Wednesday, July 15, 2009

ముక్త్యాలలో మరచిపోలేని అనుభూతులు

కొన్ని ప్రదేశాలలో మనం వున్నది చాలా తక్కువ సమయం అయినా మరచిపోలేని అనుభూతులు మూటకట్టుకుని వస్తాము. అలాంటి అనుభూతులు, ముక్త్యాల తలుచుకోగానే గర్తుకొచ్చేవి మీతో పంచుకోవాలనిపించింది.

2008 కార్తీకమాసంలో కూర్చున్నదానికి కూర్చున్నట్లే ఒక ఆలోచన వచ్చింది. ఈ మారు కార్తీక మాసంలో గుళ్ళో దీపాలు పెట్టాల్సిందే. ఆ పెట్టేదేదో 108 లింగాల దగ్గర పెడితే బాగుంటుందికదా. అంతే నా ఆలోచన వెంటనే మావారికి చెప్పటం..ఇద్దరం కలిసి ఎక్కడెక్కడ గుళ్ళున్నాయో ఆలోచించటం మొదలు పెట్టాము. మర్నాడు ప్రొద్దున్నఆయన ఆఫీసుకెళ్ళేలోపల కాలనీ దగ్గర వున్న 3 గుళ్లకెళ్ళి దీపాలు పెట్టి వచ్చాను. ఎంత లిస్టు వేసినా అంతంత దూరాలు వెళ్ళి 108 శివ లింగాల దగ్గర దీపాలు పెట్టాలంటే ఎంతకాలం పడుతుందో అనే ఆలోచన. ఇంతలో ఆఫీసునుంచి వెంకట్ (మా వారు) ఫోన్ చేశారు. ముక్త్యాల కోటిలింగ క్షేత్రంలో శివలింగాల ప్రతిష్ట జరిగిందేమో కనుక్కో..అక్కడ ప్రతిష్ట జరిగితే చాలా శివ లింగాలు వుంటాయికదా. నీకెన్ని దీపాలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అన్నారు. వెంటనే ఫోన్ చేస్తే శివ లింగ ప్రతిష్టలు జరుగుతున్నాయి, కొన్ని వేల లింగాల ప్రతిష్ట జరిగింది అన్నారు. ఆ శని, ఆదివారాలలో ముక్త్యాల ప్రయాణం అనుకున్నాము. వెంటనే ప్రమిదలు మిగతా అవసరమైన వస్తువులు సమకూర్చుకోవటం మొదలు పెట్టాము. మేమిద్దరం, మా స్నేహితురాళ్ళు ఇంకో ముగ్గురం కలిసి పొద్దున్న బయల్దేరి ముక్త్యాల చేరేసరికి మధ్యాహ్నమయింది. ఆరోజు మధ్యాహ్నం ఏమీ తోచక బల్లకట్టుమీద కారుతో సహా అవతల ఒడ్డుకు వెళ్ళాం. ఆ ఒడ్డునుంచీ అంతా గుంటూరు జిల్లా. అక్కడనుంచి కేతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అంటే వెళ్ళొద్దామనే ఉద్దేశ్యం. కొంచెం దూరం వెళ్ళేసరికి ముక్త్యాల కృష్ణ ఒడ్డున చూసిన ప్రకటన శ్రీ అష్టముఖ గండభేరుండ బడబానల జ్వాలా లక్ష్మీ నృసింహస్వామి బోర్డు కనిపించి వెళ్ళి చూసి వచ్చాము. దీనిగురించి వేరే పోస్టు రాస్తాను. అక్కడ తెలిసింది కేతగిరి అడవి మర్గాన వెళ్తే అక్కడికి దగ్గరే కానీ కొన్ని మైళ్ళు నడచి వెళ్ళాలి..రోడ్డు మార్గాన అయితే అటునుంచి దూరమని. తిరిగి వస్తూ ముక్త్యాల శ్రీ ముక్తేశ్వరాలయంలో 365 ఒత్తులతో దీపాలు పెట్టాము. తర్వాత శ్రీ కోటిలింగ క్షేత్రం చేరేసరికి బాగా చీకటి పడింది. చీకట్లోనే దీపాలు బాగుంటాయనుకున్నాము. మర్నాడు అభిషేకం, లింగ ప్రతిష్ట చెయ్యాలని అడిగితే, ఉదయం 10 గం. కి రమ్మన్నారు. ఇంక అప్పుడు నా కోరిక, 108 శివలింగాల దగ్గర దీపాలు పెట్టాను. మా స్నేహితురాళ్లుకూడా వేరే కొన్ని పెట్టారు. ఆ దీపాలు పెట్టటానికి, నాకు మాముగ్గురు స్నేహితురాళ్ళు సహాయం చేస్తే 3 గంటలు పట్టింది. అన్ని శివలింగాలముందు ఆ దీపాలు చాలా అద్భుతంగా కనిపించాయి. దీని గురించి అంతరంగ తరంగాలలో అప్పుడు రాసిన పోస్ట్ కార్తీక దీపాలు చూడండి.

మర్నాడు ఉదయం ముందుగా వేదాద్రి వెళ్ళి కృష్ణ స్నానంచేసి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానంతరం, ముక్తేశ్వరాలయానికి బయల్దేరాము. ఆ రోజు నాగుల చవితి. మా స్నేహితురాళ్ళు నాగులచవితి కోసం ఇంటినుంచి ప్రసాదాలు తయారుచేసి తెచ్చారు. వెళ్ళేది గుళ్ళకి కదా ఎక్కడోక్కడ వినియోగించవచ్చని. కిందటిరోజు ముక్తేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో ముందు పెద్ద పుట్ట చూశాము.

అనుకోకుండా కృష్ణస్నానం చేశాం, పుట్ట వున్న గుడికి వెళ్తున్నాము..ఎక్కడన్నా పాలు దొరికితే పుట్టలో పాలు కూడా పొయ్యచ్చని అనుకున్నామోలేదో ఎదురుకుండా సైకిల్ మీద పాల క్యానులు తీసుకెళ్తున్న వ్యక్తి. వెంటనే ఆ అబ్బాయిని ఆపి అడిగాము ఆవు పాలున్నాయా అంటే వున్నాయన్నాడు. మరి ఎలా తీసుకెళ్ళాలి బ్రిలియంట్ ఐడియా. ఒక నీళ్ళ బాటిల్ తీసి నీళ్ళు ఒంపేసి పాలు పోయించాం. ఇంక చూసుకోండి మా సంబంరం. నాగుల చవితి రోజు శ్రీ ముక్తేశ్వరాలయంలో ప్రాచీనమైన పుట్టకి పూజ చెయ్యటం. పాలు పోస్తుంటే మళ్ళీ సైంటిఫిక్ ఆలోచనలు..పాములని బాధ పెడతామేమోనని..పైగా ముందునుంచీ నాగుల చవితి పూజ ఇంట్లోనే చెయ్యటం అలవాటు. అందుకే ఒక్కచుక్కే పాలు పోసి పూజ చేశాము.

తర్వాత శ్రీ కోటిలింగక్షేత్రంలో శివునికి అభిషేకం, శివలింగ ప్రతిష్ట చేసి భోజనాలయ్యాక హైదరాబాదు తిరుగు ప్రయాణం లో బోనస్ గా సూర్యాపేట దగ్గర పిల్లలమఱ్ఱి ప్రాచీన శివాలయాల్లో దైవ దర్శనం, దీపారాధన కార్తీక మాసంలో రెండు రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు ఎలా మరచి పోతాను.

0 comments: