ఇది 1964లో నిర్మింపబడిన పాలరాతి మందిరం. నిర్మాత సేఠ్ రతన్ లాల్ సురేఖా. భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడివున్నది. రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలుకూడా వున్నాయి. రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి.
కొంచెం ఎత్తుగా వుండే చిన్ని మందిరం ఇది. అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే. వాటి మహత్యమే అత్యున్నతం. ఈ గవ్వలమ్మ విశ్వనాధుని సోదరి అనీ, ఆవిడకి మడీ ఆచారాలు ఎక్కువనీ, వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడనిఊరు బయట దళితవాడలో వుండమని పంపాడని ఒక కధ. ఈవిడని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదనీ ఒక ప్రచారం. ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు. అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు.
లోకల్ ట్రిప్ లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే వుంటాయి. సారనాధ్ కూడా ఈ ట్రిప్ లోనే చూపిస్తారు.
కాశీలో దేవాలయాలు అనేకం. ఎన్ని చూసినా ఇంకా చూడనివి వుంటాయి. ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటోవారు, టాక్సీవారు ఒక పేకేజ్ కింద చూపిస్తారు. సమయం ఒక పూట పడుతుంది. అందులో మొదటిది
కాలభైరవ మందిరం
పరమ శివుని ఆగ్రహంనుంచి పుట్టిన వాడు కాలభైరవుడు. ఆయన ఒకసారి ఆబధ్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలని తన గోటితో తుంచేశాడు. బ్రహ్మగారిని తల తుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది. పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. లోకాలన్ని తిరిగినా పోని పాపం ఆయన కాశీకి రాగానే పోయింది. చేతికి అతుక్కున్న తల వూడి కిందపడింది. కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు మరి.
ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు. ఈయనకు చాలా పెద్ద పనులున్నాయి. కాశీకి వచ్చినవారివి, అక్కడ నివసిస్తున్నవారివీ పాప పుణ్యాల చిట్టాల మైయిన్టెయిన్ చెయ్యటం ఈయన డ్యూటీనే. వీళ్ళందరి పాపాలనూ కడిగివెయ్యటం కూడా ఈయన డ్యూటీనే. కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. మరి సాక్షాత్తూ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత వుండాలికదా. కాశీలో మరణించటమే ఆ అర్హత. వారి పాపాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చెయ్యటం కూడా భైరవులంగారు పనే. మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలికదా. దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు. అన్నట్లు యమ ధర్మరాజుకీ, చిత్ర గుప్తుడికీ కాశీలో నివసిస్తున్న వారిపైగానీ, అక్కడ మరణించిన వారిపైగానీ ఎటువంటి అధికారం లేదు. కానీ అంతకుమించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింప చేసే కాలభైరవుడిని దర్శించి సేవించటం మరువకండి.
విశ్వనాధుని ఆలయంనుంచి రెండు కిలో మీటర్ల దూరం లోపే వుంది ఈ ఆలయం.
సారనాధ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. ఇక్కడి స్తూపం ఎత్తు 143 అడుగులు. దీనిలోని రాళ్ళు ఇనప క్లాంప్స్ తో కలపబడ్డాయి.
దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు. 12వ శతాబ్దంవరకు అనేకసార్లు అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది. ఇక్కడ వున్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసంగావింపబడగా, ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చెయ్యబడ్డవి.
20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌధ్ధ ఆలయం కొత్తగా నిర్మింపబడింది. ఇక్కడ తవ్వకాలలో దొరికిన బౌధ్ధ అవశేషాలని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి సంవత్సరం బుధ్ధ పౌర్ణమినాడు వాటిని వూరేగిస్తారు.
ఇక్కడ ఆర్కయాలజీ మ్యూజియం దర్శించదగినది. మహాబోధి లైబ్రరీలో బుధ్ధుని గురించి అనేక పుస్తకాలు, వ్రాత ప్రతులు వున్నాయి.
7 వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రీకుడు హుయాన్స్వాంగ్ తన గ్రంధంలో ఇక్కడవున్న కట్టడాలగురించి వ్రాశాడు.
గయనుంచి 12 కి.మీ. దూరంలో వున్న బుధ్ధగయ చేరుకున్నాము. ఇక్కడే సిధ్ధార్ధుడికి జ్ఞానోదయమైంది. భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి. అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన లుంబినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్, చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా. బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.
500 బి.సి. లో సిధ్ధార్ధుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు. మూడు రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. తర్వాత ఆయన అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడు వారాలు ధ్యానంలో గడిపారు. తరువాత ఆయన సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు.
బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుని గౌతమ బుధ్ధుని శిష్యులు వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చేవారు. కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.
బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు. ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే.
ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు. అశోక చక్రవర్తి పరిపాలనలో బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు.
బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది. ఇక్కడే ఆయన తపస్సు చేసింది.
ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి.
ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది.
7 వ శతాబ్దంలో భారత దేశ యాత్ర చేసిన చైనా యాత్రీకుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ గురించి రచించాడు.