Thursday, July 9, 2009

శ్రీ ముక్తేశ్వరాలయం, ముక్త్యాల

బల్లకట్టు మీద లారీలు
ముక్త్యాల రాజాగారి బంగళా

శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల

ముక్త్యాలలో శ్రీ కోటిలింగశివ క్షేత్రానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది అతి పురాతనమైన శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివలింగం బలి చక్రవర్తిచే ప్రతిష్టింపబడ్డది. పక్కన అమ్మవారి గుళ్ళో శ్రీచక్రంకూడా ప్రతిష్టింపబడివుంది. శివ కేశవులకు బేధం లేదన్నట్లు చెన్న కేశవ స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలోనే వుంది. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని. ఈ క్షేత్రం ఉత్తర కాశీగా పరమ పావన పుణ్య తీర్ధంగా ప్రసిధ్ధికెక్కింది. పలు పురాణాలలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన వున్నది.

ఈ స్వామిని త్రేతాయుగంలో రామ లక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శింటారుట. ఎఱ్ఱన, శ్రీనాధుడు మొదలగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వారు రాసిన గ్రంధాలలో వున్నది.

త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటుచేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానంచేసేవారని మార్కండేయ పురాణంలో వున్నది. నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవిట. కృష్ణ ఒడ్డున జంట నందుల విగ్రహాలు వున్నాయి. ఇప్పటికీ నది లోతులో బంగారు శివాలయం వుందని భక్తుల నమ్మకం. ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో వున్న కొండగుహలో తపస్సు చేసేవారుట. అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదిట.

గుడి తెరచి వుంచు వేళలు ఉదయం 6 గం. ల నుండి మధ్యాహ్నం 12 గం. ల దాకా తిరిగి సాయంత్రం 5 గం. ల నుంచి 8 గం. ల దాకా. మీరు వెళ్ళిన సమయంలో గుడి మూసి వుంటే గుడి మొదట్లో వున్న షాపులో అడగండి. పూజారిగారి ఫోను నెంబరు దొరకవచ్చు. ఆయన ఇల్లు సమీపంలోనే. వస్తారు.

ఇక్కడి జమీందారులు ముక్త్యాల రాజావారు లబ్ధప్రతిష్టులు...కీర్తిశేషులు. వారి గురించి మేము ఎక్కువ వివరాలు తెలుసుకోలేకపోయాముకానీ కృష్ణ ఒడ్డునుంచీ వాళ్ల బంగళా ఫోటో తియ్యగలిగాము.

సరదా వున్న పట్న వాసులు చూడదగ్గ ఇంకో విశేషం బల్లకట్టు. గుడి దగ్గరనుంచి కొంచెం దూరం వుంటుంది. ఈ బల్లకట్టు మీద మనుషులతోపాటు ఒకేసారి మూడు లారీలను ఎక్కించి అవతలి ఒడ్డుకి చేరుస్తారు. కావాలంటే మీరు కూడా మీ వాహనంతో సహా ఆ బల్లకట్టుమీద అవతలి ఒడ్డుకెళ్ళచ్చు.



0 comments: