Saturday, September 12, 2009

నిజామాబాదు జిల్లా


నిజామాబాదు జిల్లా

మన చుట్టు ప్రక్కలే వున్న అనేక అపురూప కళాఖండాలను గురించి మనం తెలుసుకునే ఉత్సాహం చూపించటంలేదు. అందుకే అతి పురాతనమైన అద్భుత కళా ఖండాలు నామ రూపాల్లేకుండా పోతున్నాయి. కొత్తవి వస్తున్నందుకు సంతోషం. కానీ ఏ విదేశాల్లోనూ లేని, మనకే స్వంతమైన, అతి పురాతనమైన ఈ అపురూప సంపదను అతి భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నది. అసలు వీటిలో ఎన్నింటిని....కనీసం మీ చుట్టువ్రక్కల వున్న వాటిలో ఎన్నింటిని మీరు చూశారు. ఇంతకు ముందు చూడలేదా? సరే. ఇప్పుడు బయల్దేరండి. అలా నిజామాబాదు పరిసర ప్రాంతాలను చుట్టి వద్దాము.

నిజామాబాదు జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన, అపురూపమైన ఆలయాలు వున్నాయి. వాటిని చూద్దామని ఉదయం కారులో బయల్దేరాం.

శ్రీ సిధ్ధ రామేశ్వర స్వామి దేవాలయం, బికనూరు

హైదరాబాదు, కామారెడ్డి రోడ్డులో కామారెడ్డికి 12 కి. మీ. లు ఇవతలే వస్తుంది బికనూరు. ఇక్కడ వెలిసిన శ్రీ సిధ్ధ రామేశ్వరస్వామి ఆలయ విశేషమేమిటంటే అన్ని దేవాలయాల్లోలాగా శివలింగం పానువట్టం పైన కనబడదు. చిన్ని శివ లింగం పానువట్టం లోపలే వుంటుంది. స్వయంభూ లింగం. అంతేకాదు. అభిషేక జలం బయటకు వెళ్ళే మార్గంగుండా ఉదయ సూర్యుని కిరణాలు లింగం మీద పడతాయి. లింగం వెనుక ఈశ్వరుని విగ్రహం, అటూ ఇటూ సిధ్ధగిరి, రామగిరి అనే వాళ్ళ విగ్రహాలు. వీరి హయాంలోనే ఇక్కడ లింగం ఉద్భవుంచిందట. వాళ్ళే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందుకే శివుడు కూడా వీరి పేర్లతోనే సిధ్ధరామలింగేశ్వరుడయ్యాడు. అమ్మవారు భువనేశ్వరి. దినదినాభివృధ్ధి చెందుతున్న ఈ ఆలయానికి వీరి వంశీకులే పూజారులు.

ఈ ఆలయానికి ఇన్ ఛార్జ్ సీ ఈ ఓ, ఇస్సన్నపల్లి సీఈఓ శ్రీ లక్ష్మీకాతం గారు మా ఆలయ దర్ళనాభిలాష గమనించి త్రోవలోనే వున్న ఇస్సన్నపల్లి, శ్రీ కాల భైరవాలయం, దాని సమీపంలోనే వున్న బుగ్గ రామేశ్వరం చూడమని సలహా ఇవ్వటమేగాక అవసరమైన సహాయం చేశారు. వారి సలహా వల్లనే మేమీ రెండు ప్రదేశాలూ చూశాము. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

రేపటి పోస్టు ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవాలయం.



0 comments: