Tuesday, December 8, 2009

చిదంబర రహస్యం--1

                           చిదంబర రహస్యం             
                                                             

  తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో.  అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు.  దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు.  ముఖ్యంగా చోళులు.  శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం,  వెలకట్ట లేనిది.   ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.

  ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం.  అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి.  అలాంటి ఎన్నో కోవెలలో ఇప్పుడ నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన  చిదంబరం గురించి తెలుసుకుందాము.

  నటరాజస్వామి ఆనంద తాండవం చేసే ఈ ప్రదేశానికి కోయిల్, తిల్లయ్ వగైరా రకరకాల పేర్లు.  ఇదివరకు ఈ ప్రదేశంలో తిల్లయ్ వృక్షాలు ఎక్కువగా వుండేవట.  అందుకని ఆ పేరు.  ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారానుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారు.  పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి అనే ఐదు క్రియలను ఉద్దీపనం చేస్తారు.


  ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాలు  పైన 13 పెద్ద రాగి కలశాలతో  విశాలమైన వాకిళ్ళతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారుతూ  వుంటాయి. 

  ఈ దేవాలయంలో ఐదుసభలున్నాయి -  చిత్రాబంళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ.   చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వున్నాడు.   చిత్రాంబళానికి ముందు వున్నది పొన్నాంబళం.  ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకం చేస్తారు.  పెరాంబళం అంటే దేవ సభ.  ఇక్కడ ఉత్సవ విగ్రహాలు  వుంటాయి.   నృత్యసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వతాండవ నృత్యం చేశారు.  ఇక్కడ స్వామి నృత్య భంగిమ విగ్రహం ప్రతిష్టించబడింది.  రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి ఋషి తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారు. ఆణి, మార్గళి మాసాలలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని ఇతర దేవతలను ఐదు రధాలలో ఊరేగించిన తర్వాత ఇక్కడ విశ్రమింప చేస్తారు.  మర్నాడు పూజాదికాల తర్వాత మధ్యాహ్నం స్వామిని, అమ్మవారిని నాట్యరీతిలో చిత్రాంబళానికి తీసుకు వెళ్తారు.  ఈ వైభవాన్ని చూసితీరవలసినదేగానీ మాటలలో చెప్పనలవికాదంటారు చూసిన భక్తులు.

  ఇక్కడ అమ్మవారు శివ కామ సుందరీదేవి.  వెలుపలి ప్రాకారంలో ఈవిడకి ప్రత్యేక ఆలయం వున్నది.  ఇక్కడే చిత్రగుప్తుని మందిరమున్నది.  ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ బహు సుందరం.

  నటరాజ ఆలయంలో తప్పక చూడవలసిన స్వామి మూలాట్టనేశ్వరార్. ఈయన స్వయంభూ.  ఈ స్వామికి ఈ పేరు రావటానికి కారణం అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలో గల స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనం కావడమేనని చెబుతారు.  ఇక్కడ అమ్మవారు ఉమాదేవి.  8 అడుగుల ఎత్తు వున్న ముక్కురుని వినాయకర్, ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడేకాకుండా, ఇంకా అనేక దేవీ దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడదగ్గవి.

ఆలయ విశేషాలు
  నటరాజ స్వామి  ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు.  ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో. 

రవాణా సౌకర్యాలు

  ఈ ఆలయం చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు బాగున్నాయి.  చెన్నై, తిరుచిరాపల్లి మెయిన్ రైల్వే లైనులో చిదంబరం స్టేషనులో రైలు దిగితే ఒక కిలో మీటరు దూరంలో ఆలయం వుంది.  తమిళనాడు రాష్ర్టంలోని వివిధ ప్రదేశాలనుంచి బస్సు సౌకర్యం కూడా వుంది.


ఇతర సౌకర్యాలు

   వసతికి  ఆలయ సమీపంలోనే హోటళ్ళున్నాయి. అద్దె రూ. 300 నుంచీ పైన.  చాలాహోటల్స్ లో రూమ్ సర్వీసు వుండదు.  భోజనానికి ఆలయ సమీపంలోనే  కుమరన్ భవన్ (మధ్యాహ్నం 12-30 నుంచీ 3 గం. ల దాకా మాత్రమే భోజనం దొరుకుతుంది మిగతా సమయాలలో టిఫెన్లు మాత్రమే వుంటాయి),  హోటల్ శ్రీ కృష్ణా వున్నాయి (ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం వుండదు అయితే రైస్ ఐటమ్స్ లభిస్తాయి). 

  తమిళనాడులో ఏ ఆలయంలోనైనా అర్చన టికెట్ల ధర తక్కువ వుంటుంది గానీ నైవేద్యానికి తప్పనిసరిగా ఫలములుండాలి (కొబ్బరికాయైతే మంచిది.  వేరే ఊరిలో కొబ్బరి ఏంచేసుకోవాలంటారా   ప్రసాదం ఎపరికైనా ఇవ్వచ్చు.  స్వామి దగ్గర మనం తీసుకు వెళ్ళిన కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారంటే మనకీ సంతోషం కదా).  అది లేకపోతే అర్చన షోడశ నామాలకే పరిమితమవుతుంది.

  సాయంత్రం 6 గం. లకి చాలా ఆలయాలలో అభిషేకం జరుగుతుంది.  ఆ సమయంలో చందనాభిషేకం తర్వాత దైవ ప్రతిమ కళ్ళు, కనుబొమలు, నోరు దగ్గర చందనం తుడుస్తారు.  అప్పుడు దేవుళ్ళ దివ్య సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది.

చిదంబర రహస్యం గురించి రేపు చెప్తాను.  సరేనా? 




ఆలయం లోపలి ప్రాకారంలో శిల్ప సౌందర్యం


 రధం మీద శిల్ప సౌందర్యం

ఆలయ గోపురం
 


రధం

1 comments:

rajachandra said...

bagunnay andi.. mee chitanbara yatra vishesalu.. maku teliya chesinanduku dhanyavadalu