Tuesday, February 9, 2010

ఆనంతగిరి




ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదుకి 90 కి.మీ. ల దూరంలో, రంగారెడ్డి జిల్లాలోని వికారాబాదుకి కేవలుం 5 కి.మీ దూరంలో వున్నది ఈ అనంతగిరి. ఇది అటవీ ప్రాంతం. మీరెళ్ళి జంతువులకోసం వెతక్కండి. కనిపించవు. ఇక్కడ ఈ కొండమీద శ్రీ అనంత పద్మనాభ స్వామి వెలిశాడు.

చాలా వేల ఏళ్ళ క్రితం శివ సాక్షాత్కారం తర్వాత మార్కండేయ మహర్షి ఇక్కడ ఒక చిన్న గుహలో తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, మార్కండేయుని కోరికమీద అక్కడ సాలగ్రామ రూపంలో వెలిశాడు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మి. ఈ గుహలో ఒక చిన్న ద్వారం కనబడుతుంది. అది కాశీకి సొరంగ మార్గమని, మార్కండేయ మహర్షి ఆ సొరంగంద్వారా రోజూ కాశీకి వెళ్ళ గంగా స్నానం చేసి వచ్చేవాడని చెప్తారు.

ఇక్కడే హైదరాబాదులో ప్రసిధ్ధికెక్కిన ముచికుందానది పుట్టింది. అర్ధంకాలేదా మూసీ నదండీ. ఇప్పుడర్ధమయిందికదా. ఆ కధేమిటంటారా మార్కండేయుడు ఇక్కడ తపస్సు చేస్తున్న సమయంలోనే ముచికుందుడు అనే ఒక రాజర్షి వుండేవాడు. ఆయన ఒకసారి రాక్షసులతో చాలాకాలం యుధ్ధం చేసి వారందరినీ సంహరించాడు. ఆ యుధ్ధంలో చాలా అలసిపోయి విశ్రాంతి తీసుకోదలచి, భూలోకంలో తనకి నిద్రాభంగంకాని ప్రదేశాన్ని చెప్పమంటాడు. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రదేశంగురించి చెప్తాడు. ముచికుందుడు ఇకొంచెం జాగ్రత్తపడి, తన నిద్ర ఎవరైనా భంగం చేస్తే, ఆ సమయంలో అతని చూపు ఎవరిమీద పడుతుందో వాళ్ళు భస్మమయిపోవాలని ఇంద్రుడినుంచి వరం పొందుతాడు. ఇంత జాగ్రత్తపడి ముచికుందుడు వచ్చి ఇక్కడ నిద్రపోయాడు.

అది ద్వాపరయుగం. శ్రీకృష్ణుడు కంస సంహారం తర్వాత తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో కాలయవనుడు అనే రాక్షసుడు ద్వారక మీదకు దండెత్తివచ్చి, యాదవసేనను నాశనం చేసి మధురా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
శ్రీ కృష్ణ బలరాములు అతనిని సంహరించటానికి ముచికుందుడు సరైన వాడనుకుని, వారు కాలయవనునికి భయపడినట్లు నటించి, ముచికుందుడు నిద్రిస్తున్న ఈ ప్రాంతానికి వచ్చారు. వారి వెనకే కాలయవనుడూ వచ్చాడు. శ్రీ కృష్ణుడు తన వస్త్రాలని ముచికుందుని మీద కప్పి తాను పక్కకి తప్పుకున్నాడు. కాలయవనుడు నిదురిస్తున్న ముచికుందుడే శ్రీ కృష్ణుడనుకుని అతనికి నిద్రాభంగం కావిస్తాడు. వెంటనే అతని తీక్షణమైన చూపులకు భస్మమయిపోతాడు.

ముచికుందుడికి శ్రీకృష్ణ బలరాములు ప్రత్యక్షమవుతారు. ముచికుందుడు సంతోషంతో వారి పాదాలు కడుగుతాడు. ఆ నీరే పారి ముచికుందా నదిగా (మన ఇప్పటి మూసీ) పేరుగాంచిందంటారు.

చూశారా మన సమీపంలో వున్న అనంతగిరికి ఎంత పురాణ ప్రఖ్యాతి వుందో. మరింకేం ఒక సెలవురోజు ఈ జనారణ్యానికి దూరంగా ఆ చిట్టడవిలో హాయిగా విహరించి, అక్కడి వృక్షాల వూడలమీద హాయిగా విశ్రమించి, ఊయలలూగి సరికొత్త బలాన్ని పుంజుకునిరండి. అలాగే మార్కండేయుడు తపస్సు చేసిన చిన్ని గుహలోని శ్రీ అనంత పద్మనాభుని సేవించి మానసిక సంతృప్తినికూడా పొందండి.

ఆహారాన్ని తీసుకు వెళ్ళటం మాత్రం మర్చిపోవద్దు.



Monday, February 1, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా - 5



లేపాక్షి

ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం వున్నది.  ఆలయం పెద్దది.  ఇందులోనే శివకేశవులకి మందిరాలున్నాయి.  వీరభద్రస్వామి గర్భగుడి ముందు ఒక స్ధంబంలో దుర్గమాత పెద్ద విగ్రహం వున్నది.  స్ధంబాల మీద చెక్కిన శిల్పాలన్నీ చాలా బాగున్నాయి.  ఒక స్ధంబంమీద ఉత్తమ జాతి స్త్రీ (పద్మినీ జాతి) శిల్పం, ఇంకో స్ధంబం మీద ఉత్తమ జాతి పురుషుని విగ్రహాలు చెక్కబడి వున్నాయి.  ఉత్తమ జాతి స్త్రీ పురుషుల శారీరక లక్షణాలు ఎలా వుండాలో ఆ శిల్పాలను చూసి తెలుసుకోవచ్చు.  ఆ విశేషాలు పూజారిగారు వివరించి చెప్పారు. 

గుడి వెనుక ఐదు తలల నాగేంద్రుడి శిల్పం వుంది.  ప్రసిధ్ధికెక్కిన లేపాక్షి బసవన్న విగ్రహం ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో వుంది.  అక్కడ గైడు వున్నారు.    మాలాంటివాళ్ళకోసం ఆలయంలోకూడా గైడు వుంటే బాగుండేదనిపించింది.

ఇవన్నీ చూసి సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి హిందూపూర్ వచ్చి 7 గంటలకి హైదరాబాద్ బస్ ఎక్కాం.

(ఈ సచిత్ర వ్యాసం 31-12-2009 ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది.  ఆ సమయంలో నా యాషికా తో తీసిన ఫోటోలు ఆంధ్రభూమి వారికి పంపగా మిగిలినవి కిందటి పోస్టుల్లో పెట్టాను.  అందుబాటులో లేని కారణంగా లేపాక్షి ఫోటోలు ఇవ్వలేకపోతున్నాను.  ప్రస్తుతానికి అనంతపురం జిల్లా యాత్ర సమాప్తం).


Thursday, January 28, 2010

ఆకట్టుకునే అనంతపురం జిల్లా--4



పెనుగొండ


మర్నాడు ఉదయం హిందూపూర్ నుంచి ఒక గంట ప్రయాణం చేసి మళ్ళీ వెనక్కి పెనుగొండ వచ్చాం. పేరుకి తగ్గట్లే పెద్ద కొండ.  కొండమీద కోట.  కొండ దిగువ శ్రీకృష్ణ దేవరాయలవారి సమ్మర్ పేలెస్..(.చిన్నదే)..వున్నది.  అక్కడ గైడ్ వున్నారు.  గైడ్ సహాయంతో పేలెస్ చూశాం.  ఆయన ఇచ్చిన సమాచారంతో ఈ పెనుకొండ గుత్తికొండకన్నా పెద్దదనీ, కొండమీద కోటశిధిలాలు, లక్ష్మీ నరసింహస్వామి గుడి వున్నాయని తెలుసుకున్నాము.  అలసిపోయి వున్న మేము కొండ ఎక్కటం కష్టమని ఆ ప్రయత్నం చెయ్యలేదు.

ఈ ఊళ్ళో ఇంకో విశేషం...శ్రీ కాళేశ్వరరావు అనే ఆయన చాలా అందంగా, ఆధునాతనంగా షిర్డీసాయి గుడి కట్టించారు.  ఉదయం, సాయంకాలాలలో కొంచెంసేపు మాత్రమే అందరికీ దర్శనం.  విదేశీయులు చాలామంది వచ్చి అక్కడే వుండి, గుళ్ళో మెడిటేషన్ చేసుకుంటారు.  అందుకే వాళ్లకి అంతరాయం లేకుండా అందర్నీ దర్శనానికి కొంచెంసేపు మాత్రమే అనుమతిస్తారు.  మేము వెళ్ళిన సమయం దర్శన సమయం కానందున లోపల చూడలేకపోయాము.  బయటనుంచి చూస్తేనే ఆకర్షణీయంగా వుంది.

అక్కడనుంచి  ఆ ఊళ్ళోనే వున్న కుంభకర్ణ గార్డెన్స్ కి వెళ్లాం.  చాలా పెద్ద కుంభకర్ణుడి విగ్రహం,....నిద్రిస్తున్న కుంభకర్ణుణ్ణి నిద్రలేపే దృశ్యం.....ఆ శిల్పం ఒక్కటే అక్కడి ఆకర్షణ  ఆ గార్డెన్స్ ప్రక్కనే చిన్న ఆంజనేయస్వామి ఆలయం వుంటే చూసి, మధ్యాహ్నం 2-40 కల్లా బస్సులో హిందూపూర్ చేరుకున్నాం.  రాత్రి 7 గంటల బస్ లో హైదరాబాద్ తిరిగి రావటానికి రిజర్వు చేసుకున్నాం.  ఈ లోపల అక్కడికి దగ్గరలోనే వున్న లేపాక్షి చూడాలనుకున్నాం.

3-00 గంటలకు హిందూపురం బస్టాండులో ఒక ఆటో అతనికి మా హైదరాబాద్ బస్ సంగతి చెప్పి, ఈ లోపల లేపాక్షి చూపించి తీసుకు రావాలని చెప్పి ఆ ఆటోలో లేపాక్షి బయల్దేరాం.  రేపు ఆ ముచ్చట్లు.     



   కుంభకర్ణుడి విగ్రహం


కృష్ణదేవరాయల సమ్మర్ పెలేసు


Thursday, January 14, 2010

తాడిపత్రి -- ఆకట్టుకునే అనంతపురం – 3


తాడిపత్రి  --  ఆకట్టుకునే అనంతపురం – 3

మర్నాడు ఉదయం 9-30కి కాఫీ ఫలహారాలయ్యాక ఆటోలో  తాడిపత్రిలో వున్న దేవాలయాల దర్శనానికి బయల్దేరాం.

బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం

పురాతనకాలంనాటి శివాలయం ఇది.  శివలింగం ముందునుంచి ఎంత తోడినా వెంటనే నీరు  ఊరుతూ వుంటుంది.  అందుకే ఈ స్వామికి బుగ్గరామలింగేశ్వరుడని పేరు.  రెండు గాలి గోపురాలు కొంత శిధిలమయ్యాయి.  కానీ అద్భుతమైన శిల్ప సంపద బేలూరు, హొళెబీడు దేవాలయాలను గుర్తు తెచ్చింది.




 



తర్వాత కన్యకాపరమేశ్వరి దేవాలయం.. కొత్తదే, వెళ్ళాం.  ఉదయం 10 గంటలకే మూసేస్తారుటు, దర్శనం కాలేదు.  అలాగే మార్కండేయస్వామి గుడి కూడా మూసి వున్నది.

చింతల వెంకట రమణమూర్తి ఆలయం

ఈ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి చింతలే వుండవంటారు.  అందరి చింతలూ తీర్చేవాడు కనుక ఆ స్వామికి ఆ పేరు.  ఈ ఆలయం శిల్పకళ కూడా బాగుంది.



 


ఇక్కడనుంచీ దగ్గరలోనే వున్న ఆదూరుకోన శ్రీ నరసింహస్వామి ఆలయానికి తీసుకెళ్లాడు మా ఆటో డ్రైవర్.  లోకల్ ఆటోవాళ్ళు మనకి చూడదగ్గ ప్రదేశాల గురించి మంచి సమాచారం ఇస్తారు.  మేము చూసిన ఈ ఆదూరుకోనలోని పురాతన నరసింహస్వామి ఆలయం, దీని తర్వాత కట్టబడిన ఓబులేశుకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చూడగలిగామంటే మా ఆటో డ్రైవర్ వల్లనే.

మధ్యాహ్నం 2-15 గం. లకి హోటల్కి చేరుకుని రెండు గంటల విశ్రాంతి తర్వాత మళ్లీ ప్రయాణం మొదలు.  అనంతపూర్ దాకా ఒక బస్ (1 గంట 15 నిమిషాల ప్రయాణం), ఆక్కడనుంచీ హిందూపూర్ బస్ ఎక్కి పెనుకొండలో దిగేసరికి రాత్రి 8 గంటలు దాటింది.  అక్కడ వుండటానికి సరైన హోటల్ దొరక్కపోవటంతో మళ్లీ వేరే బస్ ఎక్కి హిందూపూర్ చేరుకుని (ఒక గంట ప్రయాణం) అక్కడ హోటల్ లో రూమ్ తీసుకున్నాం.

