Sunday, December 14, 2008

పంచారామాల చరిత్ర

పంచారామాలు

పూర్వం తారకుడు అనే రాక్షసుడు మహా విష్ణువు మూలంగా తమ జాతివారంతా నశించిపోతున్నారని, విష్ణువుని చంపి తమ జాతిని రక్షించాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శివుడిని తనకు చావులేకుండా వరమివ్వమని కోరాడు. శంకరుడు సరేనని దేవ దానవులు అమృత మధనం చేసినప్పుడు లభించిన అమృత లింగాన్ని తారకుడికిచ్చి, ఈ అమృత లింగం యధాతధంగా వున్నంతమటుకు నీ ప్రాణానికి ఏ భయమూ లేదు అని వరమిచ్చాడు. తారకుడు ఆలింగాన్ని గొలుసుతో తన మెడలో ధరించాడు.

శివుడి నుంచి తనకు చావులేకుండా వరమేకాకుండా అమృత లింగాన్ని కూడా పొందిన గర్వంతో తారకుడు తన ధ్యేయం నెరవేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంద్రలోకంమీద దండెత్తి ఇంద్రుణ్ణి ఓడించాడు. దేవతలంతా మహా విష్ణు దగ్గరకి వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారుట. విష్ణువు తారకుడు శివ వరము పొందినవాడు, నేనేమీ చేయలేను, ఆ శంకరుణ్ణే ఉపాయమడుగుదామనగా అందరూ మహా శివుడి దగ్గరకెళ్ళి తారకుని దుష్కృత్యాల గురించి విన్నవించుకున్నారు. శివుడు ప్రసన్నుడయ్యాడు. తారకుడికి తానే వరమిచ్చినా, లోకోధ్ధరణకోసం దుష్ట సంహరణ, శిష్ట సంరక్షణ చేయాలిగనుక దేవతలకు ఒక ఉపాయం చెప్పాడు. తన కుమారుడైన కుమారస్వామి ఈ కార్యానికి తగినవాడని, అతనిని దేవ సైన్యానికి సర్వ సేనానిని చేసి వానిని వెంటపెట్టుకుని తారకుని పై యుధ్ధానికి వెళ్ళండి మీకు జయం కలుగుతుందని.

శివుని ఆదేశాన్ని దేనతలు పాటించారు. కుమారస్వామి శరపరంపరల ధాటికి రాక్షస సైన్యం చెల్లాచెదరయ్యింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దాన్తో ఉద్రిక్తుడయిన తారకుడు స్వయంగా కుమార స్వామితో యుధ్ధానికి దిగాడు. ఆ యుధ్ధములో తారకునిదే పై చెయ్యి అయింది. దానితో కుమారస్వామి ధాన్య కటకము చేరుకుని అక్కడ కొంతకాలం వున్నాడు. ఈ విషయాన్ని దేవతలు శివునికి తెలియజేశారు. ఇంకొకసారి కుమార స్వామి తారకుని మీదకు దండెత్తి మహా బలోపేతమైన శక్తిని వాని మీద ప్రయోగించాడు. అది కూడా వానినేమీ చేయలేక పోవటంతో బాధతో తిరిగి ధాన్యకటకం చేరాడు. ఈ వార్త తెలిసిన శివుడికి తానిచ్చిన ఆత్మలింగం సంగతి గుర్తువచ్చి ఆ విషయం కుమారస్వామికి తెలిపి ఆత్మలింగాన్ని గురిచూసి ఛేదించమనండి తప్పక విజయం లభిస్తుందని తెలిపాడు.

తర్వాత జరిగిన యుధ్ధంలో కుమారస్వామి తారకుని మెడలోనున్న ఆత్మ లింగాన్ని ఛేదించగా అది ఐదు ముక్కలయి ఐదు ప్రాంతాల్లో పడ్డది. వెంటనే తారకుడు ప్రాణాలొదిలాడు. అందులో పెద్దముక్క అమరారామంలో పడ్డది. ఆత్మ లింగం అమృత లింగం కనుక అవి పెరుగ సాగాయి. పరమేశ్వరుని ఆదేశం ప్రకారం దేవ గురువు బృహస్పతి సలహా మీద వాటినన్నిటినీ ఆశ్వయుజ శుధ్ధ దశమి రోజున ఒకే ముహూర్తములో ప్రతిష్ఠ చేసి వాటి పెరుగుదలని అరికట్టారు. అవే పంచారామాలు. ఈ ఆరామాలు ప్రతిష్ట చేసిన వారి పేరుతో ప్రసిధ్ధికెక్కాయి. ఈ ప్రతిష్టలు ఎవరు ఏ ప్రదేశంలో చేశారో తెలుసుకుందామా?

దేవేంద్రుడు అమరారామంలో .... అదే నేటి అమరావతి
సోముడు (చంద్రుడు) సోమారామంలో ..... నేటి గునుపూడి (భీమవరం దగ్గర)
శ్రీరామచంద్రుడు క్షీరారామంలో ... నేటి పాలకొల్లు (ఇది త్రేతాయుగంలో జరిగింది అంటారు)
కుమారస్వామిచే కుమారారామంలో .... నేటి సామర్లకోట
వ్యాస భగవానునిచే ద్రాక్షారామంలో ..... నేటి ద్రాక్షారామం

పంచారామాల చరిత్ర తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఒక్కో క్షేత్రం గురించీ వివరంగా తెలుసుకుందాం.

2 comments:

mamatha said...

lakshmi garu,

baga raasaru "పంచారామాల చరిత్ర" , alane daasavatharala gurinchi rayandi, epudo katti mahesh blog lo buddhavatharam gurinchi vere chadiva, antha confuse ga vundi, andukani mimmalni aduguthunna

psmlakshmi said...

మమతగారూ మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞురాలుని. మీ సూచనను తప్పక పాటించటానికి ప్రయత్నిస్తాను వేరి బ్లాగులో. ఈ బ్లాగు ట్రావెలాగ్. చూసిన ప్రదేశాల గురించి మాత్రమే చెప్తున్నాను ఇందులో.
psmlakshmi