Wednesday, December 31, 2008

సోమారామం

ఎడమ వైపు క్రింద సోమేశ్వరాలయం, పైన అన్నపూర్ణాదేవి ఆలయం, కుడి ప్రక్క జనార్దనస్వామి ఆలయం
గర్భగుడి విమానం, గుడి గోపురం

సోమారామం
(గునుపూడి, పశ్చిమ గోదావరి జిల్లా)

సదాశివుని ఆదేశముచే కుమారస్వామిచే గురిచూసి కొట్టబడ్డ తారకేశ్వరుని కంఠంలోని అమృతలింగం ఐదు ముక్కలై ఐదు చోట్ల పడ్డదని చెప్పకున్నాముగదా.. అందులో ఒక ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలో గునుపూడి అనే ప్రాంతంలో పడ్డది. శివుని ఆదేశానుసారం, దేవగురువు బృహస్పతి సలహాపై దేవతలలో ఒకరైన చంద్రుడు దేవగణములతో వచ్చి ఆశ్వీయజ శుధ్ధ దశమి రోజున శివ లింగప్రతిష్ఠ జరిపారు. ఈ శకలాలు పడ్డచోట ఓం అనే శబ్దంతో పడ్డాయి. క్షీరారామంలో తప్ప మిగతా ప్రదేశాలలో ఒకే సమయములో వివిధ దేవతలచేత ఈ లింగాలు ప్రతిష్ఠంచబడ్డాయి.

కవి సార్వ భౌముడు శ్రీనాధుడు తన భీమేశ్వర పురాణంలో ఈ సోమారామం గురించి వర్ణించారు. అగస్త్య మహర్షి తన కాశీ వియోగ దుఖాన్ని పోగొట్టుకోవటానికి ఈ ప్రాంతానికి వచ్చినట్లుగా కాశీ ఖండం అనే గ్రంధం లో వ్రాయబడివుంది.

మూల విరాట్ సోమేశ్వరలింగం పీఠం నుండి 2 అడుగుల ఎత్తులో వున్నది. ఇంకొక విశేషం. ఇక్కడ శివలింగం అమావాస్యకు గోధుమ, నలుపు రంగుల్లోను, పౌర్ణమికి తెల్లని రంగులోనూ ప్రకాశిస్తుంది. ఈ లింగం చంద్రుడి చేత ప్రతిష్ఠంపబడింది కనుక చంద్రుని వృధ్ధి క్షయలు లింగంలో ప్రతిబింబిస్తాయంటారు. ఈ లింగానికి వున్న నాగాభరణం చాలా ఆకర్షణీయంగా వుంటుంది.

ఈ ఆలయంలో దేవేరి అన్నపూర్ణ మొదటి అంతస్తులో కొలువై వున్నది. ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశగా వున్న కోనేరుని సోమగుండం లేక చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. ఆలయంలో జనార్దన స్వామి, కుమారస్వామి, ఆంజనేయస్వామి విగ్రహాలు నిత్యపూజలందుకుంటున్నాయి. అందుకే ఇది హరిహర క్షేత్రంగా పేరు పొందింది.

ఈ ఆలయం పాలకొల్లుకు 28 కి.మీ.,కైకలూరుకు 38 కి.మీ. గుడివాడకు 66 కి.మీ. దూరంలో వున్నది. ఈ ప్రదేశాల నుంచేకాక హైదరాబాదునుంచి కూడా బస్సు రైలు సౌకర్యాలున్నాయు.
























































































































0 comments: