Sunday, February 21, 2010

మా ఊరు




గుంటూరు జిల్లాలోని తెనాలి మా ఊరు. మా ఆఫీసులో చేరిన కొత్తల్లో నా ధైర్యాన్ని చూసి ఏ ఊరి అమ్మాయి అని కూపీ లాగారు కొందరు. తెనాలి అమ్మాయి జాగ్రత్త అని సమాధానం విన్నారుట వాళ్ళు. ఆ సంగతి నా దాకా వచ్చినప్పుడనుకున్నాను...మా తెనాలికి ఇంత ఖ్యాతి వుందా...ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిలంటేనే జాగ్రత్తగా వుంటున్నారే...శభాష్ తెనాలీ అనుకున్నా ఆ రోజు. రెండు రోజుల క్రితం మైల్ లో శ్రీ అనిల్ అట్లూరిగారు తెనాలి గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గాగారు వ్రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-2-2010 నవ్య అనుబంధంలో ప్రచురించబడినదాని లింకు పంపితే చదివాను. ఎంత గొప్పదో మా తెనాలి అనుకున్నాను మళ్ళీ.
http://bit.ly/Tenali_Sutasramam

1963-64 ల్లో తెనాలిని వదిలి హైదరాబాద్ వచ్చేశాను. ఈ 46 ఏళ్ళల్లో హైదరాబాదుతో అనుబంధాలు పెనవేసుకుపోయి ఇదే మా ఊరు అనుకున్నా, చిన్నతనాన్నీ, పెరిగిన ఊరునీ మర్చిపోలేముకదా. ప్రస్తుతం తెనాలిలో దగ్గరవారెవరూ లేక పోయినా చిన్ననాటి ఆ ప్రదేశం ఎలా వున్నదోనని ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాము. ఎంత మార్పో. గుర్తుపట్టలేనంత మార్పు.

బయటనుంచీ చూస్తే నేను చదివిన తాలూకా హైస్కూలు చిన్నదయిపోయినట్టు కనిపించింది. కొత్త కట్టడాలవల్ల అనుకుంటాను. దేవీ చౌక్ లోని దేవీ గుడి అలాగే వున్నది. దేవీ నవ రాత్రులు ఎంత వైభవంగా జరిగేవో ఇక్కడ. మేము అక్కడ వున్న కొన్నేళ్ళు సందడంతా మాదే. అలాగే స్వరాజ్ టాకీస్ కి కొంచెం అవతలగా ఆంజనేయ స్వామి దేవాలయం. శ్రీ రామ నవమికి 9 రోజులు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి అక్కడ.

రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం...మేము వున్నప్పుడు చాలా పాతగా వుండేది. 1911లో ప్రతిష్టింపబడిన ఈ దేవ దేవునికి 76 సంవత్సరాలు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరగలేదు. 1987 జూన్ నెలలో శ్రీ పినపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారిచే ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. 1988 లో విమాన గోపుర నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ఇప్పుడు కొత్త రంగులతో తళుకులీనుతోంది.

ఇక్కడే మేమున్న ఇంటికి ఎదురుగూ శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రిగారిల్లు వుండేది. ఆయన చాలా ప్రసిధ్ధికెక్కిన హరికధా భాగవతార్, కర్ణాటక సంగీత విద్వాంసులు.

నాకు తెలియకుండానే అనేక సార్లు తన గుడికి రప్పించుకున్న సాయిబాబా మందిరం...స్వరాజ్ టాకీస్ దగ్గరవుంది. మేమున్నప్పుడు బాబా గర్భ గుడి ముందు విశాలమైన మండపంలాగా వుండేది. సాయంకాలాలు అక్కడ పురాణ కాలక్షేపాలు జరుగుతూ వుండేవి. ఇప్పుడు అక్కడ ధుని, బాబా ఫోటోలు వున్నాయి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి జరుగుతోంది. ఆ వీధిలో మేమున్న ఇల్లు గుర్తుపట్టలేకపోయాను.

అలాగే వైకుంఠపురం...మే మక్కడవుండగా దేవేరులతో సహా శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం కొంచెం ఎత్తయిన ప్రదేశంలో పడుకోబెట్టినట్లు వుండేవి. పూజలు జరుగుతూ వుండేవీ. భక్తులు వస్తూండేవారు. ఇప్పుడో చక్కని ఆలయం నిర్మింపబడింది. అనేక ఉపాలయాలు. దైవ దర్శనమే కాకుండా శుభ కార్యాలు గూడా దైవ సమక్షంలో చేసుకుంటున్న భక్తులు... చాలా కోలాహలంగా వుంది.

ఆలయాలు, ఊరు ఎంతో అభివృధ్ధి చెందాయి. కానీ ఎందుకో అవ్వన్నీ మేమున్న సమయంలోనే బాగున్నాయనిపించింది. బహుశా ఆ పరిసరాలు అప్పుడు మాకు పంచి ఇచ్చిన ఆత్మీయతవల్ల అనుకుంటా.

శ్రీ సాయిబాబా దేవాలయం (స్వరాజ్ టాకీస్ దగ్గర)
శ్రీ సాయిబాబా

వైకుంఠపురం
.

