Savarnika said...

very good job lakshmi gaaru also visit our blog " మనవు"