తదుపరి పోస్టులో పెనుకొండలో చూసినవీ చూడనివీ.

Sunday, January 3, 2010

గుత్తికొండ -- ఆకట్టుకునే అనంతపురం – 2


గుత్తికొండ 

రెండో రోజు గుత్తికొండ చూడటానికి బయల్దేరాం.  కొండదాకా ఆటోలో వెళ్ళాము.  కొండ ఎత్తు ఎక్కువగానే వుంది.  దోవ, పైదాకా రోడ్డులాగా విశాలంగా వుంది.  దోవ అంతా ఆ కాలంలోనే పెద్ద పెద్ద గ్రెనేట్ రాళ్ళు (గోడ పునాదులకి వుపయోగించేలాంటివి) వేశారు.  ఎక్కటానికి తేలిగ్గా వుంది, కానీ దిగేటప్పుడు స్లోపు మూలంగా కాలికి పట్టు దొరక్క కొంచెం ఇబ్బంది అనిపించింది.  కొంచెం దూరం ఎక్కిన తర్వాత దోవలో సయ్యద్ సాహెబ్ దర్గా వుంది.

గుత్తికొండ మీద వున్ కోటకి 17 ద్వారాలు వున్నాయి.  నీటిని నిల్వ చేసుకునే సౌకర్యాలు బాగున్నాయి.  బావులు చాలా వున్నాయి.  మేము 6 బావులు చూశాం.  అంత ఎత్తయిన కొండ మీద నీటి నిల్వకి ఆ రోజుల్లో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే ఏ టెక్నాలజీ లేని రోజుల్లో, ఎంత ముదుచూపుతో ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నరోనని ఆశ్చర్యం వేస్తుంది.  ఒక ఏడాది దాకా అక్కడ కోటలో వాళ్ళెవరూ బయటకు రాకపోయినా దేనికీ ఇబ్బంది రాని విధంగా ఏర్పాటు చేసుకున్నారు.  చాలా పెద్ద అశ్వశాల, ధాన్యాగారం, పైన పేలెస్ ఇప్పుడు లేదు కానీ శిఖరాగ్రాన ఒక గుండ్రటి స్టేజ్ లాగా ఎత్తయిన రాతి కట్టడం వుంది.

సందర్శకులెవరూ లేరు.  అంత పెద్ద కొండమీద మేమిద్దరమే అయ్యేసరికి పైదాకా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంటే అనంతపురం నుంచి వచ్చిన ఒక కుటుంబం కలిశారు.  అందులో ఒకరు శ్రీ భాస్కర్, గుత్తిలో సిండికేట్ బ్యాంకులో పని చేస్తున్నారు.  వాళ్ళుకూడా రావటంతో పైదాకా ఎక్కాం.  అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా పైకి ఎక్కేసరికి 2-30 గంటల సమయం పట్టింది మాకు.

సాయంత్రం 4-30 కల్లా హోటల్ కి వచ్చి రూమ్ వెకేట్ చేశాం.  తాడిపత్రి వెశ్దామని ప్లాన్.  దోవలో తొండపాడు చెన్నకేశవ స్వామి గుడి బాగుంటుందంటే చూసి వెళ్దామని ఆటోలో బయల్దేరాం.  అరగంటలో తొండపాడు చేరాం.  కానీ అసలు గుడి కొండమీద వున్నది.  కింద చిన్న గుళ్ళో ఉత్సవ విగ్రహాలు వున్నాయి.  చుట్టూ యాత్రికులు వుడటానికి గదులున్నాయి.  కొండమీదకి చాలా మెట్లున్నాయి.  గుత్తికొండ ఎక్కి దిగాంకదా, ఇంక ఎక్కలేకపోయాం.  ఆ గుడి దగ్గరే తాడిపత్రి బస్ ఎక్కాం.  అక్కడినుంచి తాడిపత్రికి గంటన్నర ప్రయాణం.  తాడిపత్రిలో బస్టాండు దగ్గరే హోటల్ లో రూమ్ తీసుకున్నాం.

తాడిపత్రి వివరాలు తర్వాత పోస్టులో.
                                                                                                       
                                                                                                      



అశ్వశాల ఎంత పెద్దదో ఫోటోలో అంతా రాలా

నీటి బావి 

 కొండమీద దృశ్యం



కొండ పైకి వెళ్ళే ద్వారం