6 comments:

Rao S Lakkaraju said...

శ్రీరామ నవమికి రోడ్ల మీద వరసగా వేసే పందిళ్ళు వడపప్పు పానకం ఇంకా మరచిపోలేదు.

మైత్రేయి said...

ఎన్నాళ్ళనుండో చూడాలను కొంటూ మొన్న బాపట్ల వెళ్ళినప్పుడు పని గట్టుకు వెళ్ళానండి మీ తెనాలి. కొంచం రోద రోద గా ఉన్నది. చిన్న ఇంట్లో చాలా మంది కాపురంఉంటున్నట్లు.
ఊరు ఇంకా పెరగాలి. సెంటర్ లో ముఖ్యం గా రోడ్లు వెడల్పు చెయ్యటం, వన్ వే పెట్టటం, మైకు రోద లేకుండా నియంత్రించటం జరగాలి.
ఆంధ్రా పారిస్ అని ఎందుకంటారో నాకు తెలిసింది. అక్కడ, చుట్టు పక్కల ఊర్లలో కాస్త స్తితిమంతులు ఉన్నందు వల్ల నగ నట్ర పెట్టుకొని అందం గా అలంకారం గా ఉంటారు అమ్మాయిలు.
అసలే నేను పండగ రోజుల్లో వెళ్ళాను. పిల్లలు చక్కగా పాపిడి బిళ్ళలు జడ గంటలూ పట్టులంగాలు వేసుకొని సైకిళ్ళపై స్కూళ్ళకు కాలేజిలకూ వెళ్తున్నారు.
అక్కడి వ్యాపారస్తులు ముఖ్యం గా తర తరాల నుంచి వెండి బంగారం వస్తువులు చేసే వాళ్ళు నమ్మకం ఆధారం గా వ్యాపారం చేస్తుంటారు. చక్కటి క్వాలిటీ, మంచి మోడల్స్ కావాలంటే బంగారం వెండి అక్కడ ఆర్డర్ పై ధైర్యం గా చేయించు కోవచ్చు. ఇప్పటి తరం కూడా అలా విలువలతో వ్యాపారం చేస్తే గుంటూరు జిల్లా వాసులంతా ఏ దేశం వెళ్ళినా ఎప్పటికీ ఇలాగే తెనాల్లోనే కొంటూ ఉంటారు.
అన్నట్లు అక్కడ వేడి వేడి బెల్లం జిలేబి తిన్నారా ?

psm.lakshmi said...

రావుగారూ
ఆ ఉత్సవాలు మధుర స్మృతులే. ఇప్పటి ఉత్సవాలకీ వాటికీ ఎంత తేడా
psmlakshmi

psm.lakshmi said...

మైత్రేయిగారూ
మా తెనాలికి ఇంకో కలికి తురాయి పెట్టినందుకు సంతోషం. వేడి వేడి బెల్లం జిలేబీనే కాదు అచ్చులు పోసిన వెన్న వుండలు కూడా.
psmlakshmi

కౌటిల్య said...

లక్ష్మి గారూ,
తెనాలితో మాకు కూడా అనుబంధం ఎప్పట్నుంచో ఉందండీ...మా ఇళ్ళల్లో సవర బంగారం కొనాలన్నా తెనాలి ప్రయాణం కడతారు....మంచి క్వాలిటీ దొరుకుతుంది కదా...ఇక జాతిరాళ్ళు సరేసరి...అసలు కోహినూర్ వజ్రం తెనాలి ప్రాంతంలోనే మొదట దొరికిందంటారు.....నాన్నగారు gemmologist..నెలకి రెండుసార్లైనా తెనాలి వెళ్ళొస్తుంటారు....

పరిమళం said...

లక్ష్మిగారు నాన్నగారి ఉద్యోగరీత్యా మేమూ దాదాపు ఏడు సంవత్సరాలు తెనాలిలోనే ఉన్నాం .రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం.నేనుకోగంటి శివయ్య మున్సిపల్ స్కూల్ లో చదువుకున్నా ! మీ టపా చూడగానే తప్పిపోయిన నేస్తం కనిపించిన ఫీలింగ్ కలిగింది . పెద్ద బజార్ లో శ్రీ రామనవమి పందిళ్ళు ..దేవీ చౌక్ ..వైకుంఠ వెళ్ళాలంటే దోనె మీద చిన్న కాలువ దాటి వెళ్ళాల్సి వచ్చేది .స్వరాజ్ టాకీస్ తో నాకు విడదీయరాని అనుబంధం ఉంది అది ..ఆ హాల్లో మార్నింగ్ షో ఎప్పుడూ దేవుడి సినిమాలే ఆడేవి .భక్త సిరియాళ,దేవీ మహత్యం ..ఇలాగన్నమాట :) అప్పట్లో అమ్మ నెలకో సినిమా అదీ స్వరాజ్ టాకీస్ లోనే చూపించేది .మీలాగే నాక్కూడా మళ్ళీ ఒకసారి తెనాలి వెళ్ళాలన్న కోరిక అక్కడెవరూ లేకపోయినా...మీ టపా చదివాక అది మరింత బలపడింది .ధన్యవాదాలండీ !