Friday, August 14, 2009

శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తిరుమలగిరి

పాదాకృతిలోవున్న కోనేరు
కొండమీద ఆలయ దృశ్యం



శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తిరుమలగిరి

కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటనుంచి 8 కి.మీ.ల దూరంలో వున్నది తిరుమలగిరి. జగ్గయ్యపేట-విజయవాడ రహదారిలో జగ్గయ్యపేట దాటగానే చిన్నకల్లు దగ్గర ఎడమవైపు తిరిగి 3 కి.మీ. వెళ్తే వస్తుంది ఈ ఊరు. చిన్న కొండమీద వుంటుంది ఆలయం. ఇక్కడ విశేషం శ్రీ వేంకటేశ్వరస్వామికి రూపం వుండదు. పుట్ట ఆకారంలో వెలిశారు.

భరద్వాజ మహర్షి ముక్త్యాల దగ్గర కొండమీద తపస్సు చేసుకుంటుంటే తపస్సులో పుట్టలోనుంచి తేజస్సు రావటం కనిపించిందట. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టలోనుంచి వెలుగురావటం, కేశవ నామాలు వినబడటం జరిగిందట. పుట్టలోనుంచి స్వామివారు తనని కేశవనామాలతో అర్చించమని చెప్పటంతో ఆ పుట్టకు కేశవాది ద్వాదశనామాలు ఏర్పరచి ఆ నామాలతో పూజించసాగారు. ఆదిశేషు ఇక్కడ లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారుట. ఆదిశేషుకూడా ఇక్కడ వుండటంతో ఈ కొండకు శేషాచలమని పేరు వచ్చింది.

ఇక్కడవాళ్ళు చెప్పిన ఇంకొక విశేషం...ఇక్కడ కొండ ఎక్కినప్పట్నించ తిరిగి వెళ్ళేదాకా ఏదైనా కోరిక కోరుకుని స్వామిని తల్చుకుంటూవుంటే కోరిన కోరిక తప్పక నెరవేరుతుందట.

ఇక్కడ వెంకటేశ్వరస్వామి పుట్టలో వుండగా దాహం వేస్తే ఈశ్వరుడు గోవుగా బ్రహ్మ దూడగా వచ్చి స్వామి దాహం తీర్చారుట. తర్వాత ఒక భక్తుని దాహం తీర్చటానికి స్వామి తన పాదతాడనంతో ఒక బండరాయిని పగులగొడ్తే బండ రెండుగా చీలి మధ్యోలో నీరు వచ్చిందట. ఆలయానికి వెళ్ళే మెట్ల త్రోవలో ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా వేప, రావి చెట్లక్రింద ఈ పాదాకృతిలోవున్న కోనేరు చూడవచ్చు.

ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని రినోవేట్ చేశారు. ఈ ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గం. లనుంచీ సాయంత్రం 5 గం.లదాకా. సూర్యాస్తమయం అయితే కొండమీద ఎవరూ వుండరు. ఆ సమయంలో పెద్ద సర్పం ఆలయంలో తిరుగుతూ వుంటుందంటారు।


0 comments: