Monday, February 14, 2011

పుట్టింటి కులదేవత

అన్నయ్య శ్రీ రాధాకష్ణమూర్తి, వదిన శ్రీమతి అనంత వరలక్ష్మి
కులదేవత -- అంకమ్మ పూజ
మాలో కొందరు
శ్రీచక్రార్చన సందర్భంగా సువాసినీ పూజ

శ్రీచక్రాధిదేవతకు సువాసినుల కుంకుమార్చన

మేము --మేమే
పూజలకిముందు గణపతి పూజ


పుట్టింటిమీద అభిమానంలేని ఆడవారెవరుంటారు చెప్పండి!!?? వారి ఆప్యాయతానురాగాలకి తపించని వాళ్లుంటారా? మేమేమో అంతా ఆడ పిల్లలమే. చిన్నప్పుడు మా అమ్మ శ్రీమతి జయలక్ష్మీ సుశీల మేమంతా ఆడపిల్లలమని ఒకే ఒక్క విషయానికి దిగులు పడేది. ఇంటికి అల్లుళ్ళొస్తే సరదాగా గడపటానికి బావ మరిది లేడనీ, మమ్మల్ని అప్పుడప్పుడూ ఇంటికి పిలిచి పసుపూ కుంకుమ పెట్టటానికి మగ తోడు లేడనీ. మా నాన్నగారు శ్రీ పులిగడ్డ జనార్దనరావుగారు, మేము సరదాగా తీసేసేవాళ్ళం..ఒకళ్ళో ఇద్దరో వుంటే ఇంతమందికీ పసుపు కుంకుమ పెట్టటానికి వాడికి ఎంత జీతం వచ్చినా సరిపోదులే..దానికి దడిసే వాడీ భూమ్మీదకి రావటంలేదు.. అని.

మా అమ్మ ఆవేదన కనుక్కున్నాడేమో ఆ భగవంతుడు మా పెదనాన్నగారి పిల్లల రూపంలో మాకీలోటులేకుండా చేశాడు. మా పెదనాన్నగారు కీ. శే. శ్రీ పులిగడ్డ వెంకట సుబ్బారావుగారు శ్రీవిద్యోపాసకులు...సన్యాసాశ్రమాన్ని స్వీకరించి కృష్ణా జిల్లా గన్నవరంలోని చిదానందాశ్రమములోని పీఠాధిపతులుగా వ్యవహరించారు. పీఠాధిపత్యం స్వీకరించిన అనతికాలంలోనే ఆశ్ర్రమంలో శ్రీచక్రాన్ని, భువనేశ్వరీ అమ్మవారినీ స్ధాపించి, భువనేశ్వరీ పీఠమని నామకరణ చేసి, నిత్యార్చనలు చేశారు.

మా పెదనాన్నగారి అబ్బాయి శ్రీ హనుమంతరావు, కళ్యాణానంద పీఠము, హైదరాబాదు. ఈయనకూడా శ్రీ విద్యోపాసకులు. మా పెదనాన్నగారు, మానాన్నగారులాగానే (అన్నట్లు మా నాన్నగారు కూడా శ్రీ విద్యోపాసకులే) శ్రీ చక్ర నవావరణార్చనలు అనేకమార్లుచేశారు…ఇంకా చేస్తున్నారు. మా నాన్నగారు పోయినప్పుడు ఆయన అంత్యక్రియలు వీరే నిర్వహించారు. మా నాన్నగారు గతించి 13 సంవత్సరాలయినా ఇప్పటివరకూ ఒక్క సంవత్సరంకూడా తప్పకుండా ప్రతి సంవత్సరమూ శ్రధ్ధగా ఆబ్దీకములు కూడా పెడుతున్నారు. ఆ విధంగా మా నాన్నగారికి పుత్రులు లేని లోపం లేకుండా చేశారు. అంతేకాదు…మా ఏడుగురు అక్క చెల్లెళ్ళను వారి సోదరీమణులతో సమానంగా ఆదరించి, ఆభిమానించటమేకాదు, ఎవరూ ఊహించనివిధంగా తరచూ పసుపు కుంకుమలు, చీరె సారెలతో మమ్నల్ని ఆదరిస్తున్నారు. మా తమ్ముడికి అన్నివిధాలా సహకరిస్తూ, మమ్మల్నందరినీ ఆప్యాయతాభిమానాలతో ఆదరించే మా మరదలు శ్రీమతి గిరిజ మాకు మరదలు కన్నా సన్నిహిత స్నేహితురాలులాంటిది. మాకు సొంత సోదరుడు వున్నా ఇలా చేసేవాడుకాదేమో. అందుకే ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు మా పెదనాన్నగారి అబ్బాయి అనటంకన్నా మా తమ్ముడు/అన్నయ్య అనే చెబుతాం మా అక్క చెల్లెళ్ళం. వయసులో నాకన్నా చిన్నవాడుగనుక చేతులెత్తి నమస్కరించలేనుగానీ ఆ భువనేశ్వరీమాత తన చల్లని చూపులు వీరి కుటుంబంమీద నిరంతరం ప్రసరింపచేయాలని ప్రార్ధిస్తున్నాను.

ప్రస్తుతం విషయానికి వస్తే మా పెదనాన్నగారి పెద్ద కుమారుడు శ్రీ పులిగడ్డ రాధాకృష్ణమూర్తి విశాఖ పట్టణం జిల్లాలో రెవెన్యూ డిపార్టుమెంటులో మండల రెవెన్యూ అధికారిగా రిటైరు అయి, ప్రస్తుతం నర్సీపట్నంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. వారి శ్రీమతి, మా వదిన శ్రీమతి అనంత వరలక్ష్మి దగ్గరనుంచి ఫోను వచ్చింది. మన ఇంట్లో శ్రీ చక్రార్చన, అంకమ్మ నైవేద్యం పెట్టుకుంటున్నాము. ఆడబడుచులంతా తప్పక రావాలి అని. వదినగారి ఆహ్వానంకన్నా ఆడబడుచులకి ఆనందమింకేముంటుంది. మా కుటుంబాలలో ఏమైనా కార్యక్రమాలయినప్పుడు ఎప్పుడైనా కలుస్తూనే వుంటాంగానీ5, వారింటికి మేము వెళ్ళటం మొదటిసారి.

ఫిబ్రవరి 4 వ తారీకు సాయంత్రం 5-15 గం. ల కు వైజాగ్ వెళ్ళే బస్ లో బయల్దేరి మర్నాడు ఉదయం 7 30కు తునిలో దిగి, అక్కడనుండీ నర్సీపట్నం బస్ లో ఎక్కి 8-45 కి నర్సీపట్నంలో దిగాం. తునినుంచి నర్సీపట్నందాకా పచ్చని ప్రకృతి, పొగ మంచు..ప్రకృతికాంత సౌందర్యారాధనలో మనసంతా సంతోష భరితమైపోయింది. మమ్మల్ని చూడగానే పరుగున వాకిట్లోకొచ్చిన వదిన ఆత్మీయ ఆలింగనం, బంధువుల పలకరింపులతో అంతా సందడే..ఎటుచూసినా హడవిడే..సంతోషమే…

ఆ రోజు…ఫిబ్రవరి 5 వ తేదీ శ్రీ చక్రార్చన జరిగింది. అమ్మవారు సువాసిన్యర్చన ప్రీత. అందుకే శ్రీ చక్రార్చన సందర్భంగా తప్పనిసరిగా శ్రీవిద్యలో కొంత అర్హత సంపాదించుకున్న ముత్తయిదువని అమ్మవారి రూపంగా ఆహ్వానించి షోడశోపచార పూజ చేస్తారు.


మా పెదనాన్నగారి మిగతా అబ్బాయిలు శ్రీ ఉమామహేశ్వరరావు, (వీరి శ్రీమతి, విజయ వదిన చెప్పారనే ఈ కార్యక్రమాలగురించి పోస్టు రాస్తున్నా), శ్రీరామచంద్రమూర్తి (కవి), మనవళ్ళు శ్రీ రాజు, శ్రీ శ్రీనివాస్, ఇంకా కూతుళ్ళూ, మనవళ్ళూ, మనవరాళ్ళూ అందరూ కలిసి ముక్తకంఠంతో చేసిన లలితా సహస్రనామ స్తోత్రంతో ఇల్లు మారుమ్రోగింది. మా వాళ్ళందరివీ భలే కంఠాలు..అంతా ఒకే స్వరంతో సహస్రనామాలు చదువుతుంటే, దేవుడంటే ఇష్టంలేనివాళ్ళుకూడా అలా వింటారు.

మా అన్నయ్యగారి వియ్యంకులు నర్సీపట్నంలో విశాఖ మానవ వనరుల సంస్ధ (యన్.జీ.ఓ) సంస్ధాపకులు. ఆ సంస్ధ పెద్ద హాలులో మా విడిది. అందరం ఒకచోట చేరేసరికి పెళ్ళిసందడి మించిపోయింది మా సందడి. పైగా పెళ్లి కార్యక్రమాల హడావిడి ఏమీ లేదయ్యే. ఎన్ని కబుర్లో మా పెదనాన్నగారి అమ్మాయి శ్రీమతి ఉదయశ్రీ కవయిత్రి. తను రాసిన పాటలు పాడింది.

మర్నాడు మా పుట్టింటి కులదైవం అంకమ్మ నైవేద్యం. పుట్టింట్లో ఏశుభకార్యక్రమమైనా, ఏ ఆపదలను గట్టెక్కించటానికైనా ఈ తల్లిని కొలుస్తారు. ఇంటి కోడళ్ళల్లో పెద్దవాళ్ళు నలుచదరం చెక్కకి పసుపురాసి, మధ్యలో గుండ్రంగా కుంకంతో బొట్లు పెడతారు. ఆ బొట్టు పెట్టేటప్పుడు వారు మాట్లాడరు. తర్వాత పూజాదికాలు నిర్వర్తించి, వండిన పదార్ధాలన్నీ అన్నపురాశిమీద అమర్చి నివేదన చేస్తారు.

పూజా కార్యక్రమం తర్వాత మా అన్నయ్యనీ వదిననీ కూర్చోపెట్టి చిన్ని సత్కారం చేశాం. అందరం అన్నా వదినలు పెట్టిన కొత్త బట్టలతో సందడి చేశాం. భోజనానంతరం, తిరుగు ప్రయాణం. తునిదాకా వాళ్ళ వెహికల్ లో దింపితే అక్కడనుంచీ విశాఖ ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ చేరాం. రెండు రోజులు అన్నీ, అందరినీ మరచిపోయి ఎంతో సంతోషంతో గడిపి వస్తుంటే మాకెవ్వరికీ తిరిగి ఇళ్ళకి రాబుధ్ధికాలేదు.

అప్పుడప్పుడూ బంధుమిత్రులూ, స్నేహితులూ కలిసి అలా చెప్పుకునే కబుర్లు మళ్ళీ కొన్నాళ్ళు ఉత్సాహభరిత జీవితాలు గడపటానికి గొప్ప టానిక్ లా పని చేస్తాయికదా

0 comments: