Saturday, April 17, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు—4



శ్రీ కేదార్ మందిరము

సాయంత్రం ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి చూసి వద్దామనుకున్నాం, కానీ అది చాలా దూరం, నడిచే వెళ్ళాలి అనేసరికి ఆ ప్రోగ్రామ్ మానుకుని రెండు రోడ్లు తిరిగి వద్దామని బయల్దేరాం.  త్రోవలో లస్సి త్రాగేసరికి కాశీలో రోడ్లంబడ తిరగటమేమిటి కేదార్ మందిరం దగ్గరయితే వెళ్ళొద్దామనుకుని అక్కడవారిని అడిగాము.  ఈ దోవలో వెళ్ళచ్చు, పది నిముషాలు నడక అన్నారు.  ఇక బయల్దేరాము.  దోవలో అన్నీ చూసుకుంటూ, ఎంత నడిచినా, ఇక్కడే పది నిముషాల్లో వెళ్ళొచ్చు సమాధానం మారలేదు.  దోవలో ఇంకో మూడు దేవాలయాలు, కరివెన వారి సత్రం చూశాం.  (ఆ దగ్గలవోనే ఆంధ్రా సత్రంట తర్వాత తెలిసింది.)  ఆ వివరాలు. 

నడక మొదట్లోనే శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిరం.  ఈ మందిరాన్ని 1808లో నిర్మించారు.  దాదాపు పది సంవత్సరాల క్రితం పాలరాతితో పునర్నిర్మించారు.  సన్నగా, పొడుగ్గా వున్న ఈ మందిరం అందంగా,  ప్రశాంతంగా వున్నది.  మందిరంలోకి వెళ్ళగానే మొదట్లో చిన్న గుంటలావుండి అందులో రెండు శివలింగాలుంటాయి.  ధర్శనం చేసుకుని ముందుకు వెళ్తే గర్భగుడిలో చిమలేశ్వర్ మహాదేవ్, అమ్మవార్ల విగ్రహాలు, చిన్న శివలింగం దర్శనమిస్తాయి.

అక్కడనుంచి ఇంకొంచెం ముందుకు సాగితే పాండేఘాట్లో తారాదేవి కాళీదేవి మందిర్ అనే బోర్డు చూసి లోపలకెళ్ళాం.  ఎఱ్ఱని రంగు గోడలతో 350 ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ దేవాలయం ఇది.  బెంగాల్ నెటోర్ రాణి రాణీ భవానీ దేవి కట్టించారు.  వీరివి ఇంకా చాలా ఛారిటబుల్ ట్రస్టులున్నాయి.

తర్వాత రామ్ గులాలేశ్వర్ మహదేవ్ ఆలయం  గుడి చిన్నదయినా జేగురు రంగుతో అందంగా వున్నది.  పెద్ద శివ లింగం.  మేము వెళ్ళేసరికి చీకటి  పడుతోంది.  ఆలయ నిర్మాతల పేర్లు వగైరా లోపల బోర్డులున్నాయిటగానీ చీకట్లో కనిపించలేదు.  ఆలయం ముందు బోర్డు బెంగాలీలో వుంది.  పక్క షాపులో వ్యాపారి ఈ మాత్రం వివరాలు ఇచ్చారు.

ఈ ఆలయానికి ఎదురుగానే కరివెనవారి సత్రం.  అక్కడ తెలిసినవారిని పలకరించటానికి మా పిన్ని వెళ్ళి వచ్చే లోపల ఆలయం బయట అరుగు మీద కూర్చున్నాం.  నాకు సంతోషం కలిగించే విశేషం.  అక్కడ ఒక జంట పరిచయమయ్యారు.  వారు మాకన్నా ఎక్కువగా ఎన్నో యాత్రలు చేస్తున్నారు.  మాకూ ఆ అలవాటున్నదంటే అది చూశారా, ఇది చూశారా అంటూ ఎన్నో చెప్పారు..కొన్నింటి పేర్లుకూడా వినలేదు నేను.  ఎంత వెనకబడి వున్నానో అనిపించింది. 

అక్కడనుండి నెమ్మదిగా కేదారేశ్వర్ ఆలయం చేరాం.  ఆలయం విశాలంగా, బాగుంటుంది.   ఇక్కడ ఘాట్ ని కేదార్ ఘాట్ అంటారు.  ఆలయం వెనుక గంగ ఒడ్డుకి వెళ్తే  ఆలయాన్ని ఆనుకుని వున్న ఉపాలయంలో పెద్ద శివలింగం హరిశ్చంద్ర ప్రతిష్ట అని చెప్తారు.  ఇక్కడనుంచి హరిశ్చంద్ర ఘాట్ లో (పక్కనే వున్నది) శవాలు కాలటం కనబడుతుంది.

అక్కడనుంచి ఇంక అడుగు వేసే ఓపిక లేక పోయింది.  నడిచీ నడిచీ అంత అలిసిపోయాము.  కొంచెం దూరం నడిచి ఎలాగో ఒక ఆటోలో వేరే  దోవలో సత్రం చేరాం.

వచ్చే పోస్టులో కాశీ విశ్వనాధునికి అభిషేకాలు.

 పై రెండు ఫోటోలూ శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిర్ వి
రామ్ గులాలేశ్వర్ మహాదేవ్ మందిర్

 హరిశ్చంద్ర ప్రతిష్టిత లింగం































0 comments: